• facebook
  • whatsapp
  • telegram

  అంతమొందించకుంటే ముప్పే!

* వైరస్‌లపై అధ్యయనాలు చెబుతున్నదిదే

చైనాలో మొదలైన కోవిద్‌-19 (కరోనా) వైరస్‌ మార్చి13 నాటికి 110 దేశాల్లో 1,32,000 మందికి పైగా సోకి 4,947 మరణాలకు కారణమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ వైరస్‌ వల్ల మరణాల రేటు వయోవృద్ధుల్లోనే ఎక్కువగా ఉందని చైనా, ఇటలీ దేశాల అనుభవం తెలుపుతోంది. ఇటలీ జనాభాలో వృద్ధుల శాతం ఎక్కువ. మార్చి 4వ తేదీ నాటికి ఆ దేశంలో కరోనా వైరస్‌ వల్ల మరణించిన 105 మంది సగటు వయసు 81 సంవత్సరాలు. స్విట్జర్లాండ్‌ పరిశోధకుల విశ్లేషణ ప్రకారం చైనాలో కరోనా వైరస్‌ వల్ల మరణించినవారిలో 20 ఏళ్ల లోపు ప్రాయంలోని వారు 1శాతంకన్నా తక్కువ. అదే 80 ఏళ్ల్లు పైబడినవారిలో మృతుల శాతం 18శాతం వరకు ఉంది. దీన్నిబట్టి వయోవృద్ధులందరికీ మృత్యువు పొంచి ఉందని కాదు. ఇటలీలో మరణించిన 105మంది వృద్ధులలో మూడింట రెండు వంతుల మందికి మూడు లేక అంతకుమించి పూర్వ రుగ్మతలు ఉన్నాయి. అధిక రక్తపోటు, హృద్రోగం, మధుమేహం, క్యాన్సర్‌ వంటి సమస్యలు ఉన్న వృద్ధులకు కరోనా గండం అధికం. అంతకన్నా పిన్న వయస్కులకు పూర్వ వ్యాధులు ఉంటే వారు కూడా జాగ్రత్తగా ఉండవలసిందే. వయసు మీరినవారిలో రోగ నిరోధక శక్తి సహజంగానే తగ్గిపోతుంది. దీనికి తోడు హృద్రోగం, రక్తపోటు, మధుమేహం ఉంటే అంతర్గత అవయవాల పనితీరు మందగిస్తుంది. రోగాలతో పోరాడే తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. ఉన్న కొద్ది కణాలు కూడా వయసులో ఉన్నంత చురుగ్గా పనిచేయవు. 60 ఏళ్లు, 70 ఏళ్లు పైబడిన చాలామందిలో రోగ నిరోధక శక్తి బాగానే ఉన్నా, 75-80 ఏళ్లు వచ్చేసరికి ఆ శక్తి బలహీనపడిపోతుంది. దేహంలో ప్రవేశించిన అంటు వ్యాధులను ఎదుర్కోవడానికి వృద్ధుల రోగ నిరోధక వ్యవస్థ (ఇమ్యూన్‌ సిస్టమ్) అతిగా ప్రతిచర్యకు దిగడంతో సమస్య వస్తోంది. కరోనా వైరస్‌ చొరబడగానే, దాన్ని ఎదుర్కోవడానికి దేహం భారీయెత్తున సైటోకైన్‌ అనే ప్రోటీన్లను విడుదల చేస్తుంది. దీన్ని వైద్య పరిభాషలో సైటోకైన్‌ ప్రభంజనం అంటారు. మితిమీరి విడుదలయ్యే సైటోకైన్ల వల్ల అంతర్గత వాపు ఏర్పడుతుంది. తీవ్ర జ్వరం, అంతర్గత అవయవాల వైఫల్యం సంభవిస్తుంది. సంతోషించాల్సిన విషయమేమంటే సైటోకైన్‌ ప్రభంజనాన్ని అదుపు చేసి మరణాల రేటును తగ్గించే చికిత్సలు అందుబాటులో ఉండటం.

కొత్త రోగానికి పాత మందులు
వృద్ధ రోగుల్లో సైటోకైన్‌ ప్రభంజనాన్ని పసిగట్టడానికి చైనా వైద్యులు సీరమ్‌ ఫెరిటిన్‌ రక్త పరీక్ష నిర్వహిస్తున్నారు. సైటోకైన్‌ ప్రభంజనాన్ని అరికట్టడానికి కార్టికో స్టెరాయిడ్‌ మందులు ఉపయోగపడతాయి కానీ, కరోనా వల్ల తీవ్ర అస్వస్థుడైన వ్యక్తికి ఆ మందులను వాడటం అభిలషణీయం కాదని వైద్యులు భావిస్తున్నారు. వాటికి బదులు కీళ్లవాతం, క్యాన్సర్‌ వంటి వ్యాధులపై ప్రయోగించే మందులను ఉపయోగిస్తున్నారు. ఇంటర్‌ ల్యూకైన్‌ (ఐఎల్‌-1, ఐఎల్‌-6, ఐఎల్‌-18), ఇంటర్ఫెరాన్‌-గామా వంటి సైటోకైన్‌ ప్రోటీన్లను అదుపు చేసే మందులను చైనాలో వాడుతున్నారు. వృద్ధుల్లో ప్రధానంగా ఐఎల్‌-6 అతిగా విడుదల కావడం వల్లనే రోగ నిరోధక వ్యవస్థ మితిమీరిన చురుకుదనం ప్రదర్శిస్తూ మృత్యువును కొనితెస్తోందని పరిశోధకులు కనుగొన్నారు. దీన్ని అరికట్టడానికి ఆక్టెమ్రా అమోఘంగా ఉపయోగపడుతోంది. స్విట్జర్లాండ్‌ కు చెందిన రోష్‌ కంపెనీ కీళ్లవాతం మందు ఆక్టెమ్రాను చైనాకు విరాళమిచ్చింది. అది నేరుగా కరోనా వైరస్‌ ను చంపదు. ఐఎల్‌-6ను నియంత్రిస్తుంది. కరోనా వైరస్‌ను, అది కలిగించే దుష్ప్రభావాన్ని ఎదుర్కోవడానికి చైనా వైద్యులు హెచ్‌ఐవీ మందు కాలెట్రా, ఫ్లూ మందు ఆర్బిడాల్‌ను కూడా వాడుతున్నారు. గిలియాడ్‌ సైన్సెస్‌ సంస్థ తయారుచేసిన రెండెసివిర్‌తో రోగులపై ప్రయోగాలు జరుపుతున్నారు. మరోవైపు వ్యాక్సిన్‌ తయారీ యత్నాలూ జోరుగా సాగుతున్నాయి.

కరోనా వైరస్‌ లక్షణాలు మొదట్లో ప్రమాదరహితంగా కనిపించినా, వైరస్‌ వేగంగా శ్వాసకోశంలోని దిగువ భాగానికి వ్యాపించవచ్చు. ఈ వైరస్‌ సోకినవారిలో 20శాతం మందిని ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేయాల్సి వస్తుంది. వారిలో 5శాతానికి మాత్రమే ఐసీయూలో నిరంతర చికిత్స అవసరపడుతుంది. చైనాలో ఆస్పత్రి పాలైన కరోనా రోగుల్లో 191మందిపై జరిగిన అధ్యయనం, ఆ రోగుల్లో సగంమందికి హృద్రోగం, మధుమేహం వంటి ఇతర వ్యాధులు ఉన్నాయని తేల్చింది. శ్వాసకోశ వ్యాధులు హృద్రోగులకు ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. వృద్ధులకు దగ్గడం, తుమ్మడం కష్టంగా ఉంటుంది కాబట్టి వారి శ్వాస కోశం నుంచి కరోనా వైరస్‌ను కళ్లె రూపంలో వేగంగా బయటకు పంపడం మరీ కష్టమవుతుంది. వారికి పొగతాగే అలవాటు, వాయు కాలుష్య పీడ ఎక్కువగా ఉంటే న్యుమోనియా బారిన పడతారు. ఏదిఏమైనా కరోనా బారిన పడిన వృద్ధులందరూ మరణించడం లేదని గమనించాలి. బలీయ రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారు కరోనాను ఖచ్చితంగా అధిగమిస్తారు. మందులు, ముందు జాగ్రత్తలతోపాటు కరోనా లక్షణాలు కనిపించిన తరవాత కొన్ని రోజులపాటు ఇతరులకు దూరంగా ఉండాలి. అదేసమయంలో వృద్ధులకు అండగా ఉన్నామని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు భరోసా ఇస్తూ ఉంటే వారు వేగంగా కోలుకుంటారు. నా అనే వాళ్లు కాస్త దూరం పాటిస్తూనే ఈ పనిచేయవచ్చు. వృద్ధులలో ఉద్యోగులు, యజమానులు, ఉపాధ్యాయులు, వైద్యులు, వ్యాపారులూ ఉంటారు. చాలామంది దేశ నాయకులు 60-70 ఏళ్లప్రాయంలోనివారే. కరోనా వైరస్‌ వల్ల వీరు కష్టనష్టాలకు గురైతే అది మిగిలినవారి మీద కూడా ప్రభావం చూపుతుందని గమనించాలి.

శీఘ్ర స్పందనతో సత్ఫలితాలు
ప్రభుత్వాలు మెరుపు వేగంతో వ్యవహరిస్తే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని వియత్నాం, తైవాన్‌ లు నిరూపించాయి. కరోనా గురించి చైనా అధికారికంగా ప్రకటించకముందే తైవాన్‌ విమాన ప్రయాణికులకు వైద్య తనిఖీలు మొదలుపెట్టింది. వియత్నాం చైనాకు విమాన రాకపోకలను బంద్‌ చేసి విద్యా సంస్థలను మూసేసింది. ఈ రెండు దేశాలకు చైనీయుల రాకపోకలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయినా ప్రభుత్వాల శీఘ్ర స్పందన వల్ల తైవాన్‌, వియత్నాంలలో కరోనా కేసులు 50 లోపునకే పరిమితమయ్యాయి. వేగంగా చర్యలు తీసుకోలేకపోయిన జపాన్‌, దక్షిణ కొరియాలలో వందల కేసులు నమోదయ్యాయి. భారతదేశం 5,000మందిపై వైద్య పరీక్షలు నిర్వహించగా, 74మందిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. గతంలో ఆఫ్రికాలో ఎబోలా విరుచుకుపడినప్పుడు, కేరళలో నిపా వైరస్‌ వ్యాపించినప్పుడు, సూరత్‌ లో ప్లేగు ప్రబలినప్పుడు భారత్‌ సకాలంలో సమర్థంగా చర్యలు తీసుకుని పరిస్థితిని అదుపుచేసింది. ప్రస్తుతం కరోనా పీడిత దేశాలకు రాకపోకలను తాత్కాలికంగా నిషేధించింది. ఇతర దేశాల్లో కరోనా బారిన పడిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చి క్వారంటైన్‌ చేసింది. దీనితోపాటు కరోనా చికిత్సకు మన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో పడకలు పెంచాలి. మందులు అందుబాటులో ఉంచాలి. పట్టణాలే కాదు పల్లెల్లోనూ ఈ విధమైన ఏర్పాట్లను ముమ్మరం చేయాలి.

- ప్రసాద్‌

Posted Date: 23-04-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం