• facebook
  • whatsapp
  • telegram

దేవభూమిలో అసమ్మతి సెగలు

ఉత్తరాఖండ్‌ భాజపాలో పదవీ పదనిసలు

హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్‌ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్‌ సింగ్‌ ధామి బాధ్యతలు స్వీకరించారు. పార్టీలో, ప్రభుత్వంలో కీలక బాధ్యతలను అప్పగించే సందర్భంలో నాయకుల వ్యక్తిగత పేరుప్రతిష్ఠలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోని భాజపా అధిష్ఠానం వైఖరి దీనితో మరోసారి తేటతెల్లమైంది. కుమావ్‌ డివిజన్‌కు చెందిన 45 ఏళ్ల ధామి ప్రస్తుతం రెండో విడత శాసనసభ్యులుగా ఉన్నారు. ప్రజాకర్షణ శక్తి అంతగా లేని ఆయనకు ఎవరూ ఊహించని విధంగా ఉన్నత పదవి దక్కింది. మరో ఎనిమిది నెలల్లో శాసనసభకు ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ధామి ఎంపిక- రాష్ట్ర పార్టీలో అసమ్మతి మంటలు రాజేసింది. ఒక యువ ఎమ్మెల్యేను అధిష్ఠానం రాష్ట్ర శాసనసభాపక్ష నేతగా నియమించడంపై సీనియర్‌ నేతలు భగ్గుమంటున్నారు. తమ అనుభవానికి ఏమాత్రం గౌరవం ఇవ్వని కేంద్ర నాయకత్వం తీరు వారికి కొరుకుడుపడటం లేదు. తీరథ్‌ సింగ్‌ రావత్‌ ప్రభుత్వంలో సీనియర్‌ మంత్రులుగా ఉన్నవారు కొందరు భాజపా అధిష్ఠానం వ్యవహారశైలిపై మండిపడుతున్నారు. ధామి నాయకత్వం కింద పనిచేయడానికి వారు సుతరామూ ఇష్టపడటం లేదు. వాస్తవానికి ధామితో కలిసి ఆదివారం ప్రమాణ స్వీకారం చేయడానికి సైతం వారు అంగీకరించలేదు. నయానోభయానో వారిని కేంద్ర నేతలు సముదాయించి ప్రస్తుతానికి గొడవను సద్దుమణిగేలా చూశారు.

ఉత్తరాఖండ్‌లో అనుసరించిన వైఖరినే వివిధ సందర్భాల్లో ఇతర రాష్ట్రాల్లోనూ భాజపా కనబరచింది. ముఖ్యంగా 2014 తరవాత కాకలుతీరిన పార్టీ నాయకులెందరినో అధిష్ఠానం పక్కనపెట్టేసింది. ఉత్తర్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, అసోం, మహారాష్ట్ర, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో కొత్త నేతలను ముందుకు తెచ్చింది. పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతున్న వారిని విస్మరిస్తూ నూతన నాయకత్వానికి కీలక బాధ్యతలు అప్పగించింది. ఉత్తరాఖండ్‌లో పార్టీ గెలుపు కోసం అహరహం శ్రమించిన ప్రముఖ నేతలు కొంతమంది ఆ తరవాతి కాలంలో అధిష్ఠానం వైఖరితో అనివార్యంగా పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం కోసం వీధుల్లో ఆందోళనలు చేయడం నుంచి శాసనసభ ఎన్నికలో కాషాయ ధ్వజాన్ని ఎగరేయడం వరకు అన్ని విషయాల్లో చురుకైన పాత్ర పోషించిన వారికి కాలం కలిసి రాలేదు. మనోహర్‌కాంత్‌ ధ్యానీ, దేవేంద్ర శాస్త్రి, కేదార్‌సింగ్‌ ఫోనియా, మత్బర్‌సింగ్‌ ఖండారీ, మహేంద్ర భట్‌, హర్బన్స్‌ కపూర్‌, విజయ భర్త్‌వాల్‌, సుశీలా భలూనీ తదితర సీనియర్‌ నేతలెందరో ఈ జాబితాలో కనిపిస్తారు. వీరిలో కొంతమంది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ చిత్రపటం నుంచే కనుమరుగయ్యారు. వీళ్లందరికీ మించి ఉత్తరాఖండ్‌లో 1990 నుంచి ఒంటిచేత్తో భాజపాను నిలబెట్టిన మాజీ ముఖ్యమంత్రి బీసీ ఖండూరీకి సైతం ఇటువంటి అనుభవాలు తప్పలేదు! అయిదు సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన  ఖండూరీకి ఇవ్వాల్సినంత ప్రాధాన్యాన్ని పార్టీ ఇవ్వలేదు.

కొత్త ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన ధామీకి పాలనలో ఎలాంటి అనుభవమూ లేదు. రాష్ట్ర పార్టీలోని కీలక నేతల అభిప్రాయాలను పక్కనపెట్టి మరీ అధిష్ఠానం ధామీని కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్‌ అయిన భగత్‌సింగ్‌ కోషియారీతో ధామీకి ఉన్న సన్నిహిత సంబంధాలతోనే ఆయనకు ఈ పదవి దక్కిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. భారతీయ జనతా యువమోర్చా(బీజేవైఎం)లో ఉన్నప్పటి నుంచి ధామీ ఎదుగుదలకు కోషియారీ అండదండలు అందుతూ వచ్చాయి. 2001-02 మధ్యలో ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా కోషియారీ ఉన్న సమయంలో ధామీ ఆయన దగ్గర పనిచేసినట్టు చెబుతారు. 2012   ఎన్నికల సమయంలో ఖటీమా శాసనసభ స్థానంలో ధామీకి పార్టీ టిక్కెట్‌ సైతం కోషియారీ ద్వారానే దక్కిందంటారు. ఉత్తమ శాసనసభ్యుడిగా పురస్కారం అందుకున్న ధామీ, 2017లో తిరిగి అదే స్థానం నుంచి గెలుపొందారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ఆయన కొద్ది నెలలుగా రాష్ట్రంలోని కొవిడ్‌ టీకా కేంద్రాలను వరసగా సందర్శిస్తూ వార్తల్లో నిలిచారు. మరోవైపు, తీరథ్‌ సింగ్‌ రావత్‌ క్యాబినెట్‌లోని సీనియర్‌ మంత్రి సత్పాల్‌ మహరాజ్‌ ముఖ్యమంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు నలుగురు మంత్రులు ధామీని సీఎం చేయడంపై గుర్రుగా ఉన్నారు. అధిష్ఠానం బుజ్జగించడంతో సత్పాల్‌ తాజాగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు సీనియర్‌ నేతలందరూ తాత్కాలికంగా మౌనముద్ర వహిస్తున్నారు కానీ, ఈ సయోధ్య ఎంత కాలం నిలబడుతుందన్నదే అసలు ప్రశ్న!

- ఆర్‌పీ నైల్వాల్‌ (ఉత్తరాఖండ్‌ వ్యవహారాల నిపుణులు)

Posted Date: 06-07-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం