• facebook
  • whatsapp
  • telegram

శాంతి సాధనకు రాజకీయ యత్నం

జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ

ప్రధాని మోదీతో జమ్మూకశ్మీర్‌ నేతల సమావేశం సానుకూల వాతావరణంలో సాగింది. రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు సమష్టి కృషి అవసరమనే సందేశాన్ని అందించింది. జమ్మూకశ్మీర్‌కు సరైన సమయంలో రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా గతంలో ప్రకటించారు. అదే విషయాన్ని ఈ సమావేశంలోనూ స్పష్టం చేశారు. జిల్లా అభివృద్ధి మండళ్ల (డీడీసీ) ఎన్నికల నిర్వహణ, కాల్పుల విరమణలతో పరిస్థితులు కాస్త కుదుటపడుతున్న తరుణంలో రాష్ట్ర హోదా పునరుద్ధరణకు ఇదే సరైన సమయమని పార్టీలు పేర్కొన్నాయి. స్థానికంగా శాంతి నెలకొనాలంటే మోదీ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలకు ప్రజామోదం తప్పనిసరి! ఆ మద్దతును కూడగట్టుకోవడంలో కేంద్రానికి, ప్రజలకు మధ్య స్థానిక పార్టీలు వారధులుగా నిలవగలుగుతాయి. ఈ అవసరాన్ని కేంద్రం గుర్తించినట్లు కనిపిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన పూర్తికాగానే ఎన్నికలు జరుపుతామని న్యూదిల్లీ నాయకత్వం ప్రకటించింది. పునర్విభజనపై జమ్మూకశ్మీర్‌ నేతలు మొదట కొంత అసంతృప్తిని వ్యక్తం చేసినప్పటికీ సహకరిస్తామనడం మరో సానుకూలాంశం. తమలో తాము ఎంత కలహించుకొంటున్నా 370 అధికరణ రద్దుపై మాత్రం వారందరూ ఉమ్మడి స్వరాన్నే వినిపిస్తున్నారు. ఆ మేరకు న్యాయపోరాటాన్ని కొనసాగించడంలో రాజీ లేదనే ఇప్పటికీ చెబుతున్నారు. గురువారం నాటి సమావేశం ఎంతవరకు సఫలమవుతుందనే దానిపై కొన్ని అనుమాన మేఘాలు కమ్ముకొన్నా- వాటిని పటాపంచలు చేస్తూ సుహృద్భావ వాతావరణంలో కార్యక్రమం జరిగింది. ప్రజా ప్రాతినిధ్యం లేని అస్థిర పాలనా పరిస్థితుల నుంచి జమ్మూకశ్మీర్‌ను ఒడ్డునపడేసే రాజకీయ ప్రక్రియకు అంకురారోపణ చేసింది.

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి, రాష్ట్ర హోదాలను తొలగించి, భౌగోళికంగా విభజించి కేంద్ర పాలనలోకి తీసుకురావడం తదితరాలు ఇంటాబయటా తీవ్ర చర్చను రేకెత్తించాయి. దీన్ని తీవ్రమైన నమ్మక ద్రోహంగా స్థానిక పార్టీలు అభివర్ణించాయి. 370వ అధికరణ రద్దు అనంతర పరిస్థితులను నిభాయించడానికి దశాబ్దాలుగా మిత్రులుగా ఉంటున్న నాయకులను నిర్బంధంలో ఉంచడంపై విమర్శలు రేగాయి. సమాచార సేవలను నిలిపేయడంపైనా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. వీటన్నింటిపై జరుగుతున్న చర్చకు సమాధానమిచ్చేలా గురువారం భేటీ సాగింది. కశ్మీర్‌లో పునాదుల నుంచి ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్మించే బాధ్యతను ఆయా పార్టీల సాయంతో కేంద్రం తలకెత్తుకున్న భావన దీనితో వ్యక్తమైంది. జమ్మూకశ్మీర్‌లో డీడీసీ ఎన్నికల నిర్వహణను చారిత్రక ఘట్టంగా బీజేపీ అంతకు మునుపు పేర్కొంది. మొత్తం 278 సీట్లలో 75 గెలుచుకోవడం, 38.74 శాతం ఓట్లను దక్కించుకొని ఏకైక అతిపెద్ద పార్టీగా నిలవడాన్ని ప్రజాస్వామ్య విజయంగా ప్రకటించింది. కానీ, పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్కార్‌ డిక్లరేషన్‌(పీఏజీడీ)గా ఏర్పడిన ఏడు పార్టీల కూటమి దీన్ని పూర్తిగా తోసిపుచ్చింది. తాము 110 స్థానాల్లో విజయం సాధించడం, 50 స్థానాలను స్వతంత్రులు దక్కించుకోవడం, 19 స్థానాల్లో ఓట్ల ఆధిక్యత 100 లోపే ఉండటం తదితరాలను 370 అధికరణ రద్దుకు ప్రజామోదం లేదన్న భావననే బలపరుస్తున్నాయని గుప్కార్‌ కూటమి వాదించింది. మొత్తం 20 జిల్లాలకు అయిదింటిలో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధిస్తే పన్నెండు జిల్లాల్లో కూటమి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. దీనితో కాంగ్రెస్‌తో జతకట్టి బీజేపీ దూకుడును నిలువరించాలని పీఏడీజీ భావిస్తోంది. కాంగ్రెస్‌ మాత్రం గుప్కార్‌ అజెండాపై అచితూచి వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితుల్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర హోదా మినహా ఆర్టికల్‌ 370 పునరుద్ధరణపై కేంద్రం ఎలాంటి హామీ ఇవ్వలేదు.

కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకొన్నా ప్రజాస్వామ్య ప్రతిష్ఠను తద్వారా దేశ గౌరవాన్ని కాపాడటానికి కృషి చేయాలి. ఈ క్రమంలో స్థానిక ప్రజల భావోద్వేగాలను జాగ్రత్తగా అంచనా వేస్తూ ముందుకు సాగాలి. స్వతంత్రంగా ఉండాలని ఒకరు, దాయాది దేశంలో కలవాలని ఇంకొకరు ఇలా చాలామంది జమ్మూకశ్మీర్‌ జనాభిప్రాయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. వాటన్నింటినీ తిప్పికొడుతూ జమ్మూకశ్మీర్‌ అభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి కేంద్రం సహా పార్టీలన్నీ కట్టుబడి ఉన్నాయనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలి. తమ భూములకు, ఉద్యోగాలకు ఎలాంటి ప్రమాదం ఉండదనే విశ్వాసాన్ని కలిగించాలి. బుల్లెట్లు, బాంబుల కంటే అభివృద్ధి శక్తిమంతమైనదని ప్రధాని చెప్పిన మాటలను ఆచరణలోకి తీసుకురావాలి. భారత రాజ్యాంగానికి, సార్వభౌమాధికారానికి లోబడి సమస్య పరిష్కారానికి తగిన మార్గాలను అన్వేషించాలి. శాంతి, సామరస్యాల నడుమ ఈ ప్రయత్నాలు నిరంతరం జరుగుతూ ఉండాలి. పరస్పర విశ్వాసం, చిత్తశుద్ధితోనే జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్య పతాకను తిరిగి ఎగరేయగలమన్న విషయాన్ని కేంద్రంతో సహా అన్ని పార్టీలూ గుర్తుంచుకోవాలి. -

- ఎం.శ్రీనివాసరావు

Posted Date: 26-06-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం