• facebook
  • whatsapp
  • telegram

భగ్గుమన్న రావణ కాష్ఠం

ఇజ్రాయెల్‌-పాలస్తీనా వివాదానికి రాజకీయ కోణం

తూర్పు జెరూసలేంలో ఓ భాగమైన షేక్‌జరాలోని కొన్ని కుటుంబాలకు సంబంధించిన అద్దె చెల్లింపు వివాదం పెరిగి పెద్దదై ఇజ్రాయెల్‌-పాలస్తీనాలను కుదిపేస్తోంది. ఇరు దేశాల అంతర్గత రాజకీయాల్లోని ఆధిపత్యపోరు కూడా తోడై వివాదం ముదురుతోంది. అంతర్జాతీయ రాజకీయాలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. కొత్త సైనిక కూటముల ఏర్పాటు ప్రతిపాదనలు ముందుకొస్తున్నాయి. ఫలితంగా ఈ ఘర్షణ ఎక్కడికి వెళ్లి ఆగుతుందో అంతుబట్టని పరిస్థితి నెలకొంది. జోర్డాన్‌ 1948లో ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధం తరవాత షేక్‌జరా ప్రాంతంలో కొన్ని పాలస్తీనా శరణార్థి కుటుంబాలకు ఐరాస సహకారంతో నివాస ప్రాంగణాలను నిర్మించింది. కానీ, 1967లో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్‌ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొంది. 1876లో ఒట్టొమాన్‌ చక్రవర్తి పరిపాలన కాలంలోనే తాము షేక్‌జరాలో అరబ్‌ల నుంచి కొనుగోలు చేసిన స్థలాల్లో జోర్డాన్‌ పాలస్తీనా శరణార్థులకు ఇళ్లను నిర్మించిందంటూ కొందరు యూదులు నాటి పత్రాలతో న్యాయస్థానాలను ఆశ్రయించారు. దిగువ న్యాయస్థానాల్లో యూదులకు అనుకూలంగా తీర్పు రావడంతో పాలస్తీనీయులు అద్దె చెల్లించడం లేదా ఖాళీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కేసు ఆ దేశ సుప్రీంకోర్టుకు చేరింది. మే నెల 10వ తేదీన దీనిపై తీర్పు వెలువడాల్సి ఉండటంతో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఫలితంగా న్యాయస్థానం మరో 30 రోజుల పాటు తీర్పును వాయిదా వేసింది.

పరిస్థితి జటిలం

వాస్తవానికి తూర్పు జెరూసలేంలో ఇజ్రాయెల్‌ ఆక్రమణలను అంతర్జాతీయ సమాజం గుర్తించలేదు. దీంతో అక్కడ ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పులు ఎలా చెల్లుతాయని పాలస్తీనా వర్గం ప్రశ్నిస్తోంది. రంజాన్‌ సందర్భంగా జెరూసలేంలోని డమాస్కస్‌ గేటు వద్ద ఎక్కువ మంది గుమిగూడితే ఉద్రిక్తత తలెత్తుందని అనుమానించిన ఇజ్రాయెల్‌ ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల అమలులో ఘర్షణలు చెలరేగాయి. అల్లరి మూకలు దాక్కొన్నాయని చెబుతూ ఇజ్రాయెల్‌ దళాలు అల్‌అక్సా మసీదులోకి ప్రవేశించి అక్కడి వారిని చెదరగొట్టడంతో వివాదం జటిలమైపోయింది. దీంతో గాజాపట్టిలో హమాస్‌ ఉగ్రసంస్థ ఇజ్రాయెల్‌పై భారీగా రాకెట్‌ దాడులకు దిగడంతో ప్రతిదాడులు మొదలయ్యాయి. ఇజ్రాయెల్‌లో నెతన్యాహు బలహీనపడినా, రెండేళ్లుగా ఏ పార్టీకీ సుస్థిర ఆధిక్యం దక్కలేదు. మార్చిలో జరిగిన ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. ఫలితంగా ఇజ్రాయెల్‌ రెండేళ్లలో అయిదోసారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజా ఘర్షణలను తనకు అనుకూలంగా మార్చుకొని తిరిగి బలం పుంజుకోవాలని నెతన్యాహు భారీ దాడులకు తెరతీశారు. మరోవైపు, పాలస్తీనా చట్టసభకు ఈ నెల 30న జరగాల్సిన ఎన్నికలను దేశ అధ్యక్షుడు, ఫతా పార్టీ అధినేత మహమ్మద్‌ అబ్బాస్‌ నిరవధికంగా వాయిదా వేశారు. వాస్తవానికి వెస్ట్‌బ్యాంక్‌లో ఫతా పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. కానీ, ఇజ్రాయెల్‌ అండతో హమాస్‌ను అక్కడకు రానీయకుండా ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఇక గాజాపట్టీ పూర్తిగా హమాస్‌ గుప్పిట ఉంది. దీంతో ఇజ్రాయెల్‌ను ప్రతిఘటించే శక్తిగా అవతరించి వెస్ట్‌బ్యాంక్‌లో ప్రాబల్యం పెంచుకోవడానికి జెరూసలేం ఘర్షణలను హమాస్‌ ఆయుధంగా చేసుకొంది. దీంతో వెస్ట్‌బ్యాంక్‌లోని ఫతాపై కూడా ఒత్తిడి పెరిగి ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు జారీ చేసింది. పాలస్తీనా వివాదాన్ని ఆసరాగా చేసుకొని ఎలాగైనా ఇస్లామిక్‌ ప్రపంచానికి నాయకత్వం వహించాలని టర్కీ యత్నిస్తోంది. ఇటీవల జరిగిన ఇస్లామిక్‌ దేశాల సమావేశంలో పాలస్తీనా కోసం సమష్టిగా ఓ రక్షణ దళం ఏర్పాటు చేయాలని, దానికి తాను నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. ఎప్పట్లాగే పాకిస్థాన్‌ వంతపాడింది. అయితే, టర్కీ మాటలను నమ్మే స్థితిలో ఏ దేశమూ లేదన్నది విస్పష్టం.  

భారత్‌... సమదూరం  

ఐరాస భద్రతా మండలిలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా చైనా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా అడ్డుకొంది. అదే సమయంలో ఇజ్రాయెల్‌, పాలస్తీనా శాంతి చర్చల్లో నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్లు డ్రాగన్‌ చెప్పింది. వీగర్‌ ముస్లిములపై సాగిస్తున్న అత్యాచారాలను మరుగుపరచడానికి ఇస్లామిక్‌ ప్రపంచానికి సంబంధించిన పవిత్ర స్థలాలు ఉన్న జెరూసలేం విషయంలో వకాల్తా పుచ్చుకోవడంతోపాటు, అరబ్‌ దేశాల్లో అమెరికా పాత్రను తాను భర్తీ చేయాలనేది కూడా చైనా ప్రయత్నంగా తెలుస్తోంది. భారత్‌కు ఇజ్రాయెల్‌తో బలమైన బంధమే ఉన్నా, అత్యంత హింసాత్మక వివాదంలో మాత్రం ఇజ్రాయెల్‌, పాలస్తీనాలకు సమదూరం పాటిస్తోంది. ఐరాసలో భారత రాయబారి టి.ఎస్‌.తిరుమూర్తి స్పందన ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఐరాస తీర్మానాల అమలు, రెండు దేశాల విధానం, హమాస్‌ హింసాత్మక దాడుల ఖండన వంటి వాటిల్లో ఎలాంటి మార్పులూ లేవు. ముఖ్యంగా భారత్‌కు చమురు సరఫరాలకు అత్యంత కీలకమైన ‘లింక్‌వెస్ట్‌’ పాలసీకి ఆటంకం లేకుండా ఈ విధానాలు ఉండేలా చూసుకొంటోంది. భారత్‌కు దేశీయంగా, అంతర్జాతీయంగా ఉన్న ఇబ్బందులు ఇజ్రాయెల్‌కు స్పష్టంగా తెలుసు. అందుకే నెతన్యాహు తమకు మద్దతుగా నిలిచిన దేశాల జాబితాలో భారత్‌ పేరును చేర్చలేదు.

- లక్ష్మీతులసి

Posted Date: 20-05-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం