• facebook
  • whatsapp
  • telegram

రష్యాతో పెరుగుతున్నదూరం

భారత్‌ లేకుండా అఫ్గాన్‌ శాంతి ప్రక్రియ

అంతర్జాతీయ రాజకీయ యవనికపై నిస్సందేహంగా రెండు ప్రధాన శిబిరాలు ఆవిష్కృతమయ్యాయి. ఒక శిబిరాన్ని చైనా, రష్యాలు నడిపిస్తుంటే- మరొకటి అమెరికా ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఏ శిబిరంవైపూ పూర్తిస్థాయిలో మొగ్గు చూపకుండా ‘వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి’ విధానాన్ని కొనసాగిస్తున్న భారత్‌ ఆ పంథాను మరెంతోకాలం నిలుపుకొనే అవకాశాలు కనిపించడం లేదు. సంస్కృతీ సంప్రదాయాల్లో ఇండియాతో అనేక సారూప్యతలున్న రష్యా ఇటీవల పాకిస్థాన్‌తో జట్టుకట్టడం గమనార్హం. ఇది భారత్‌కు కలవరం కలిగించే పరిణామం. మరోవైపు అఫ్గానిస్థాన్‌ శాంతి చర్చల్లో భారత్‌కు పాత్ర లేకుండా రష్యా దారులు మూసివేసిందనే ప్రచారానికి అంతర్జాతీయ మాధ్యమాలు తెరతీశాయి.

వాతావరణాన్ని తేలిక చేయడంలో భాగంగా రష్యా ఇటీవల ఒక ప్రకటన చేస్తూ... అఫ్గాన్‌లో శాంతి స్థాపన అంశంపై సందర్భం వచ్చినప్పుడు భారత్‌ లోతైన పాత్రను పోషిస్తుందంటూ పేర్కొంది. ‘సందర్భం వచ్చినప్పుడు’ అంటే ప్రస్తుతానికి భారత్‌కు ఆ శాంతి ప్రక్రియలో స్థానం లేనట్లేనా అన్న అనుమానం కలగక మానదు. అఫ్గాన్‌లో శాంతిస్థాపనపై మార్చి 18న మాస్కో చర్చలు నిర్వహించనుంది. రష్యా, చైనా, అమెరికా, పాకిస్థాన్‌ ప్రత్యేక ప్రతినిధుల స్థాయిలో మార్చి 18న మాస్కోలో అఫ్గానిస్థాన్‌ అంతర్గత శాంతిపరిరక్షణపై చర్చించేందుకు ఒక సాధారణ సమావేశం నిర్వహిస్తామని రష్యా ప్రతినిధి వెల్లడించారు. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వ ప్రతినిధులు, అఫ్గాన్‌ అత్యున్నత జాతీయ సయోధ్య మండలి, ప్రముఖ రాజకీయవేత్తలు, ఖతార్‌ ప్రతినిధులు, తాలిబన్‌ ఉద్యమకారులు ఈ సమావేశానికి ప్రత్యేక అతిథులుగా వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. భారత్‌ పేరు ప్రస్తావించకపోవడాన్ని బట్టి ఈ కార్యక్రమంలో ఇండియాకు స్థానం లేదనే తెలుస్తోంది. భారత్‌ వ్యూహాత్మక తటస్థత విధానాన్ని విడనాడి, స్పష్టమైన వైఖరితో ముందుకు రావాల్సిన తరుణం ఆసన్నమైందా అన్న ప్రశ్నలు రేకెత్తించిన ప్రకటన అది.

వాస్తవానికి రష్యా ఈ చర్చలకు భారత్‌ను దూరంగా పెట్టడానికి చాలా కారణాలున్నాయి. మొట్టమొదటి కారణమేమిటంటే, ప్రస్తుతం భారత్‌-అమెరికాల మధ్య సంబంధాలు భేషుగ్గా ఉన్నాయి. భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ల చతుర్భుజి (క్వాడ్‌)- హిందూ మహా సముద్రం, పసిఫిక్‌ ప్రాంతాల్లో అమెరికా ఇతర పశ్చిమ దేశాల ప్రయోజనాలకు అండగా నిలుస్తోంది. నానాటికీ విస్తరిస్తున్న చైనా ప్రభావానికి, దుందుడుకుతనానికి కళ్ళెం వేస్తోంది. అమెరికాలో బైడెన్‌ నాయకత్వంపై రష్యాకు ఉన్న వ్యతిరేకతవల్ల ఆ దేశం చైనాతో లోతైన సంబంధాలు నెరపుతోంది. ఈ చర్చల్లో భారత్‌కు ప్రాధాన్యమిస్తే ఆ మేరకు అమెరికాకూ చర్చల్లో వాటా కల్పించినట్లవుతుంది. రెండో కారణమేమిటంటే- ప్రస్తుతం రష్యా, చైనాల సంబంధాలు వంకపెట్టలేనివిగా ఉన్నాయి. తూర్పు లద్దాఖ్‌లో తలెత్తిన ఘర్షణలు భారత్‌, చైనాల ద్వైపాక్షిక సంబంధాలను ప్రతికూలంగా మార్చాయి. సరిహద్దుల్లో ఇరు పక్షాల మధ్య ఎన్నో వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలో చైనాకు ఇబ్బంది కలిగించే విధంగా- అఫ్గాన్‌ శాంతి చర్చల జాబితాలో భారత్‌కు చోటు కల్పించడం సరికాదని రష్యా భావించింది.

మూడోది- అఫ్గాన్‌ శాంతి చర్చల్లోనూ, ఒప్పందాల అనంతరం చోటుచేసుకోబోయే అభివృద్ధి కార్యకలాపాల్లోనూ తన ప్రమేయమే ప్రబలంగా ఉండాలని రష్యా బలంగా కోరుకొంటోంది. అలాంటప్పుడు భారత్‌కు చర్చల్లో చోటు కల్పిస్తే- ఈ కృషితోపాటు, తదనంతర అభివృద్ధి పరిణామాల్లోనూ పరోక్షంగా అమెరికాను భాగస్వామిగా చేసినట్లే అవుతుంది. దానివల్ల తన ప్రమేయం కుదించుకుపోతుందని రష్యా భావిస్తోంది.

నాలుగోది- పశ్చిమ ఆసియాలో రష్యా అమెరికాల ప్రయోజనాలు పరస్పరం పూర్తిగా భిన్నమైనవి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఉన్న సమయంలో పశ్చిమాసియాకు సంబంధించి భారత్‌ చాలావరకు అమెరికా పంథాలోనే ముందుకు సాగింది. దాంతో సంప్రదాయంగా ఇరాన్‌తో భారత్‌కు ఉన్న సన్నిహిత సంబంధాలు కొంతమేర బీటలు వారాయి. అయిదోది- అఫ్గానిస్థాన్‌ను తమ ‘పెరటి దేశం’గా రష్యా భావిస్తోంది. పశ్చిమాసియాకు ముఖద్వారంగా ఉన్న అఫ్గాన్‌- భవిష్యత్తులో రష్యాకు వ్యూహాత్మకంగా కీలకమవుతుందన్నది ‘మాస్కో’ నాయకత్వం అంచనా. ఈ స్థితిలో అఫ్గాన్‌ శాంతి చర్చల్లో భారత్‌కు భాగం కల్పిస్తే అది అమెరికాకు మేలు చేయడంతోపాటు- తన మిత్రదేశమైన పాకిస్థాన్‌నూ ఆందోళనకు గురిచేసినట్లు అవుతుంది. ఈ కారణాలవల్ల ఆధిపత్య నిరూపణే ధ్యేయంగా అఫ్గాన్‌లో సమావేశానికి రష్యా సంసిద్ధమవుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నేతృత్వంలో అమెరికా అనుసరిస్తున్న విధానాలు- భారత్‌, రష్యాలమధ్య సన్నటి అడ్డురేఖను సృష్టించగలిగాయనే చెప్పాలి!

- సంజీవ్‌ బారువా
 

Posted Date: 16-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం