• facebook
  • whatsapp
  • telegram

  ఆమ్‌ఆద్మీ గెలుపిది!

దేశ రాజధాని దిల్లీ ఎన్నికల ఫలితాలు దిగ్భ్రాంతపరుస్తాయన్న కమలనాథుల మాటే ఖరారైనట్లుగా, కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ అప్రతిహతంగా పురోగమించింది. ఆమ్‌ ఆద్మీకి హ్యాట్రిక్‌ విజయం తథ్యమన్న ఎగ్జిట్‌ పోల్‌ జోస్యాలన్నీ నిజం కాగా, ప్రధాన ప్రత్యర్థిగా బరిలో గిరిగీసి నిలిచిన భాజపా ఈసారీ ఏకాంకె సీట్ల (8)తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 1998-2013 మధ్యకాలంలో షీలా దీక్షిత్‌ నేతృత్వంలో వరసగా ముమ్మార్లు నెగ్గిన కాంగ్రెస్‌ పార్టీకి మరోమారు ఓటర్లనుంచి రిక్త హస్తమే ఎదురైంది! మొత్తం 70 స్థానాల దిల్లీ అసెంబ్లీలో 2015నాటి ఎన్నికల్లో 54.5 శాతం ఓట్లతో ఎకాయెకి 67 సీట్లు సాధించి ‘ఆప్‌’ చరిత్ర సృష్టించడం తెలిసిందే. నాటికంటే అయిదుశాతం ఓట్లు తక్కువగా పోలైన ఈ ఎన్నికల్లో ఒక శాతం ఓట్లు తరుగుపడిన కేజ్రీవాల్‌ పార్టీ 62 స్థానాలు గెలుచుకోవడం విశేషమే! మరోవంక క్రితంసారితో పోలిస్తే ఏకంగా ఆరున్నర శాతం అధికంగా 38.8శాతం ఓట్లు తెచ్చుకొన్న భాజపాకు అదనంగా అయిదు స్థానాలే జమపడ్డాయి. 2008లో 40.3శాతం ఓట్లు, 2013లో 24.5 శాతం, 2015లో 9.6 శాతం ఓట్లతో దిల్లీ రాజకీయాల్లో క్రమానుగతంగా ఉనికిని కోల్పోతున్న కాంగ్రెస్‌ పార్టీ- ఈసారి ఏకంగా 63 చోట్ల ధరావతు కోల్పోయి మొహం వేలాడేసింది! 2015 ఎన్నికల్లో జేగీయమాన విజయం ద్వారా ఆమ్‌ ఆద్మీ పార్టీ గెలుచుకున్న 67 సీట్లలో 60 చోట్ల పది వేలకుపైగా, 45 చోట్ల 20 వేలకుపైగా మెజారిటీలు కళ్లు మిరుమిట్లు గొలిపాయి. నాడు భాజపా గెలుచుకొన్న మూడు సీట్లలో రెండింట ఆరువేల ఓట్లలోపే మెజారిటీ దక్కింది. అలాంటిదిప్పుడు, ఉప ముఖ్యమంత్రి సిసోడియా గెలుపు చాలాసేపు దోబూచులాడి మూడు వేలలోపు మెజారిటీతో ఒడ్డునపడ్డ వైనం- కేజ్రీవాల్‌ పార్టీకే అంతర్లీనంగా హెచ్చరిక కానుంది. పౌర సేవల పరంగా ఆమ్‌ ఆద్మీ సర్కారు కనబరచిన మేలిమి పనితీరుకు బహుమతిగా దక్కిన ఈ విజయం- రాజధాని వాసుల జీవన నాణ్యతను మెరుగుపరచే విషయంలో కేజ్రీవాల్‌ ప్రభుతపై బాధ్యతను మరింతగా పెంచుతోంది!

‘అశ్వమేధ యాగాశ్వాన్ని వదిలాం... అది దిల్లీ దిశగా దూసుకుపోతోంది’ అని 1996 సార్వత్రిక ఎన్నికలకు ముందు ముంబయి మహాధివేశన్‌లో భాజపా మహారథిగా వాజ్‌పేయీ భవిష్యద్దర్శనం చేశారు. 1993నుంచే దిల్లీ అసెంబ్లీలో 42.8 శాతం ఓట్లు, 49 సీట్లతో పాగా వేసిన కమలనాథులు- సార్వత్రిక సమరంలోనూ సత్తాచాటి దేశాధికారం చేపట్టాలనుకొంటున్న రోజులవి. ఎన్‌డీఏ సారథిగా భాజపా తొలిసారి కేంద్రంలో అధికారానికి వచ్చినప్పుడు దిల్లీలోనూ ప్రభుత్వం కమలనాథులదే అయినా 1998నుంచి రాజధానిపై అధికారం కాంగ్రెస్‌ చేజిక్కింది. 2014లో, 2019లోనూ సార్వత్రిక సమరంలో ఒంటి చేత్తో ఉట్టి కొట్టి కేంద్రంలో చక్రం తిప్పుతున్న భాజపాకు రాజధాని దిల్లీ అక్షరాలా కొరకరాని కొయ్యగా మారింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ మేనియా దిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలనూ ఊడ్చేసి 60కి పైగా అసెంబ్లీ సీట్లలో మెజారిటీ కొల్లగొట్టినా, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ చేతిలో కంగుతినాల్సి వచ్చింది. దిల్లీ పరిధిలోని మూడు మహానగర పాలికలకూ 2017లో జరిగిన ఎన్నికల్లో ఆప్‌ను 26శాతం ఓట్లకు పరిమితం చేసి విజయదుందుభి మోగించిన భాజపా- నిరుటి సార్వత్రికంలోనూ దిల్లీలోని లోక్‌సభ స్థానాలన్నింటినీ ఏకపక్షంగా కొల్లగొట్టింది. ఆ ఎన్నికల్లో ఆప్‌ ఓట్లు 18శాతానికి పడిపోవడంతో మోదీ మ్యాజిక్కుతో తాజా అసెంబ్లీ ఎన్నికల రంగాన్నీ దున్నేయగలమనుకొన్న కమలనాథులకు ఏమాత్రం మింగుడుపడని ఫలితాలివి. పౌరసత్వ సవరణ చట్టం సహా హిందుత్వ అజెండాకు గట్టిగానే శ్రుతి చేసి, రెండొందల మందికి పైగా ఎంపీలు, యాభైమంది కేంద్రమంత్రుల్ని మోహరించి, పదుల సంఖ్యలో ర్యాలీలు, రోడ్‌ షోలతో మింటినీ మంటినీ ఏకం చేసినా- దిల్లీ ప్రజ ‘ఆప్‌’వైపు ఎందుకు మొగ్గిందో భాజపా విశ్లేషించుకోవాలి!

జనసంఖ్య పరంగా 140 దేశాల్నే తలదన్నిన దిల్లీ మహానగరంలో మౌలిక సదుపాయాల పరికల్పన మహద్భాగ్యంగా మారిన దుస్థితి కళ్లకు కడుతోంది. సర్కారీ కార్యాలయాల్లో అవినీతి కసవును ఊడ్చేసే ఝాడూ (చీపురు కట్ట)యే ఎన్నికల గుర్తుగా దూసుకొచ్చిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆ మౌలిక సేవలపైనే ప్రధానంగా దృష్టి సారించి పేద తరగతి, మహిళల ఆదరణను చూరగొంది. 2013లో తొలిసారి అధికారానికి వచ్చినప్పుడే ఉచిత విద్యుత్‌, తాగునీరు పథకాల్ని ప్రారంభించిన కేజ్రీవాల్‌ పార్టీ మొహల్లా క్లినిక్కుల ఏర్పాటు ద్వారా ప్రజలకు మరింత చేరువైంది. పాఠశాలల్లో విద్యాప్రమాణాలపై దృష్టి సారించి, బాలికలు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాల్ని అందుబాటులోకి తెచ్చి మన్నన పొందిన ఆప్‌, విస్తృతంగా సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా స్త్రీల భద్రతకు పెద్దపీట వేసింది. అయిదేళ్లుగా తాము చేసిన పని ఆధారంగానే ఓట్లు అడుగుతామన్న ఆప్‌- వ్యర్థ రాజకీయ రాద్ధాంతాల జోలికి పోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించబట్టే, 14శాతంగా ఉన్న ముస్లిముల ఓట్లు కేజ్రీవాల్‌కు దన్నుగా నిలిచాయి. జాతీయ స్థాయిలో ఆప్‌ విస్తరణకు అవకాశాల్లేవని తేలిపోవడం, నేల విడిచి సాము చేస్తే ఏమవుతుందో 2017 మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు రుజువు చెయ్యడంతో కేజ్రీవాల్‌లో రహించిన ప్రాప్తకాలజ్ఞత- దిల్లీపైనే దృష్టి కేంద్రీకరణకు దోహదపడింది. కేంద్రం, దిల్లీ ప్రభుత్వాల మధ్య అధికార విభజనపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో- ఏటా రూ.60వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో రాజధాని స్థితిగతుల మెరుగుదలకు ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ మరింతగా పరిశ్రమించాల్సి ఉంటుంది. జీవన నాణ్యత ప్రమాణాల రీత్యా ప్రపంచవ్యాప్తంగా 140 నగరాల జాబితాలో 118వ స్థానంలో ఉన్న దిల్లీని ఎంతగా ఉన్నతీకరిస్తారన్నదే- కేజ్రీవాల్‌ పాలన దక్షతకు పరీక్ష కానుంది.

Posted Date: 04-04-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం