• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మేటి డిగ్రీ కళాశాలలు ఇవే!

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకులు సాధించిన సంస్థలు

దేశంలో ఎక్కువమంది విద్యార్థులు చదువుతోన్న యూజీ కోర్సుల్లో బీఏ, బీకాం, బీఎస్సీలే ముందుంటాయి. కొత్త కోర్సులు ఎన్ని వచ్చినప్పటికీ వీటి వన్నె తగ్గలేదు. అందుకే దిల్లీలో డిగ్రీ సీటు రావడం దుర్లభమవుతోంది. డిగ్రీ చదువుల ప్రాధాన్యం దృష్ట్యా కేంద్ర మావన వనరుల విభాగానికి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ఏటా కాలేజీల విభాగంలోనూ మేటి సంస్థల వివరాలను ప్రకటిస్తోంది. ఇటీవల వెలువరించిన 2021 ర్యాంకుల్లో మిరిండా హౌస్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో అత్యుత్తమ కళాశాలల వివరాలు చూద్దాం...

దేశంలో యూజీ స్థాయిలో డిగ్రీ కళాశాలలే ఎక్కువ. సుమారు కోటి ఎనభై లక్షల మంది భారత్‌లో బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సులు చదువుతున్నారు. ఉత్తర భారత దేశంలో ఇవే క్రేజీ కోర్సులు. దేశవ్యాప్తంగా నగరాల్లోని కాలేజీలకు అధిక పోటీ నెలకొంది. 

పేరున్న కళాశాలల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లూ నిర్వహిస్తున్నారు. వీరిని బహుళజాతి సంస్థలు (ఎంఎన్‌సీ) ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. కొన్ని సంస్థల్లో చదివినవారికి ఇంచుమించు ఐఐటియన్లకు అందించే ప్యాకేజీలు దక్కుతున్నాయి.

దిల్లీలోని మేటి కళాశాలల్లో యూజీ కోర్సుల్లో చేరాలంటే ప్లస్‌ 2లో 99 శాతం మార్కులు వచ్చినా సీటు గ్యారంటీ లేదు. మేటి డిగ్రీ కళాశాలలకు అడ్డాగా దేశ రాజధాని నిలుస్తోంది. టాప్‌ ర్యాంకుల్లో ఎక్కువ సంస్థలు అక్కడ నుంచే నమోదవుతున్నాయి. కాలేజీల కేటగిరీలో 2017 నుంచి ర్యాంకులు కేటాయిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే వరుసగా అయిదేళ్లూ మిరిండా హౌసే ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. బోధన, అభ్యసన వనరులు; పరిశోధనలు, వృత్తిగత నైపుణ్యాలు; గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసుకున్నవారు, విద్యార్థుల వైవిధ్యం, వారు చూపిన ప్రతిభ, సంబంధిత విద్యా సంస్థపై వివిధ వర్గాల నిపుణుల దృక్పథం..తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులు కేటాయించారు.

ప్రవేశం ఎలా?

దేశవ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఇంటర్మీడియట్‌/ ప్లస్‌2లో సాధించే మార్కులే కీలకం. దిల్లీ పరిధిలోని కళాశాలలకు దిల్లీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో వీటిని జరుపుతారు. అలాగే తెలంగాణలో దోస్త్, ఏపీలో ఓఏఎండీసీ వెబ్‌సైట్ల ద్వారా ప్రవేశాలు ఉంటాయి. పేరున్న కొన్ని డీమ్డ్, అటానమస్‌ సంస్థలు పరీక్షతో అవకాశం కల్పిస్తున్నాయి. మరికొన్నింట్లో నేరుగా ఇంటర్‌ అర్హతతో చేరిపోవచ్చు.

దేశంలో టాప్‌-10 కాలేజీలు 

1. మిరిండా హౌస్, దిల్లీ

2. లేడీ శ్రీరామ్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్, న్యూదిల్లీ

3. లయోలా కాలేజ్, చెన్నై

4. సెయింట్‌ జేవియర్స్‌ కాలేజ్, కోల్‌కతా

5. రామకృష్ణ మిషన్‌ విద్యామందిరం, హౌరా

6. పీఎస్‌జీఆర్‌ క్రిష్ణమ్మాళ్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్, కోయంబతూర్‌

7. ప్రెసిడెన్సీ కాలేజ్, చెన్నై

8. సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజ్, దిల్లీ

9. హిందూ కాలేజ్, దిల్లీ

10. శ్రీరామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్, దిల్లీ

తెలుగు రాష్ట్రాల్లో...

ఆంధ్ర లయోలా కాలేజ్, విజయవాడ 34

సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్, హైదరాబాద్‌ 85 

ఈ రెండే దేశంలోని టాప్‌-100 విద్యాసంస్థల్లో చోటు దక్కించుకున్నాయి. 

రాజమండ్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హైదరాబాద్‌లోని లయోలా అకాడెమీ, నిజాం కాలేజ్‌.. 151-200 ర్యాంకుల బ్రాకెట్‌లో నిలిచాయి. 

పై సంస్థలన్నీ వివిధ వైవిధ్య సబ్జెక్టుల కాంబినేషన్‌తో బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీఎఫ్‌ఏ, బీవొక్‌ కోర్సులు అందిస్తున్నాయి.
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎంబీఏ కళాశాల.. ఎంచుకునేదెలా?

‣ డిజైన్‌ కోర్సుల్లోకి డాట్‌ దారి

Posted Date : 15-11-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌