• facebook
  • whatsapp
  • telegram

పడకేసిన పల్లె వైద్యం

మౌలికవసతుల సంక్షోభం
 

మహా నగరాల్లో వైద్య సేవలు అందిస్తున్న దేశీయ కార్పొరేట్‌ వైద్య సంస్థలు, కొన్ని ప్రభుత్వ ఆస్పత్రులు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయి. కానీ, గ్రామీణ ప్రజల ఆరోగ్య అవసరాలకోసం పనిచేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణికాలకు దిగువన వెలవెలబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ గణాంకాల మేరకు 2019నాటికి భారత్‌లో సుమారు ఏడు లక్షల గ్రామాల్లో 90కోట్ల ప్రజలు నివసిస్తున్నారు. పల్లె పేదల ఆరోగ్య దీపికలైన 30వేల ప్రాథమిక వైద్య కేంద్రాలు దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయి. ఇందులో 60శాతం ఆరోగ్య కేంద్రాలు ఒకే ఒక వైద్యుడి ద్వారా, అయిదు శాతం అసలు వైద్యుడే లేకుండా నడుస్తున్నట్లు 2018-19 ‘ఎకనమిక్‌ సర్వే’ పరిశీలనలో తేలింది.
 

గడచిన రెండు దశాబ్దాలుగా ఇండియాలో ఆస్పత్రులు, వైద్య నిపుణుల సంఖ్య గణనీయంగా పెరిగిన మాట వాస్తవం. ఇవి పట్టణ, నగర ప్రాంతాల్లోని ప్రైవేటు, కార్పొరేట్‌ రంగాలకు మాత్రమే పరిమితం. 60శాతం ఆసుపత్రులు, 70శాతం క్లినిక్‌లు, 80శాతం వైద్యులు పట్టణ ప్రాంతాల్లోనే సేవలు అందిస్తున్నట్లు అంచనా. వైద్యంకోసం ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చే రోగులు దాదాపు 86శాతం గ్రామీణులే కావడం గమనార్హం. శిథిలావస్థలో ఉన్న ఆసుపత్రులు, పనిచేయని పరికరాలు, మందుల కొరత, వైద్య నిపుణుల లేమి పల్లె వైద్యానికి ప్రధాన ప్రతిబంధకాలుగా మారాయి. ముదిరిన జబ్బులను గుర్తించి మెరుగైన వైద్యంకోసం జిల్లాస్థాయి ప్రభుత్వ ఆసుపత్రులకు పంపడంలో జాప్యం, నిర్లక్ష్యం కారణాలుగా ఉన్నాయి. పల్లెల్లో సాధారణ సాంక్రామిక వ్యాధులతో పాటు గుండెజబ్బులు, మధుమేహం, మానసిక సమస్యలూ పెచ్చుమీరుతున్నాయి. వ్యవసాయానికి సంబంధించిన ప్రమాదాలు, విష పురుగుల కాట్లు వంటివి గ్రామాల్లోనే అత్యధికం. మలేరియా, ఫైలేరియావంటి దోమకాటు జబ్బులు కొండప్రాంతాల్లోని గిరిజన తెగల్లో విజృంభిస్తూనే ఉన్నాయి. కిడ్నీ జబ్బులకు దారితీసే కలుషిత నీరు పలు పల్లెప్రాంతాల్లోని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. రక్త పరీక్షలు, ఎక్స్‌-రే, స్కాన్‌ వంటి ప్రాథమిక వైద్య పరీక్షల కోసం సైతం పట్టణాలకు వెళ్లి ప్రైవేటు వైద్యులను సంప్రదించాల్సి వస్తోంది. అప్పో సప్పో చేసి లేదా బంగారం, భూమి వంటివి తాకట్టు పెట్టి దాదాపు సగంమంది గ్రామీణులు ప్రైవేటులో అత్యవసర వైద్య సేవలు పొందుతున్నట్లు అంచనా.
 

పట్టణ ప్రజలతో పోలిస్తే గ్రామీణులు- మద్యంపై మూడింతలు, పొగాకు ఉత్పత్తులపై నాలుగింతలు ఎక్కువగా వ్యయం చేస్తున్నారు. వైద్య సదుపాయాలు అంతంతమాత్రంగా ఉన్న చోట్ల వ్యాధులు ముదిరేవరకు తాత్సారం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తద్వారా వైద్యంపై వారు చేసే ఖర్చూ రెండింతలవుతోంది. జలుబు, జ్వరం వంటి సాధారణ రుగ్మతలకు సైతం మందులు అందుబాటులో లేని పరిస్థితి గ్రామీణ సమాజంలో నెలకొని ఉంది. పల్లెప్రజల ఆరోగ్యం ఇప్పుడు సంక్షోభంలో ఉంది. దేశంలోని గ్రామీణ వైద్యరంగానికి అత్యవసర చికిత్స అందించాల్సిన సమయం ఆసన్నమైంది. దేశంలో 70శాతంగా ఉన్న పల్లె ప్రజల ఆరోగ్యానికి రక్షణ కల్పించేలా బడ్జెట్‌ కేటాయింపులు పెరగాలి. మౌలిక వసతుల కల్పన, వైద్య నిపుణులు, ఇతర సిబ్బంది నియామకాల్లో పల్లెలకు పెద్దపీట వేయాలి. పేదలైన పల్లె ప్రజలు ఆరోగ్య సమస్యలతో కునారిల్లి మరింత నిరుపేదలుగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.
 

ఆరోగ్యవిధానం... ఆదర్శం
గ్రామీణ పేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చేందుకు కేంద్రం ‘హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కేంద్రాల్ని’ ప్రారంభిస్తోంది. ఈ ఏడాది జులైనాటికి దేశవ్యాప్తంగా 43వేలకు పైగా కేంద్రాలు ఆరోగ్య సేవలు ప్రారంభించాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇటీవల వెల్లడించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్ఠంగా తీర్చిదిద్ది, ‘వెల్‌నెస్‌’ కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నారు. ‘ఆయుష్మాన్‌ భారత్‌’ కింద కేంద్రం ప్రవేశపెట్టిన పథకం ద్వారా గ్రామీణ పేదలకు ఆరోగ్య సేవలు అందనున్నాయి. దానితో పాటు ‘ఆయుష్మాన్‌ భారత్‌- ప్రధాన్‌మంత్రి జన్‌ ఆరోగ్య యోజన’ పరిధిలో ద్వితీయ, తృతీయ శ్రేణి ఆస్పత్రుల్లో 10.74 కోట్ల కుటుంబాలకు ఏటా అయిదు లక్షల రూపాయల వరకు నగదు రహిత వైద్య చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రెండు కార్యక్రమాలను బాలారిష్టాలను సత్వరం అధిగమించి అమలు చేస్తేనే ఆశించిన లక్ష్యాలు సాకారమవుతాయి.
 

- డాక్టర్‌ జెడ్‌.ఎస్‌.శివప్రసాద్‌ (వైద్య రంగ నిపుణులు)
 

Posted Date: 20-11-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం