• facebook
  • whatsapp
  • telegram

  పైపూతలతోనా ప్రక్షాళన?

భూమండలం మీద ఏ ఖండం ఓటర్లతో సరిపోల్చినా ఇండియాలో ఓటర్ల సంఖ్యే ఎక్కువ. భారతావనిలో ఎన్నికల్ని లోగడ వాజ్‌పేయీ ‘ప్రజాస్వామ్య కుంభమేళా’ అన్నా, నిర్వాచన్‌ సదన్‌ నేడు ‘దేశ మహోత్సవం’గా కొనియాడుతున్నా- వాస్తవానికి అవి ప్రజాతంత్ర విలువల్ని, స్ఫూర్తిని బహిరంగంగా బలి ఇస్తూ జరుగుతున్న జనస్వామ్య జాతర! స్వేచ్ఛగా సక్రమంగా ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగబద్ధంగానే విశేషాధికారాలు దఖలుపడిన ఎలెక్షన్‌ కమిషన్‌, ప్రజాస్వామ్య క్రతువు వన్నెలీనడానికి 1998, 2004, 2015 సంవత్సరాల్లో విపుల ప్రతిపాదనల్ని కేంద్రానికి సమర్పించింది. వాటిని ప్రభుత్వం వాటంగా అటకెక్కించేయడంతో, ప్రజాప్రయోజన వ్యాజ్యాల విచారణ సందర్భంగా ‘సుప్రీం’ ఇచ్చే ఆదేశాల అమలుకే పరిమితమవుతున్న ఈసీ- కొత్తగా పాతిక సూచనలతో ప్రజల ముందుకొచ్చింది. నిరుటి సార్వత్రిక ఎన్నికల దరిమిలా భిన్న అంశాలపై ఏర్పాటు చేసిన తొమ్మిది కార్యబృందాల సిఫార్సుల్ని క్రోడీకరించి వాటిపై సలహాలు కోరుతోంది. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, చిరునామా మార్పు, పేర్ల తొలగింపు వంటివాటికి వేర్వేరుగా సమర్పించాల్సి ఉన్న పత్రాలు ఓటర్లకు అసౌకర్యంగా ఉన్నాయంటూ- అన్ని సేవలకూ ఒకటే పత్రాన్ని సరళంగా అందించాలని ఈసీ ప్రతిపాదిస్తోంది. అసలు ఈ పని ఏనాడో చేయాల్సింది! ఎనభయ్యేళ్లు పైబడిన వయోజనులు, దివ్యాంగులకు ఈ తరహా సేవల్ని ఇంటి దగ్గరే అందించే చొరవ చూపుతామంటే- కాదనేదెవ్వరు? 17 ఏళ్ల పిల్లలందరి వివరాల్ని ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకొని, 18 ఏళ్లు రాగానే ఓటర్లుగా వారిని గుర్తించాలన్న ప్రతిపాదనా బాగుంది. ఏడాదికి నాలుగుసార్లు ఓటర్ల నమోదుకు అవకాశం, ఎలెక్ట్రానిక్‌ ఓటరు గుర్తింపు కార్డుల జారీ వంటివీ మెచ్చదగిన ప్రతిపాదనలే. ఎన్నికల వేళ ఓటరుగా నమోదైనచోట లేకపోవడంవల్ల 30శాతం ఓటర్లు తమ హక్కు వినియోగించుకోలేక పోతున్నారంటూ- వారికి సౌలభ్యంగా భిన్న ఓటింగ్‌ విధానాల్ని ఈసీ పరిశీలిస్తోందట. ఎన్నికల్లో రాజకీయ పక్షాలు చేసే వ్యయానికీ పరిమితులు నిర్ధారించాలన్న ప్రతిపాదన వీనులవిందుగా ఉన్నా- భారత ప్రజాస్వామ్యాన్ని కరిమింగిన వెలగపండు చేస్తున్న భ్రష్టాచారాలన్నీ అంతటితోనే మటుమాయమైపోతాయా?

ఇండియాలో ఎన్నికలంటే, అక్షరాలా ధనస్వామ్యం దాదాగిరీ. అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే అదనంగా మరో పాతిక శాతం (దాదాపు రూ.55-60 వేల కోట్లు) ఖర్చుతో నిరుడు జరిగిన సార్వత్రిక సమరానికి సరిపోలిక లేదని సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ (సీఎంఎస్‌) అధ్యయనం చాటుతోంది. ఎన్నికల బరిలోని అభ్యర్థుల మధ్య పోటీ సమాన ఫాయాలో ఉండాలన్న సమున్నత ఆదర్శంతోనే ఆయా రాష్ట్రాల్లో వ్యయ పరిమితుల్ని ఈసీ నిర్దేశిస్తోంది. అంతకు లోబడే వ్యయీకరించామంటూ తప్పుడు ప్రమాణపత్రాల సమర్పణతోనే గెలిచినవాళ్ల ‘ప్రజాసేవా ప్రస్థానం’ మొదలవుతుండగా, వాళ్ల పక్షాన సంబంధిత పార్టీలు, అయినవాళ్లు పారించే నిధుల ప్రవాహాలు- సమస్త విలువల్నీ నిలువునా ముంచేస్తున్నాయి. ఈ ఉపద్రవాన్ని నివారించేలా, అభ్యర్థికి నిర్ణయించిన వ్యయ పరిమితిలో గరిష్ఠంగా సగం మొత్తాన్ని పార్టీ ఎంతమంది అభ్యర్థుల్ని నిలబెడితే అంతతో హెచ్చించి- ఆ మేరకే ఖర్చు చెయ్యాలని 2015లోనే ప్రతిపాదించామని ఈసీ చెబుతోంది. వాస్తవానికి- రాజకీయ పక్షాలు ఎన్నికల్లో నిలబెట్టే అభ్యర్థుల సంఖ్య ఆధారంగా అవి చేసే ప్రచార ఖర్చుపై పరిమితి విధిస్తూ చట్ట సవరణలు తీసుకురావాలని 2010లోనే ఈసీ ప్రతిపాదన వెలుగు చూసింది! అలా చేస్తే కుల రాజకీయం కోరచాస్తుందన్న భాజపా అభ్యంతరంతో ఆ ప్రతిపాదన త్రిశంకు స్వర్గంలో వేలాడుతుండగా, 2014 సార్వత్రికంలో కాంగ్రెస్‌ చేసిన ఖర్చు దాదాపు రూ.516 కోట్లనుంచి నిరుటి ఎన్నికల్లో రూ.820 కోట్లకుపైగా లెక్కతేలగా, భాజపా వ్యయం రూ.714 కోట్లనుంచి ఎకాయెకి రూ.1200 కోట్లకుపైగా ఎగబాకింది. ఎన్నికల క్రతువు పవిత్రతను కుళ్లబొడుస్తున్న మహా పాతకాల్లో ఒకటి నల్లధనం అయితే రెండోది జనస్వామ్య వ్యవస్థ మూలుగనే జుర్రేస్తున్న నేరగ్రస్త రాజకీయం. ఈసీ ప్రతిపాదనల్లో దానికి స్థానం లేకపోవడమే విడ్డూరం!

ప్రజోపయోగ వ్యవస్థల రాణింపు వాటి సారథ్య స్థానాల్లో ఉన్న వ్యక్తుల నడత, సచ్ఛీలత, రుజువర్తన, సామర్థ్యాలపైనే ఆధారపడి ఉంటుంది. రెండున్నర దశాబ్దాల క్రితం ఎన్‌ఎన్‌ వోరా కమిటీ నివేదించినట్లు- భూ కబ్జాలతో కాసుల పుష్టి సాధించిన నేరగాళ్లు రాజకీయ నేతలుగా రూపాంతరం చెందిన దురవస్థ నేడు కళ్లకు కడుతోంది. ‘సాధారణ కేసుల్లోనూ నేరాభియోగాలు నమోదు అయిన వారెవరైనా డాక్టర్‌ ఇంజినీర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ లేదా జడ్జీ అయ్యే అవకాశమే లేనప్పుడు అలాంటివాళ్లను ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా అనుమతించడం అహేతుకం, అసంబద్ధం’- అంటూ అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో సుప్రీం తీర్పు పరిమిత సాంత్వనే కలిగించింది. క్రిమినల్‌ నేరారోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థుల మీద, వాళ్లను నిలబెట్టిన పార్టీల మీద చర్యలు తీసుకోవాలన్న ఈసీ వాదనను తోసిపుచ్చి- వాళ్లను ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందో పార్టీలు ప్రజలకు వివరించాల్సిందేనని ‘సుప్రీం’ ఆదేశించింది. అసలు ప్రభుత్వ కార్యాలయంలో సాధారణ గుమాస్తా ఉద్యోగానికే రెండంచెల పరీక్షలు, ఇంటర్యూల రూపేణా వడపోతలు నిష్ఠగా సాగుతున్న దేశంలో- ప్రజా ప్రతినిధులుగా, పాలకులుగా చక్రం తిప్పాలనుకొనేవారికి ఎలాంటి ప్రమాణాలూ పరీక్షలూ నిర్దేశించకపోవడం ఏమిటి? దివాలా తీసినవారు ఎన్నికల్లో పోటీకి అనర్హులంటున్న చట్టం- దేశాన్ని దివాలా తీయించినవారిని అడ్డుకోలేకపోవడం ఏమిటి? ప్రభుత్వోద్యోగులకు నిర్ధారిస్తున్న పాటి అర్హతా ప్రమాణాలు సైతం ప్రతినిధులకు అవసరం లేదన్నట్లుగా ఉన్న అవ్యవస్థ రూపుమాసిపోనిదే- భారత ప్రజాస్వామ్యం తెరిపిన పడే దారేదీ?

Posted Date: 30-04-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం