• facebook
  • whatsapp
  • telegram

డ్రాగన్‌కు సవాలుగా ‘ఏక సంతానం’

వికటించిన చైనా కుటుంబ నియంత్రణ

రాజరికాలకు స్థానం లేని సమ సమాజాన్ని స్వప్నించిన చైనాలో ‘ఒక్క సంతానమే ముద్దు’ అనే విధానంతో బుల్లి చక్రవర్తులు పుట్టుకురావడమే విధి విలాసం! కమ్యూనిస్టు ప్రభుత్వం నిర్బంధంగా అమలుచేసిన ఈ కుటుంబ నియంత్రణ విధానం మగ సంతాన వృద్ధికి దారితీసింది. ఆడ శిశువులు వద్దనుకునే చైనా సమాజంలో ఒకే ఒక్క మగ బిడ్డను కనడం సర్వసాధారణమైపోయింది. ఆ పుత్రరత్నాన్ని చంక దిగనివ్వకుండా అతి గారాబం చేయడానికి అమ్మానాన్నలు, వారిద్దరి అమ్మానాన్నలు పోటీపడటం సహజమైపోయింది. ఈ ఆరుగురికీ తోబుట్టువులు లేకపోవడమే దీనికి కారణం. వారికి సొంత సంపాదన ఉండటంతో పిల్లవాడిని రకరకాల బొమ్మలు, తినుబండారాలు, కానుకలతో ముంచెత్తుతారు. ఆడపిల్ల అయితే ఇంత మురిపెం కనిపించదు. పుట్టినప్పటి నుంచి కాలు కింద పెట్టకుండా పెద్దల నెత్తి మీద, భుజాల మీద గారాలు పోయే బుల్లి చక్రవర్తులు పెద్దయ్యాక కూడా కొండ మీది కోతి కావాలని మంకుపట్టు పడుతుంటారు.

కమ్యూనిస్టు చైనా సాధకుడు మావో సేటుంగ్‌ పెద్ద సంతానాన్ని కోరుకునేవారు. 1976లో ఆయన మరణించాక పగ్గాలు చేపట్టిన డెంగ్‌ సియావో పింగ్‌ జనాభా తగ్గింపుతోనే శీఘ్ర పురోగతి సాధ్యమని భావించి, 1979లో ఏక సంతాన విధానాన్ని ప్రారంభించారు. దీనికి రెండు మినహాయింపులు ఇచ్చారు. గ్రామాల్లోనైతే మొదటి సంతానం ఆడపిల్ల అయితే అయిదేళ్ల తరవాత రెండో సంతానం కనవచ్చునన్నారు. మైనారిటీ వర్గాలైతే ముగ్గురు పిల్లల వరకు కనవచ్చు. 1958-62 మధ్య కాలంలో మావో గ్రేట్‌ లీప్‌ ఫార్వార్డ్‌ విధానం వల్ల మూడు కోట్ల జనాభాను కోల్పోయి, 1966-76 మధ్య సాంస్కృతిక విప్లవం వల్ల అతలాకుతలమైపోయిన చైనా సమాజానికి ఏక సంతాన విధానం గోరుచుట్టుపై రోకటి పోటులా పరిణమించింది. అవాంఛిత జననాల నిరోధానికి మహిళలు నిర్బంధంగా గర్భస్రావాలు చేయించుకోవలసి వచ్చింది. ఒక్కరికన్నా ఎక్కువ సంతానం కనే కుటుంబాలు భారీ జరిమానాలు కట్టాల్సి వచ్చేది. 2012 నాటికి ఈ జరిమానాల వల్ల చైనా ప్రభుత్వానికి 31,400 కోట్ల డాలర్లు సమకూరాయని అంచనా. అందరూ మగబిడ్డనే కోరుకోవడం వల్ల ఆడ శిశువులు పుట్టడం తగ్గిపోయింది. 2010నాటికి చైనా జనాభాలో ప్రతి 118మంది పురుషులకు కేవలం 100 మంది స్త్రీలు ఉన్నారని తేలింది. నేడు చైనాలో స్త్రీలకన్నా పురుషుల సంఖ్య 3.3 కోట్లు ఎక్కువ. లింగ నిష్పత్తిలో ఈ వైపరీత్యం వధువుల కొరతను సృష్టించింది. గ్రామాల్లోని పేద చైనీయులకు వధువు దొరకని స్థితి నెలకొన్నది. ఆడపిల్లల కొరత కన్యాశుల్క విజృంభణకు కారణమైంది. ఒకప్పుడు 11 వేల యువాన్లు(దాదాపు 1.26 లక్షల రూపాయాలు)గా ఉన్న కన్యాశుల్కం, నేడు 10 లక్షల యువాన్లకు(రూ.1.15 కోట్లు) చేరింది. కొత్త జంటకు సొంతిల్లు సమకూర్చడమే కాకుండా, వధువు తల్లిదండ్రులకు కన్యాశుల్కంతోపాటు కొత్త కారు, ఇల్లు కొనిపెట్టాల్సిన అగత్యం వరుడి అమ్మానాన్నలకు సంప్రాప్తిస్తోంది. ఇంత ఆర్థిక భారాన్ని తలకెత్తుకునే శక్తి గ్రామీణ వరులకు ఉండదు. చైనాలో గ్రామీణుల సగటు వార్షిక ఆదాయం 15,000 యువాన్లు (రూ.1.72 లక్షలు) మాత్రమే. దీంతో వారు పెళ్లిచేసుకోవడానికి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

ఏక సంతానం విధానంతో 40 కోట్ల జననాలను నివారించగలిగామని చైనా అధికారులు నిన్నమొన్నటివరకు మురిసిపోయేవారు. విస్తృత పారిశ్రామికీకరణ గ్రామాల్లోని మిగులు శ్రామిక శక్తిని పట్టణాలకు లాగేసింది. ప్రస్తుతం భారతదేశంలో శ్రామికుల సగటు వయసు 27 సంవత్సరాలైతే, చైనాలో 38.4 సంవత్సరాలు. చైనాలో శ్రామిక జనాభా తగ్గుతున్నందువల్ల, వారికి గిరాకీ పెరిగి ఎక్కువ జీతభత్యాలు చెల్లించుకోవలసి వస్తోంది. ఉత్పత్తి వ్యయం పెరిగి ప్రపంచ విపణిలో చైనా ఎగుమతులు ఖరీదయ్యే అవకాశం కనిపిస్తోంది. పైగా, చైనాలో పనిచేసే వయసులోని (15-59 ఏళ్ల) వారికన్నా 60 ఏళ్ల వయసు పైబడినవారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఫలితంగా 2011లో 93.5 కోట్లుగా ఉన్న చైనా శ్రామిక జనాభా 2020కల్లా 89.4 కోట్లకు తగ్గిపోయింది. 2010లో చైనా జనాభాలో పనిచేసేవారు 70.1 శాతంగా ఉండగా, 2050కల్లా అది 50 శాతానికి తగ్గిపోనున్నది. ఇది చైనా ఆర్థికాభివృద్ధిని దెబ్బతీసే పరిణామమే. దీంతో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏక సంతాన విధానానికి స్వస్తిచెప్పి, పట్టణవాసులు ఇద్దరు పిల్లలను కనవచ్చునని 2016లో ప్రకటించింది. కానీ, దీనివల్ల జనాభా వృద్ధి అయిన దాఖలా లేదు. తాజాగా దేశంలో ప్రతి జంట ముగ్గురు పిల్లలను కనవచ్చునని ప్రకటించింది. ఒంటి కాయ శొంఠి కొమ్ములా పెరిగిన చైనీస్‌ యువతీయువకులు అధిక సంతానానికి ఇష్టపడతారా అంటే సందేహమే. ఫలితంగా చైనా కమ్యూనిస్టు పార్టీ అధిక సంతాన విధానాన్నీ నిర్భంధంగా అమలు చేయవచ్చు. అయితే, ప్రభుత్వాదేశంతో పారిశ్రామికోత్పత్తిని పెంచినట్లు సంతానాన్నీ వృద్ధి చేయడం సాధ్యమా?

- విష్ణుప్రకాశ్‌

(దక్షిణ కొరియాలో భారత మాజీ రాయబారి)
 

Posted Date: 16-06-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం