‣ మొత్తం 7 ప్రశ్న పత్రాలు
‣ సైన్స్లో రెండు పేపర్లు
‣ మే 31 వరకు పాఠశాలలు
‣ ప్రాథమికంగా షెడ్యూల్ నిర్ణయించిన అధికారులు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది నిర్వహించనున్న పదో తరగతి పరీక్షల్లో ఏడు ప్రశ్నపత్రాలుంటాయి. గతంలో ఉన్న 11ను 7కు కుదించారు. సైన్స్లో 2 పేపర్లుంటాయి. భౌతిక, రసాయన శాస్త్రాలు కలిపి ఒకటి, జీవశాస్త్రం మరో పేపర్ ఉంటుంది. మిగిలిన 5 సబ్జెక్టులకు 5 పేపర్లుంటాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి తేదీలను విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. ఇటీవల మంత్రి నిర్వహించిన సమీక్షలో పరీక్షల తేదీలు, పాఠశాలల పని దినాలతో కూడిన ప్రణాళికను అధికారులు సమర్పించారు. దీని ప్రకారం మే 31 వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. కొవిడ్ నేపథ్యంలో బడులను ప్రారంభించడంలో జాప్యం జరిగినందున 166 పని దినాలు వచ్చేందుకు వేసవి సెలవులను రద్దు చేశారు. రెండో శనివారం, ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో తరగతులు జరుగుతాయి. ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారులు వంద రోజుల పదో తరగతి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. పదో తరగతి పరీక్షలు జూన్ 7తో ప్రారంభమై 15తో ముగియనున్నాయి. పరీక్ష ఫీజును ఫిబ్రవరి 20 నుంచి మార్చి 10లోగా విద్యార్థులు చెల్లించాలి. జవాబు పత్రాల మూల్యాంకనం జూన్ 17 నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తారు. పరీక్ష ఫలితాలను జులై 5న ప్రకటించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు.
‣ భౌతిక, జీవ శాస్త్రం పరీక్షలు (ఒక్కో పేపర్ 50 మార్కులకు) ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు, మిగిలిన అన్ని పరీక్షలు (వంద మార్కులకు) ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తారు.
‣ జూన్ 15న ఎస్ఎస్సీ ఓకేషనల్ థియరీ పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు నిర్వహిస్తారు.
70% సిలబస్తోనే ఇంటర్ ప్రయోగ పరీక్షలు
కొవిడ్ నేపథ్యంలో కుదించిన కళాశాలల పని దినాల సంఖ్య మేరకు 2020-21 విద్యా సంవత్సరంలో నిర్వహించే సైన్స్ ప్రాక్టికల్స్ పరీక్షల సిలబస్ను 30శాతం తగ్గిస్తున్నట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది. తగ్గించిన సిలబస్ వివరాలను సబ్జెక్టులవారీగా అన్ని కళాశాలలకు పంపామని, అదే సమాచారాన్ని బోర్డు వెబ్సైట్ bie.ap.gov.in లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.