• facebook
  • whatsapp
  • telegram

దేశాల మధ్య పన్ను చిచ్చు!

ఆన్‌లైన్‌ వాణిజ్య ప్రభావం

డిజిటల్‌ పన్నులు వివిధ దేశాల మధ్య వివాదాలకు కారణమవుతున్నాయి. అమెరికాలో వ్యాపారం చేసే భారత కంపెనీలకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ జీఎస్‌పీ మినహాయింపులను తొలగించారు. అదే అమెరికా కంపెనీలు భారత్‌లో వ్యాపారం చేసి పన్ను చెల్లించకపోతే మాత్రం ప్రశ్నించకూడదన్నట్లుగా ఉంటోంది ఆయన వైఖరి. ఫ్రాన్స్‌వంటి దేశాలు నిర్మొహమాటంగా అమెరికా డిజిటల్‌ కంపెనీల ముక్కుపిండి పన్ను వసూలు చేయడంతో భారత్‌సహా దాదాపు 10 దేశాలు అదే బాట పట్టాయి. డిజిటల్‌ యుగంలో భౌతికంగా ఆయా దేశాల్లోనే ఉంటూ వ్యాపారం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో డిజిటల్‌ రంగ సంస్థలు పలు దేశాల్లో అనుబంధ సంస్థలను సృష్టించి వాటి నుంచి పొందుతున్న సేవలకు గాను చెల్లింపుల రూపంలో భారీ ఖర్చు చూపించి వ్యాపారం చేసిన దేశాల్లో లాభాలను కప్పిపుచ్చుతున్నట్లు తేలింది. తమ భౌతిక కార్యాలయాలను పన్ను స్వర్గధామాల్లో ఏర్పాటు చేసి భారీగా సొమ్మును మిగుల్చుకొంటున్నాయి. గతంలో అమెరికాకు చెందిన ఒక డిజిటల్‌ దిగ్గజ సంస్థ అయిదేళ్లలో భారత్‌ నుంచి ఈ రకంగా రూ.16,119 కోట్లు సింగపూర్‌, ఐర్లాండ్‌లకు తరలించినట్లు సమాచారం. 2016లో యాపిల్‌ సంస్థ కూడా తమ లాభాలపై ఐరోపా దేశాల్లో పన్ను లబ్ధి కోసం ఐర్లాండ్‌కు తరలించింది. దీనిపై మండిపడ్డ ఐరోపా కమిషన్‌ జరిమానా చెల్ల్లించాలని ఆదేశించింది. ఫ్రాన్స్‌ గత జులైలో విదేశీ ఈ-కామర్స్‌ సంస్థల వ్యాపారంపై మూడు శాతం పన్నులు చెల్లించాలని పేర్కొంది. భారత్‌ సహా యూకే, ఇటలీ, స్పెయిన్‌, టర్కీ, బ్రెజిల్‌, చెక్‌రిపబ్లిక్‌, ఇండొనేసియాలు పన్నుల కొరడాను ఝళిపించాయి.

భారీగా ఆర్జన
భారత్‌లో డిజిటల్‌ రంగంలో సేవలు అందించే విదేశీ సంస్థలు వాణిజ్య ప్రకటనల రూపంలో భారీగా ఆర్జిస్తున్నాయి. దీంతో ఈ సంస్థలకు ఏడాదికి లక్ష రూపాయల విలువ దాటి ఇచ్చే వాణిజ్య ప్రకటనలపై భారత ప్రభుత్వం 2016-17లో ‘ఈక్వలైజేషన్‌ లెవీ’ పేరిట పన్ను విధించింది. ఆయా సంస్థలకు ఇచ్చే వాణిజ్య ప్రకటనల విలువపై ఆరు శాతం పన్ను తగ్గించి వినియోగదారుడే ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇది మూలం వద్దే పన్ను కోతలా పనిచేస్తుంది. ఈ రకంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ రూ.900 కోట్లు వసూలు చేసింది. ‘ఈ-కామర్స్‌’ సంస్థలు భారత్‌లో వేళ్లూనుకుని చిరు వ్యాపారుల వాటాను లాక్కోవడంతో దేశీయ వర్తకుల నుంచి వచ్చే పన్నులు తగ్గాయి. దీంతో ప్రభుత్వం ‘ఈ-కామర్స్‌’ వ్యాపార విలువ ఆధారంగా పన్ను విధించింది. రెండు కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం చేసే సంస్థలపై ఏప్రిల్‌ నుంచి రెండు శాతం పన్ను వేసింది.

అమెరికా సంస్థలపై విచక్షణ కనబరుస్తూ దేశీయ సంస్థలకు లాభం చేకూర్చేలా అనైతిక వ్యాపార విధానాలు అవలంబిస్తున్నారని ఆరోపిస్తూ అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం ఆఫీసు సెక్షన్‌ 301 కింద పది దేశాలపై దర్యాప్తు మొదలుపెట్టింది. దీనిలో సరైన కారణాలు దొరికితే ఆయా దేశాల ఉత్పత్తులపై అమెరికా పన్నులు విధిస్తుంది. పది దేశాల జాబితాలో భారత్‌ కూడా ఉంది. ఇదే సెక్షన్‌ను చైనాతో వాణిజ్య యుద్ధంలో అమెరికా ప్రయోగించడం గమనార్హం. అసలు ఈ సెక్షనే డబ్ల్యూటీఓ తీర్మానాలకు వ్యతిరేకం. డిజిటల్‌ పన్ను దేశాల మధ్య చిచ్చు పెడుతోందన్న విషయాన్ని జీ20 సభ్యదేశాలు గుర్తించాయి. డిజిటల్‌ కంపెనీలపై పన్నుకు సంబంధించి గత ఏడాది చర్చించిన విషయం అమెరికాకు తెలియనిది కాదు. ఆ సదస్సులో దీనికి సంబంధించిన నియమావళిని రూపొందించే బాధ్యతను ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ)కు అప్పగించారు.

ఒప్పందానికి అనుగుణంగానే...
ఫార్మా దిగుమతుల ధరలపై నియంత్రణ, డేటా లోకలైజేషన్‌, ఆన్‌లైన్‌ వ్యాపారంలో మార్పులు వంటి భారత్‌ నిర్ణయాలు ట్రంప్‌ సర్కారుకు రుచించలేదు. అమెరికా డిజిటల్‌ కంపెనీల విషయంలో నిర్ణయం కూడా మింగుడుపడలేదు. అందుకే భారత్‌పై ఒత్తిడి పెంచాలని భావించినా 2020 ఫిబ్రవరిలో ట్రంప్‌ పర్యటన ఉండటంతో వాణిజ్య ఒప్పందం జరగవచ్చని భావించింది. కానీ, చర్చలు కొలిక్కి రాకపోవడంతో అలాంటిదేమీ చోటు చేసుకోలేదు. దీంతో ఈ చర్చల్లో జరిగే బేరాల్లో పైచేయి సాధించేందుకు ఈ దర్యాప్తును చేపట్టింది. దీనికి సంబంధించి త్వరలో నివేదిక కూడా వెలువడనుంది. భారత్‌ మాత్రం తన నిర్ణయం డబ్ల్యూటీఓ ఒప్పందానికి అనుగుణంగా ఉందని బలంగా నమ్ముతోంది. అమెరికా దూకుడుగా పన్నులు విధించినా, ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందం ప్రకారం భారత్‌ మరిన్ని పన్నులను అమెరికా ఉత్పత్తులపై విధించే హక్కు లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తొలుత డిజిటల్‌ పన్ను విధించిన ఫ్రాన్స్‌పై ప్రతీకారంగా ఆ దేశ ఉత్పత్తులపై అమెరికా 25 శాతం పన్నులు విధించింది. దీంతో ఓఈసీడీ నిర్ణయం వచ్చేవరకు డిజిటల్‌ పన్ను వసూలు చేయకుండా ఉండేందుకు ఫ్రాన్స్‌ అంగీకరించింది. అమెరికా కంపెనీలూ ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు పన్నులు ఉండకుండా ఓఈసీడీ చూపించే మార్గంపై ఆశలు పెట్టుకొన్నాయి. అమెరికాలో ట్రంప్‌ అధ్యక్ష పదవి నుంచి వైదొలగి, బైడెన్‌ వచ్చినా పరిస్థితిలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

- లక్ష్మీతులసి
 

Posted Date: 23-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం