• facebook
  • whatsapp
  • telegram

డ్రాగన్‌తో అంటకాగుతున్న ఇరాన్‌

మధ్యాసియాలో భారత విధానాలకు ముప్పు!

ఇరాన్‌తో భారత్‌ సంబంధాలకు ఇటీవల ఎదురుదెబ్బ తగిలింది. ఫర్జాద్‌-బి సహజవాయువు క్షేత్రం అభివృద్ధి కాంట్రాక్టును- దాన్ని కనుగొన్న ‘ఓఎన్‌జీసీ విదేశ్‌’ సంస్థకు కాకుండా, తమ దేశంలోని పెట్రోపార్స్‌ సంస్థకు ఇరాన్‌ అప్పగించింది. ఓఎన్‌జీసీ విదేశాంగ విభాగమైన ఓఎన్‌జీసీ విదేశ్‌, ఈ క్షేత్రాన్ని ఫార్సీ తీరం వద్ద 2008లో గుర్తించింది. ఇక్కడ 23 లక్షల కోట్ల ఘనపుటడుగుల సహజవాయువు నిల్వలు ఉన్నాయి. భారత్‌ వ్యాపార సంస్థల బృందం ఇప్పటికే ఇక్కడ 40 కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడి పెట్టింది. ఇదంతా ఆ క్షేత్రానికి చెందిన కాంట్రాక్టు కోసమే! కానీ ఇప్పుడది దక్కలేదు. పైప్‌లైన్ల ఏర్పాటు, అభివృద్ధి ప్రణాళికకు భారత్‌ కోట్‌ చేసిన సొమ్ములపై విభేదాలు నెలకొనడమే ఇందుకు కారణం. అణుఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు అమెరికా ప్రకటించడంతో ఇరాన్‌ స్థితిగతులు ఒక్కసారిగా మారిపోయాయి. ఫలితంగా వాణిజ్య సంప్రదింపులకు సరైన సమయం దొరకలేదు. ఆ తరవాత ఆ క్షేత్రాన్ని తామే స్వయంగా అభివృద్ధి చేసుకుంటామని, మలివిడతలో భారత్‌ను చేరుస్తామని 2020లో ఇరాన్‌ అనూహ్య ప్రకటన చేసింది. తాజాగా ఆ కాంట్రాక్టును స్వదేశీ సంస్థకు అప్పగించింది. ఇది భారత్‌కు దక్కి ఉంటే ఇరు దేశాల మధ్య మైత్రి మరింత దృఢంగా మారేది.

చాబహార్‌పై ప్రభావం

ఈ పరిణామాల ప్రభావం చాబహార్‌ ఓడరేవు ప్రాజెక్టుపైనా పడే అవకాశముంది. ఏడాదిలో పూర్తయ్యే ఈ పోర్టు, భారత్‌కు వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యం. ఇది భారత్‌ను అఫ్గానిస్థాన్‌, మధ్యాసియాకు అనుసంధానిస్తుంది. చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా(సీపెక్‌)కు దీటుగా ఉంటుంది. ఈ ప్రాజెక్టులో ఇండియా 50 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధపడింది. 2020-21 కేంద్ర బడ్జెట్‌లో వంద కోట్ల డాలర్ల పెట్టుబడులకు హామీ ఇచ్చింది. భద్రతాపరంగా చూస్తే, పాకిస్థాన్‌ మద్దతుతో అరేబియా సముద్రంలో చైనా నిర్మిస్తున్న గ్వాడార్‌ పోర్టుకు చాబహార్‌ ఓడరేవు దీటుగా నిలబడుతుంది. పశ్చిమ అరేబియాలో ఉనికిని పెంచుకోవడంతో పాటు ఆఫ్రికా తీరం వద్ద వాణిజ్య ఓడల భద్రత కోసం నౌకలను ఉంచేందుకు ఉపయోగపడుతుంది. భారత్‌కు ఆ మార్గం నుంచే ఇంధన    దిగుమతులు వస్తుండటంతో ఇది ఎంతో కీలకం. కానీ ఇప్పుడు ఇరాన్‌ వైఖరిలో వచ్చిన మార్పుతో చాబహార్‌ రేవును వినియోగించుకోవాలన్న భారత్‌ ప్రణాళికలకు ముప్పు పొంచి ఉంది.

చాబహార్‌ రైలు ప్రాజెక్టు నుంచి భారత్‌ను తప్పించారని గత సంవత్సరం నివేదికలు బయటపడ్డాయి. ఇరాన్‌తో చైనా వ్యూహాత్మక బంధం ఏర్పరచుకున్న కొన్ని గంటల తరవాత ఈ వార్త అందడం గమనార్హం. భారత్‌ ప్రణాళికలపై దెబ్బ కొట్టి, ఆ ప్రాంతం నుంచి వెనక్కి నెట్టేందుకు ఇరాన్‌తో సాన్నిహిత్యాన్ని ఓ అవకాశంగా చైనా భావిస్తోంది. తమ బంధాన్ని మరింత బలపరుస్తూ 2021 మార్చి 27న చైనా-ఇరాన్‌ పాతికేళ్ల వ్యూహాత్మక సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా చైనా 40 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. భవిష్యత్తులో ఇటువంటి ఒప్పందమే సౌదీ అరేబియా, యూఏఈతో కుదుర్చుకోవాలని చైనా చూస్తోంది. ఇది భారత్‌కు ఆందోళనకరమే! చైనా, ఇరాన్‌లు అమెరికా ఆంక్షల పరిధిలో ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్‌ విలవిలలాడుతోంది. చైనా పెట్టుబడులతో ఆ దేశానికి కొంత ఉపశమనం  లభించింది. ఈ పరిణామాల ఫలితంగా ఇరాన్‌తో భారత్‌కు ఉన్న వ్యూహాత్మక సంబంధాలు దెబ్బతిని, మధ్యాసియాలో భారత విదేశాంగ విధానమే ప్రమాదంలో పడే అవకాశముంది.

సమీక్షా సమయమిది!

అమెరికా-చైనా ఒకదానిపై మరొకటి విరుచుకుపడుతూనే- మిత్రపక్షాలతో జతకడుతూ తమ బలాన్ని కూడగట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా పాకిస్థాన్‌, నేపాల్‌, అఫ్గానిస్థాన్‌తో కలిసి ఓ క్వాడ్‌ బృందాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పిస్తోంది డ్రాగన్‌ దేశం. మరోవైపు ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం చైనా, పాకిస్థాన్‌, రష్యా, టర్కీలతో కూటమి ఏర్పాటు చేయాలని ఇరాన్‌ ఇదివరకే ప్రతిపాదించింది. చైనా-ఇరాన్‌ మధ్య కుదిరిన తాజా ఒప్పందం దీనికి పునాది అనుకోవచ్చు. ఇదే జరిగితే భద్రతాపరంగా భారత్‌కు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఖజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, తజకిస్థాన్‌, తుర్కమెనిస్థాన్‌, ఉజ్‌బెకిస్థాన్‌లతో కూడిన మధ్యాసియాకు చేరాలంటే భారత్‌కు ఇరాన్‌తో మైత్రి చాలా కీలకం. మరోవైపు దేశానికి రాజకీయంగా, ఆర్థికంగా అత్యంత ముఖ్యమైన అఫ్గానిస్థాన్‌కు చేరాలన్నా ఇరాన్‌పైనే ఆధారపడాలి. అందుకే ఇరాన్‌తో సత్సంబంధాలు భారత్‌కు అత్యవసరం. ఇరాన్‌పై భారత్‌ తన విదేశాంగ విధానాలను సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్‌లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వాణిజ్య లోటు, ఆర్థిక లోటు తారాస్థాయిలో ఉన్నాయి. ఆంక్షలు తొలగిస్తే ఆ దేశం కొంత ఊపిరి పీల్చుకొంటుంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉపసంహరించుకున్న అణు ఒప్పందంలో అమెరికా తిరిగి చేరితే, ఆంక్షల సడలింపునకు నాంది పడినట్టు అవుతుంది. ఇక్కడే భారత్‌ తనదైన ముద్ర వేసేందుకు వ్యూహాలు రచించాలి. అమెరికా-ఇరాన్‌ మధ్య సమతౌల్యంతో వ్యవహరించాలి. ప్రత్యక్ష సంప్రదింపులకు ఇరాన్‌ను ఒప్పించి, అణు ఒప్పందం కుదిరేలా పావులు కదిపితే భారత్‌ స్థాయి, శక్తి పెరుగుతాయి. ఇరాన్‌ విషయంలో చైనాపై ఆధిపత్యం సాధించినట్లవుతుంది.

- డాక్టర్‌ రాధా రఘురామపాత్రుని 
(అంతర్జాతీయ వాణిజ్య రంగ నిపుణులు)

 

Posted Date: 25-05-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం