• facebook
  • whatsapp
  • telegram

రక్షణ రంగంలో మేటి కొలువులు

డిగ్రీతో సీడీఎస్‌ఈ దరఖాస్తుకు అవకాశం


సామాజిక గౌరవం, అధిక వేతనం, దేశ రక్షణలో పాలు పంచుకుంటున్నందుకు సంతృప్తి.. ఇవన్నీ త్రివిధ దళాల్లో ఉద్యోగాలతో సొంతమవుతున్నాయి. వీటిలో భాగం కావాలనుకున్న గ్రాడ్యుయేట్లు రాయాల్సిన పరీక్షల్లో సీడీఎస్‌ఈ ముఖ్యమైంది. ఇందులో అవకాశం వచ్చినవారు శిక్షణ తర్వాత నేరుగా లెవెల్‌-10 అధికారిగా విధులు నిర్వర్తించవచ్చు. భవిష్యత్తులో అత్యున్నత స్థాయినీ చేరుకోవచ్చు. ఇటీవలే  సీడీఎస్‌ఈ-2024(1) ప్రకటన వెలువడింది! 

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) ఏడాదికి రెండుసార్లు కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌ఈ) నిర్వహిస్తోంది. డిగ్రీ పూర్తయినవారు, చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవాళ్లు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలకూ అవకాశం ఉంది. నియామకాలు.. పరీక్ష, మెడికల్‌ టెస్టులు, ఇంటర్వ్యూలతో ఉంటాయి. 

 సీడీఎస్‌ఈ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఒక్కోటి 300 మార్కులకు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో ఐదు రోజులపాటు వివిధ కోణాల్లో అభ్యర్థిని గమనిస్తారు. పలు పరీక్షల ద్వారా వీరిని వడపోస్తారు. ఇలా అన్ని విభాగాల్లోనూ సత్తా చాటినవారిని శిక్షణకు తీసుకుంటారు. అభ్యర్థుల ప్రాధాన్యం, మెరిట్‌ ప్రకారం.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో సేవలు అందించవచ్చు. ఎయిర్‌ఫోర్స్‌ ఫ్లయింగ్‌ బ్రాంచ్‌లో అవకాశం వచ్చినవారికి పైలట్‌ శిక్షణ అందిస్తారు. అందులో రాణించినవారిని ఫైటర్‌ పైలట్‌గానూ తీసుకుంటారు. సీడీఎస్‌ఈతో త్రివిధ దళాల్లో వేటికి ఎంపికైనప్పటికీ సివిల్‌ సర్వెంట్లతో సమాన మూల వేతనం (లెవెల్‌ 10 పే) అందుకోవచ్చు. విధుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపినవారు భవిష్యత్తులో ఆర్మీ, నేవీ, ఎయిర్‌Âఫోర్స్‌లకు ఉన్నతాధికారీ కావచ్చు. 


 శిక్షణ

అభ్యర్థి ఏ విభాగంలో ఎంపికైనప్పటికీ శిక్షణ వ్యవధిలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్‌ చెల్లిస్తారు. మిలటరీ అకాడెమీకి ఎంపికైనవాళ్లకు ఇండియన్‌ మిలటరీ అకాడెమీ దేహ్రాదూన్‌లో 18 నెలల శిక్షణ ఉంటుంది. నేవల్‌ అకాడెమీలో చేరినవాళ్లకు సుమారు 18 నెలలు కేరళలోని ఎజిమాలలో శిక్షణ అందిస్తారు. ఎయిర్‌Âఫోర్స్‌ అకాడెమీ అయితే 18 నెలలు పైలట్‌ శిక్షణ నిర్వహిస్తారు. ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ పోస్టులకు చెన్నైలో 11 నెలల శిక్షణ ఉంటుంది. ఓటీఏ శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి మద్రాస్‌ విశ్వవిద్యాలయం పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ డిగ్రీని ప్రదానం చేస్తుంది.


 ఉద్యోగంలో...

ఆర్మీలో లెఫ్టినెంట్, నేవీలో సబ్‌ లెఫ్టినెంట్, ఎయిర్‌ ఫోర్స్‌లో ఫ్లయింగ్‌/ గ్రౌండ్‌ డ్యూటీ (టిక్నికల్‌/ నాన్‌ టెక్నికల్‌) ఆఫీసర్‌ హోదాతో కెరియర్‌ ప్రారంభమవుతుంది. ఈ మూడూ సమాన హోదా (లెవెల్‌ 10) ఉన్న ఉద్యోగాలే. రూ.56,100 మూలవేతనం లభిస్తుంది. అదనంగా రూ.15,500 మిలటరీ సర్వీస్‌ పే చెల్లిస్తారు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ప్రోత్సాహకాలు.. అన్నీ కలిపి సుమారు రూ.లక్ష వేతనం పొందవచ్చు. రెండేళ్ల అనుభవంతో ఆర్మీలో కెప్టెన్, నేవీలో లెఫ్టినెంట్, ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయిట్‌ లెఫ్టినెంట్‌ హోదాలు సొంతం చేసుకోవచ్చు. ఆరేళ్లు విధుల్లో కొనసాగినవారు సంబంధిత దళాల్లో మేజర్‌/ లెఫ్టినెంట్‌ కమాండర్‌/ స్క్వాడ్రన్‌ లీడర్‌ గుర్తింపు పొందవచ్చు. 13 ఏళ్ల సేవలతో ఎయిర్‌ ఫోర్సులో వింగ్‌ కమాండర్‌ కావచ్చు. అదే నేవీలో కమాండర్, ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా అందుకోవచ్చు.  

గత ఫలితాల ప్రకారం యాభై శాతం మార్కులు పొందినవారు తప్పకుండా విజయం సాధించవచ్చు. ఏటా రెండుసార్లు ప్రకటనల కారణంగా సీడీఎస్‌ఈని లక్ష్యంగా చేసుకున్నవారు విజయాన్ని అందుకోవచ్చు. ఈ సన్నద్ధతతోనే సీడీఎస్‌ఈతో సమాన స్థాయిలో ఉండే యూపీఎస్‌సీ నిర్వహించే మరో పరీక్ష.. సీఏపీఎఫ్‌ రాసుకోవచ్చు 


 పరీక్ష ఇలా...


ఇంగ్లిష్, జనరల్‌ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌ల్లో ఒక్కో పేపర్‌ వంద మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు రెండు గంటలు. మ్యాథ్స్‌లో వంద, మిగిలిన రెండు పేపర్లలోనూ 120 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. తప్పు సమాధానాలకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులో మూడో వంతు తగ్గిస్తారు. ఇంగ్లిష్‌ విభాగం మినహా మిగిలిన ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్షలో అర్హత సాధించడానికి ప్రతి పేపర్‌లోనూ కనీసం 20 శాతం మార్కులు పొందాలి. ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ (ఓటీఏ) పోస్టులకు పరీక్ష, ఇంటర్వ్యూ ఒక్కోటీ 200 మార్కులకే ఉంటాయి. కేవలం ఓటీఏ పోస్టులకే దరఖాస్తు చేసుకుంటే మ్యాథ్స్‌ పేపర్‌ రాయనవసరం లేదు.


 గత కటాఫ్‌ ఇలా..


‣ గత పరీక్షల ఫలితాలు గమనిస్తే.. 50 శాతం మార్కులు పొందినవారు తప్పనిసరిగా ఇంటర్వ్యూకి ఎంపికవుతున్నారు. అలాగే పరీక్ష, ఇంటర్వ్యూ రెండూ కలిపి 50 శాతం మార్కులు సాధిస్తే ఎయిర్‌ఫోర్స్‌లో అవకాశం దక్కుతుంది. 45 శాతం మార్కులతో మిలటరీ అకాడెమీ, నేవల్‌ అకాడెమీ, ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీలో చోటు పొందవచ్చు. 2022 సీడీఎస్‌ఈ(2) నియామకాల్లో (మొత్తం 600 మార్కులకు. ఓటీఏకు 400 మార్కులు) ఎయిర్‌ ఫోర్స్‌ 258, మిలటరీ అకాడెమీ 249, నేవల్‌ అకాడెమీ 248, ఓటీఏ మెన్‌ 180, ఓటీఏ విమెన్‌ 179 మార్కులు పొందినవారు అవకాశం దక్కించుకున్నారు.



ముఖ్య వివరాలు

విద్యార్హత: మిలటరీ అకాడెమీ, ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ. నేవల్‌ అకాడెమీ ఉద్యోగాలకు బీటెక్‌. ఎయిర్‌ఫోర్స్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ, ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ చదివుండాలి. ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతోన్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: ఇండియన్‌ మిలటరీ అకాడెమీ, నేవల్‌ అకాడెమీలకు జనవరి 2, 2001 - జనవరి 1, 2006 మధ్య జన్మించినవారు అర్హులు. ఎయిర్‌ఫోర్స్‌ అకాడెమీకి జనవరి 2, 2001 - జనవరి 1, 2005 మధ్య జన్మించాలి. కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ ఉన్నవారికి గరిష్ఠ వయసులో రెండేళ్ల సడలింపు వర్తిస్తుంది. ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ పోస్టులకు జనవరి 2, 2000 - జనవరి 1, 2006 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీలు: 457. విభాగాల వారీ ఐఎంఏ-100, ఐఎన్‌ఏ-32, ఏఎఫ్‌ఏ-32, ఓటీఏ-293(వీటిలో 275 పురుషులకు, 18 మహిళలకు)

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జనవరి 9 సాయంత్రం 6 వరకు స్వీకరిస్తారు. 

ఫీజు: రూ.200. మహిళలు, ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు. 

పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 21

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌. 

వెబ్‌సైట్‌: https://upsc.gov.in


విజయానికి..

నోటిఫికేషన్‌లో సిలబస్‌ వివరాలు పేర్కొన్నారు. వాటిని శ్రద్ధగా పరిశీలించాలి.

 తాజా అభ్యర్థులు ప్రాథమికాంశాల నుంచి సన్నద్ధత ప్రారంభించాలి. ముఖ్యాంశాలు నోట్సు రాయాలి. పరిమితంగానే పుస్తకాలు ఎంచుకుని ఎక్కువ మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. 

 సీడీఎస్‌ఈ పాత ప్రశ్నపత్రాలను బాగా అధ్యయనం చేయాలి. యూపీఎస్‌సీ వెబ్‌సైట్‌ నుంచి వీటిని పొందవచ్చు. జవాబులూ పొందుపరిచారు. ప్రశ్నపత్రంపై ప్రాథమిక అంచనాకు రావడానికి ఇవి ఉపయోగపడతాయి. సబ్జెక్టులు/ విభాగాల వారీ ఏ అంశాల్లో, ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో తెలుసుకుని, సన్నద్ధతను అందుకు తగ్గట్టుగా మలచుకోవాలి.   

 సన్నద్ధత పూర్తయిన తర్వాత కనీసం పది నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. పరీక్షల వారీ ఫలితాలు విశ్లేషించుకోవాలి. వెనుకబడుతోన్న, తప్పులు జరుగుతోన్న అంశాలకు తుది సన్నద్ధతలో ప్రాధాన్యం ఇవ్వాలి.  

 పరీక్షకు పది రోజుల ముందు నేర్చుకున్న అంశాలను మరోసారి పునశ్చరణ చేయాలి. 

 రుణాత్మక మార్కులున్నాయి. తెలియని వాటిని వదిలేస్తేనే ప్రయోజనం.


సబ్జెక్టులవారీగా...


ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌: పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు వస్తాయి. అరిథ్‌మెటిక్‌ (నంబర్‌ సిస్టమ్, ఎలిమెంటరీ నంబర్‌ థియరీ), ట్రిగనోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్‌ల నుంచి వీటిని అడుగుతారు. ఈ పేపర్‌ను ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయుల్లో గణిత నేపథ్యం ఉన్నవారు కొంచెం సులువుగానే ఎదుర్కోవచ్చు. ప్యూర్‌సైన్స్, ఆర్ట్స్‌ విద్యార్థులు అదనంగా శ్రమించాలి. ముందుగా ప్రాథమికాంశాలను బాగా అధ్యయనం చేయాలి. ఆ తర్వాత వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధనచేస్తే మ్యాథ్స్‌ విద్యార్థులతో పోటీపడవచ్చు. సిలబస్‌లో పేర్కొన్న అంశాలను అనుసరించి.. 8, 9, 10 తరగతుల గణితం పాఠ్య పుస్తకాలు బాగా చదవాలి. 


జనరల్‌ నాలెడ్జ్‌: దైనందిన జీవితానికి ముడిపడిన అంశాలే ప్రశ్నలుగా వస్తాయి. వర్తమాన సంఘటనలకు ప్రాధాన్యం. సైన్స్, టెక్నాలజీల్లో తాజా మార్పులపైనా కొన్ని ప్రశ్నలు అడుగుతారు. భారతదేశ చరిత్ర, భౌగోళికశాస్త్రం అంశాల్లో అభ్యర్థి అవగాహననూ పరీక్షిస్తారు. చరిత్ర, భౌగోళికశాస్త్రం, జాగ్రఫీ, పాలిటీ సబ్జెక్టులకు ఎన్‌సీఈఆర్‌టీ 8, 9, 10 తరగతుల పుస్తకాలు చదవాలి. లూసెంట్‌/ అరిహంత్‌ జీకే పుస్తకాల్లో ఏదైనా చదివితే సరిపోతుంది. సైన్స్‌ విభాగంలోని ప్రశ్నలకు ఎన్‌సీఈఆర్‌టీ 6-10 తరగతుల పుస్తకాల్లోని ముఖ్యాంశాలు చూసుకోవాలి. వర్తమాన అంశాలు, తాజా అభివృద్ధి కార్యక్రమాలు, నియామకాలు.. వీటికోసం ఏదైనా దినపత్రికను అనుసరించాలి. ముఖ్యాంశాలు నోట్సు రాసుకుని, పరీక్షకు ముందు మరోసారి చదవాలి. 


ఇంగ్లిష్‌: అభ్యర్థి భాషను ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకునేలా ప్రశ్నలు ఉంటాయి. కాంప్రహెన్షన్, ఎర్రర్స్‌ అండ్‌ ఒమిషన్స్, ఫిల్‌ ఇన్‌ ది బ్లాంక్స్, జంబుల్డ్‌ సెంటెన్స్, సెంటెన్స్‌ కరెక్షన్, సిననిమ్స్, యాంటనిమ్స్, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెú,Ã పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్, స్పెలింగ్‌ మిస్టేక్స్, సెంటెన్స్‌ ట్రాన్ఫర్మేషన్, రిపోర్టెడ్‌ స్పీచ్‌ల నుంచి ప్రశ్నలు సంధిస్తారు. ఎక్కువ ప్రశ్నలు హైస్కూల్‌ ఆంగ్ల పాఠ్యపుస్తకాల స్థాయిలోనే ఉంటాయి. 8, 9, 10 తరగతుల వ్యాకరణాంశాలను బాగా చదువుకోవాలి. ఆంగ్లంపై పట్టు లేనివారు జనరల్‌ ఇంగ్లిష్‌ (పియర్సన్‌/ టాటా మెక్‌గ్రా హిల్స్‌) పుస్తకంలోని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే, వీలైనన్ని ఎక్కువ మార్కులు పొందవచ్చు.


ఇంటర్వ్యూలు:  ఇవి ఐదు రోజులు కొనసాగుతాయి. ఇందులో రెండు దశలుంటాయి. మొదటి దశలో అర్హత సాధిస్తేనే రెండోదానికి అవకాశం కల్పిస్తారు. తొలిరోజు స్టేజ్‌-1లో భాగంగా ఏదైనా చిత్రాన్ని చూపించి దాన్ని విశ్లేషించమంటారు. అభ్యర్థి జ్ఞాన నైపుణ్యం, అవగాహన సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. ఈ విభాగంలో అర్హత సాధించినవారికి స్టేజ్‌-2లో భాగంగా నాలుగు రోజుల పాటు ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. సైకాలజీ టెస్టులతోపాటు పలు ఇతర అంశాల్లో అభ్యర్థిని పరిశీలిస్తారు. ఇందులోనూ విజయవంతమైతే వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణలోకి తీసుకుంటారు.


మరింత సమాచారం... మీ కోసం!

‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు

‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!

‣ బీమా సంస్థలో కొలువులు

‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ

‣ పరీక్షల్లో మార్కులు సాధించాలంటే?

‣ పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!

Posted Date : 28-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌