Asked By: బాల యశశ్వి
Ans:
చాలామంది విద్యార్థులు ఇంటర్ పరీక్షల మాదిరిగానే జేఈఈకి కూడా సన్నద్ధమైతే సరిపోతుందనుకుంటారు. కానీ ఈ రెండు పరీక్షలు పూర్తిగా భిన్నమైనవి. జేఈఈ మెయిన్స్లో ఎక్కువగా అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్ష మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో, రుణాత్మక మార్కులతో ఉంటుంది. కాబట్టి ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. జేఈఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ సాధించాలంటే ముఖ్యంగా ప్రాథమికాంశాలపై మంచి పట్టుండాలి. ఇంటర్ పుస్తకాలు, జేఈఈ మెటీరియల్తోపాటు ఎన్సీఈఆర్టీ 11, 12వ తరగతి పుస్తకాలను చదివి వాటిపై అవగాహన ఏర్పరుచుకోవాలి. ఫార్ములాలను బట్టీపట్టడం కాకుండా, వాటి మూలాల్లోకి వెళ్లి పూర్తిగా నేర్చుకోవాలి. జేఈఈ పరీక్షలో విజయం సాధించాలంటే విషయ పరిజ్ఞానంతోపాటు లాజికల్ రీజనింగ్, ఎనలిటికల్ రీజనింగ్ కూడా చాలా అవసరం. అలాగే ప్రామాణిక పుస్తకాలతోపాటు, పాత ప్రశ్నపత్రాలను కూడా సమకూర్చుకుని సిలబస్, ప్రశ్నల సరళిపై అవగాహన పెంచుకోవాలి. ప్రణాళికతోపాటు సమయ నిర్వహణ కూడా చాలా అవసరం. వీలున్నన్ని నమూనా పరీక్షలు రాసి మీ బలాలు, బలహీనతలను అంచనా వేసుకోవాలి. దానికి అనుగుణంగా మీ సన్నద్ధతా ప్రణాళికను మార్చుకోండి. ఇవేకాకుండా.. జేఈఈలో విజయం సాధించిన మీ సీనియర్ల సలహాలతో ఎన్ఐటీలాంటి ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్ సంపాదించాలనే మీ కలను సాకారం చేసుకోండి.
Asked By: ఎన్. శ్రీకాంత్
Ans:
డిగ్రీ చదువుతూనే/ డిగ్రీ పూర్తి అయిన వెంటనే పోటీ పరీక్షలకు సిద్ధమవడం మంచిదే. ఆర్ఆర్బీ ఉద్యోగాలకు డిగ్రీ పూర్తవ్వాలనే నిబంధన ఉంటుంది. కోచింగ్ తీసుకోవడానికైతే నిబంధనలేమీ ఉండవు. మీరు రాయబోయే పోటీపరీక్షలకు డిగ్రీలో నిర్ధారించిన మార్కుల శాతం మీకు ఉన్నట్లయితే నిరభ్యంతరంగా కోచింగ్లో చేరండి. ఒక్కో పరీక్షకు ఒక్కో కోచింగ్ తీసుకొనే బదులు, అన్ని పరీక్షలకు ఉపయోగపడే సబ్జెక్టుల్లో ఒకే కోచింగ్ తీసుకోవడం మేలు. సిలబస్నూ, పాత ప్రశ్నపత్రాలనూ క్షుణ్ణంగా పరిశీలించి సన్నద్ధత వ్యూహాన్ని తయారు చేసుకొని, పాటించండి. విజయం సాధించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: విష్ణు, నరేష్
Ans:
నెగెటివ్ మార్కుల గురించి సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లో ప్రకటిస్తుంది. గతంలో నెగెటివ్ మార్కులు లేవు. ఈసారీ ఉండకపోవచ్చు. ప్రస్తుతం సిలబస్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు. పేపర్-2లో సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఉంటుంది. ఇందులో మెంటల్ ఎబిలిటీ (వెర్బల్, నాన్ వెర్బల్), లాజికల్ రీజనింగ్, కాంప్రహెన్షన్, వాక్యాల వరుస క్రమం (ప్యాసేజ్లను మెరుగ్గా విశ్లేషణ చేయడం), అంకగణిత సామర్థ్యాలకు సంబంధించి ప్రశ్నలు అడుగుతారు. ఈ పేపర్లో మంచి మార్కులు సంపాదించాలంటే రోజూ సాధన చేయాలి.