• facebook
  • whatsapp
  • telegram

ఆర్థికశాస్త్రం.. అద్భుత ఉద్యోగావకాశం!

యూపీఎస్సీ - ఐఈఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల

ఆర్థికరంగంలో అత్యున్నత ఉద్యోగానికి ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ (ఐఈఎస్‌) దారి చూపుతుంది. ఈ పరీక్షను యూపీఎస్‌సీ దాదాపు ఏటా నిర్వహిస్తోంది. ఇటీవలే ఐఈఎస్‌-2023 ప్రకటన వెలువడింది. ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. ఎకనామిక్స్‌లో పీజీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన పూర్తి వివరాలు..

దేశంలో అత్యున్నత ఉద్యోగాల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) పరీక్షలు నిర్వహిస్తోంది. కేంద్ర ఆర్థిక సర్వీసుల్లో అత్యున్నత హోదాలో సేవలు అందించాలనే లక్ష్యం ఉన్నవారికి ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ (ఐఈఎస్‌) దారి చూపుతుంది. ఇందులో ప్రతిభ చూపినవారు జూనియర్‌ టైమ్‌ స్కేల్‌ ఆఫీసర్‌ హోదాతో కెరియర్‌ ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, అనుబంధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తారు. గ్రూప్‌ ఏ విభాగంలో క్లాస్‌-1 అధికారిగా కొనసాగుతారు. విధుల్లో చేరిన మొదటి నెల నుంచే రూ.56,100 (లెవెల్‌ 10) మూలవేతనం లభిస్తుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ మొదలైన వాటితో సుమారు రూ.లక్ష వేతనం అందుకోవచ్చు. అనుభవం, పనితీరుతో అత్యున్నత హోదాకు చేరుకోవచ్చు. దాదాపు సివిల్‌ సర్వెంట్లకు ఉన్నంత ప్రాధాన్యం ఎకనామిక్‌ సర్వీస్‌లో విధులు నిర్వర్తిస్తున్నవారికీ దక్కుతుంది. ప్రభుత్వ ఆర్థిక నిర్ణయాలు, దేశ ప్రగతిలో వీరు భాగస్వాములవుతారు.   

పరీక్షలో..

ఇందులో 2 భాగాలు ఉంటాయి. పార్ట్‌-1లో 6 పేపర్లు రాయాలి. వీటికి వెయ్యి మార్కులు. జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ స్టడీస్‌ ఒక్కో పేపరు వంద మార్కులకు ఉంటాయి. జనరల్‌ ఎకనామిక్స్‌ 1, 2, 3 పేపర్లతోపాటు; ఇండియన్‌ ఎకనామిక్స్‌ ఒక పేపర్‌ రాయాలి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు కేటాయించారు. ఒక్కో పేపర్‌ వ్యవధి 3 గంటలు. ప్రశ్నపత్రాలు ఆంగ్లంలోనే ఉంటాయి. అలాగే సమాధానాలు సైతం అదే భాషలో రాయాలి. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు రుణాత్మక మార్కులు ఉన్నాయి. పార్ట్‌-1లో అర్హత సాధించినవారు పార్ట్‌-2 ఇంటర్వ్యూకు హాజరవుతారు. ఈ విభాగానికి 200 మార్కులు కేటాయించారు. మొత్తం 1200 మార్కులకు అభ్యర్థి చూపిన ప్రతిభ, రిజర్వేషన్ల ప్రాతిపదికన తుది నియామకాలు చేపడతారు. 

ప్రశ్నలిలా..

జనరల్‌ స్టడీస్, జనరల్‌ ఇంగ్లిష్‌ పేపర్లలోని ప్రశ్నలు సాధారణ గ్రాడ్యుయేట్లు ఎవరైనా ఎదుర్కునేలా ఉంటాయి. జనరల్‌ ఇంగ్లిష్‌లో భాగంగా ఆంగ్లంలో వ్యాసం రాయాలి. మిగిలిన ప్రశ్నలు ఆంగ్లాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకునేలా ఉంటాయి. పదాలు ఉపయోగించడం (ఒకాబ్యులరీ), ప్యాసేజ్‌లు, ప్రెసీ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. జనరల్‌ నాలెడ్జ్‌లో ప్రశ్నలు దైనందిన జీవితంతో ముడిపడి ఉన్నవే ఎక్కువగా వస్తాయి. వర్తమాన వ్యవహారాలకు ప్రాధాన్యముంది. భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగం, చరిత్ర, భూగోళం అంశాల నుంచీ ప్రశ్నలుంటాయి. విద్యానేపథ్యం, నైపుణ్యాలతో సంబంధం లేకుండానే వీటిని ఎదుర్కోవచ్చు. హైస్కూల్‌ సోషల్‌ పుస్తకాలు బాగా చదువుతూ, తాజా అంశాలను నోట్సు రాసుకుంటే చాలు.  

ఎకనామిక్స్‌ ప్రశ్నపత్రాలు.. ఆ సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఉంటాయి. థియరీ ఉపయోగించి సమస్యను విశ్లేషించగలగాలి. భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటోన్న సమస్యలనే ప్రశ్నలగా మలుస్తారు. అందువల్ల సబ్జెక్టుపై గట్టి పట్టు ఉన్నవారే సమాధానాలు రాయగలరు. ఇందుకోసం ముందుగా మూడేళ్ల యూజీ ఎకనామిక్స్‌ పాఠ్యపుస్తకాల్లోని ప్రాథమికాంశాలను బాగా అధ్యయనం చేయాలి. అనంతరం పీజీ పుస్తకాలు శ్రద్ధగా చదవాలి. సివిల్‌ సర్వీసెస్‌ ఎకనామిక్స్‌ ఆప్షనల్‌ సబ్జెక్టు పాత ప్రశ్నపత్రాలు సాధన చేస్తే మంచిది. సబ్జెక్టు ప్రశ్నలు వ్యాసరూపంలో ఉంటాయి కాబట్టి రాత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. గతంలో నిర్వహించిన ఐఈఎస్‌ ప్రశ్నపత్రాలు పరిశీలించి, సన్నద్ధతను అందుకు అనుగుణంగా మలచుకోవాలి. అలాగే ఆర్‌బీఐ, నెట్‌ ఎకనామిక్స్‌ విభాగం ప్రశ్నపత్రాలూ అధ్యయనంలో ఉపయోగపడతాయి. 

ఖాళీలు: 18

అర్హత: ఎకనామిక్స్‌/ అప్లైడ్‌ ఎకనామిక్స్‌/ బిజినెస్‌ ఎకనామిక్స్‌/ ఎకనోమెట్రిక్స్‌ వీటిలో ఎందులోనైనా పీజీ కోర్సులు పూర్తిచేసినవారు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయసు: ఆగస్టు 1, 2023 నాటికి 21 - 30 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఆగస్టు 2, 1993 - ఆగస్టు 1, 2002 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మే 9 సాయంత్రం 6 వరకు స్వీకరిస్తారు. 

పరీక్ష ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మినహాయించారు. మిగిలిన అభ్యర్థులు రూ.200 చెల్లించాలి. 

పరీక్షలు: జులై 23 నుంచి మొదలవుతాయి. ఇవి మూడు రోజులు కొనసాగుతాయి. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌లో.

వెబ్‌సైట్‌: https://upsc.gov.in
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ సమగ్ర సన్నద్ధతకు అవకాశం

‣ 18 ఎయిమ్స్‌ కేంద్రాల్లో 3055 నర్సింగ్‌ ఆఫీసర్లు

‣ ఆర్కిటెక్చర్‌ ప్రవేశానికి మార్గం.. నాటా

‣ సమాచార విశ్లేషణకు ‘క్విక్‌సైట్‌’

Posted Date : 26-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌