• facebook
  • whatsapp
  • telegram

  రూపు మారనున్న రాజకీయం

* కొవిడ్‌ మాయాజాలం

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎప్పుడు వదులుతుందో తెలియని పరిస్థితుల్లో అన్ని రంగాలూ గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ‘లాక్‌డౌన్‌’ ఎత్తేశాక పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని వాతావరణం నెలకొంది. వైరస్‌ ముప్పును తప్పించే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే వరకూ భౌతిక దూరం పాటించక తప్పకపోవచ్చు. లాక్‌డౌన్‌ కాల పరిమితి ముగిసిన తరవాతా కేంద్ర ప్రభుత్వం కొన్ని కఠిన నిబంధనలను కొనసాగిస్తుందనడంలో సందేహం లేదు. పెద్దయెత్తున జనం గుమిగూడే కార్యక్రమాలకు సమీప భవిష్యత్తులో అనుమతులు లభించకపోవచ్చు. సువిశాల మైదానాల్లో భారీ సభలు, సమావేశాలకు; రాజకీయ పార్టీల ప్రచార పటాటోపాలకు వీలుండదు. కనీసం కొన్ని నెలలపాటు జన సమీకరణతో ముడివడిన అన్ని కార్యక్రమాలకూ పార్టీలూ దూరంగా ఉండక తప్పదు.

సామాజిక మాధ్యమాలే అస్త్రాలు
    సామాజిక ముఖచిత్రంలో గుణాత్మక మార్పులు చోటుచేసుకోనున్న తరుణంలో- రాజకీయ పార్టీలూ ఆ మేరకు తమ కార్యకలాపాల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. భారీ బహిరంగ సభల స్థానే సామాజిక మాధ్యమాలను మునుపటికన్నా మెరుగ్గా ఉపయోగించుకుని పార్టీలు ప్రచారంపై దృష్టి పెడతాయి. ఇప్పటికే అంతర్జాల మాధ్యమాలను రాజకీయ పక్షాలు విస్తృతంగా వినియోగిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో వాటి ప్రాధాన్యం అనూహ్యంగా పెరగబోతోంది. వీడియో కాన్ఫరెన్సులకు ప్రచారం పెరుగుతుంది. ‘జూమ్‌’, ‘గోటు’ వంటి సామాజిక మాధ్యమ అప్లికేషన్లకు డిమాండ్‌ ఇనుమడించవచ్చు. వీటి సాయంతో ప్రజా సమూహాలకు చేరువ కావడం, సిద్ధాంతాలను ప్రచారం చేసుకోవడం రాజకీయ పార్టీలకు సులభమవుతుంది. మరోవంక ప్రజల కుల, మత, ప్రాంత, వయో, లింగ, ఆర్థిక, సామాజిక వివరాలతో కూడిన సమాచార బ్యాంకులకు ఒక్కపెట్టున విలువ పెరగబోతోంది. ప్రజా సమూహాలకు సంబంధించిన సూక్ష్మ వివరాలతో కూడిన ‘డేటా’కు గడచిన కొన్నేళ్లుగా ప్రాధాన్యం ఇనుమడిస్తోంది. పార్టీలన్నీ తమ కీలక ప్రచార అస్త్రాలుగా సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోనున్న తరుణంలో ఈ రకమైన ‘డేటా’కు కనీవినీ ఎరుగని స్థాయిలో డిమాండ్‌ పెరగనుంది.
    దేశంలోని పేద ప్రజానీకానికి సామాజిక మాధ్యమాలు ఇంకా అంత విస్తృత స్థాయిలో అందుబాటులోకి రాలేదు. కాబట్టి ఈ వర్గాలకు చేరువయ్యేందుకు పార్టీలు భిన్నమైన మార్గాలను ఎంపిక చేసుకోవచ్చు. మురికివాడలు, బడుగుల బస్తీల్లో భారీ ‘ఎల్‌ఈడీ’ టీవీ తెరలను ఏర్పాటు చేసి వాటి ద్వారా పార్టీలు తమ మేనిఫెస్టోలను ప్రచారం చేసుకుంటాయి. భౌతిక దూరాన్ని పాటిస్తూనే ప్రజలందరూ చిన్న పాటి సమూహాలుగా ఈ తెరల ముందు నిలుచుని రాజకీయ నాయకుల ప్రసంగాలను ఆలకించే పరిస్థితులూ రావచ్చు. ఇప్పుడు అందరి ఉమ్మడి శత్రువు ఓ వైరస్‌! ఈ మహమ్మారిని సమర్థంగా తుదముట్టించి, ప్రజారోగ్యానికి ఎవరైతే భరోసా ఇవ్వగలరని నమ్మితే జనం వారికే పట్టం కట్టే అవకాశాలున్నాయి. ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులూ సమూలంగా మారిపోనున్నాయి. వ్యాక్సిన్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియదు కాబట్టి- నూతన విధి విధానాల ప్రాతిపదికన ఎలెక్షన్ల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధపడవచ్చు. భారతీయ ఎన్నికల సంఘం దక్షిణ కొరియాలో ఇటీవల జరిగిన ఎన్నికల సరళిని క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. దేశీయ అవసరాలకు తగినట్లుగా కొన్ని మార్పులు చేసుకొని- అదే పద్ధతిని ఇక్కడా అనుసరించే అవకాశాలున్నాయి.


విలక్షణ ఎన్నికల నిర్వహణ
    మహమ్మారి ఉరుముతున్నా ఎన్నికల నిర్వహించిన దేశం దక్షిణ కొరియానే. ప్రజారోగ్యానికి, వారి భద్రతకు అమిత ప్రాధాన్యమిస్తూ దక్షిణ కొరియా ఎన్నికల సంఘం ఎన్నికల మహా క్రతువును సజావుగా ముగించడం విశేషం. వైరస్‌ నిర్మూలన రసాయనాలతో పోలింగ్‌ కేంద్రాలను ముందుగానే శుద్ధిచేయడం, ఓటింగ్‌కు బారులు తీరిన ప్రజలు కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడం, నిర్దిష్ట స్థాయికన్నా శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నవారికి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయడం; ఓటింగ్‌ ముగిసిన వెంటనే ఇలాంటి వారికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించడం వంటి చర్యలతో దక్షిణ కొరియా విశిష్ట పద్ధతిలో ఎన్నికలు నిర్వహించింది. ఈ ఏడాది చివర్లో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఒకవేళ షెడ్యూలు ప్రకారమే ఎలెక్షన్‌ కమిషన్‌ ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తే- పార్టీల ప్రచారం, పోలింగ్‌ తీరుతెన్నులకు సంబంధించి అది దేశానికే సరికొత్త మార్గనిర్దేశంగా మారవచ్చు. పశ్చిమ్‌ బంగ, కేరళ, అసోం, తమిళనాడు, జమ్ము-కశ్మీర్‌లలో వచ్చే ఏడాది నిర్వహించబోయే ఎన్నికలకు బిహార్‌ నమూనా ఉపయోగపడవచ్చు. రాష్ట్రాలన్నీ నిధుల సాయంకోసం కేంద్రంవైపు ఇప్పుడు ఆశగా చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో విపక్ష పాలిత రాష్ట్రాలపట్ల మోదీ ప్రభుత్వం ఎలా వ్యవహరించనుందన్నది ఆసక్తికరంగా మారింది. లాక్‌డౌన్‌ అమలులో రాష్ట్రాల పనితీరును అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు బయలుదేరాయి. లాక్‌డౌన్‌ నిబంధనల అమలులో ప్రభుత్వాల చిత్తశుద్ధిని, సమర్థతను అంచనా వేసి ఈ కేంద్రబృందాలు సమర్పించబోయే నివేదికలపైనే ఆయా రాష్ట్రాలకు కేంద్రం కేటాయించే నిధుల మొత్తం ఆధారపడి ఉంటుందన్న అంచనాలూ వినిపిస్తున్నాయి.

- రాజీవ్‌ రాజన్‌

Posted Date: 15-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం