• facebook
  • whatsapp
  • telegram

అంతరాలతో పెల్లుబికిన అశాంతి

దక్షిణాఫ్రికాలో ఘర్షణలు

నల్లజాతి సూరీడు నెల్సన్‌ మండేలా అస్తమయం తరవాత పెద్దగా వార్తల్లోకి రాని దక్షిణాఫ్రికా ఒక్కసారిగా ప్రపంచం మొత్తాన్ని తనవైపు మళ్ళించుకుంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో ప్రజ్వరిల్లిన హింస వారం రోజులకుపైగా కొనసాగి, పెద్దసంఖ్యలో ప్రాణాల్ని బలిగొంది. ఇందులో భారత సంతతి ప్రజలు ఆస్తులతోపాటు, ప్రాణాలూ కోల్పోయారు. అల్పసంఖ్యాకులైన శ్వేతజాతీయుల పాలన ముగిసి, 1994లో ప్రజాస్వామిక పంథాలోకి మారిన దక్షిణాఫ్రికాలో భారీస్థాయిలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకొన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఉదార, ఆధునిక రాజ్యాంగం ఆధారంగా నిర్మితమైన దేశంగా పేరొందిన దక్షిణాఫ్రికా సైతం- అవినీతి, రాజ్యవైఫల్యం, అరాచకం, ఆశ్రిత శ్రేయస్సు వంటి జాడ్యాలను వీడలేకపోయింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు జాకబ్‌ జుమా విచారణ కమిటీకి పత్రాలు, సాక్ష్యాలు దాఖలు చేసేందుకు నిరాకరించడంతో, కోర్టు ధిక్కరణ కింద జైలుకెళ్లారు. ఆ వెంటనే ఆందోళనలను ప్రేరేపించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెల్లువెత్తడంతో అల్లర్లు చెలరేగాయి. ప్రధాన రహదారులను మూసివేసి, ట్రక్కులను తగలబెట్టారు. పెద్దసంఖ్యలో షాపింగ్‌ మాల్స్‌, దుకాణాలను లూటీ చేశారు. దేశంలోని పలు ప్రాంతాలకు అల్లర్లు విస్తరించాయి. తొక్కిసలాటల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. భారీయెత్తున అరెస్టులు జరిగాయి. అల్లర్లు ప్రణాళికబద్ధంగా జరిగినట్లు అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా స్పష్టం చేశారు. జైలుకెళ్లిన జుమాతో భారత నేపథ్యమున్న వ్యాపారవేత్తలకున్న అనుబంధం, భారత సంతతి ప్రజల్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం... ఈ ఉదంతంలో అనుమాన కోణాల్ని పెంచింది.

నేపథ్యం ఏమిటి?

దక్షిణాఫ్రికా సమాజంలో ఎంతోకాలంగా అంతరాలు, అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా పెరుగుతున్నాయి. దేశంలో 32 శాతానికి పైగా నిరుద్యోగిత ఉండగా, అది 35 ఏళ్ల లోపువారిలో 64 శాతానికి పైగా ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. దేశంలోని సగం జనాభా పేదరికంలోనే మగ్గుతుండగా, 20శాతానికి ఆహార భద్రత లేదు. లాక్‌డౌన్లతో ఉద్యోగాలు పోయాయి. ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయికి చేరింది. వీటితోపాటు కొవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌, ఔషధాల కొరత వంటి ఉదంతాలు ప్రజల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి, అసహనం పెరిగేలా చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘జులు’ వర్గానికి హీరోగా పరిగణించే జుమా అరెస్టు సామాజిక విస్పోటనంగా పని చేసిందంటున్నారు. ఇవన్నీ అల్లర్ల రూపంలో బయటపడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అందుకనే, ఇవి జాతిపరమైన దాడులు కావని స్థానికులు స్పష్టంచేస్తున్నారు. దేశార్థికాన్ని అస్తవ్యస్తం చేసి, అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా విఫలమైనట్లు ముద్ర వేయాలనే రాజకీయ కుట్రలూ కావచ్చనే ఆరోపణలున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో- జాకబ్‌ జుమా అరెస్టుకు, అవినీతి ఆరోపణలకు భారతీయ లంకె ఉండటం విశేషం. భారత సంతతి వ్యాపారవేత్తలైన అతుల్‌ గుప్తా, అజయ్‌ గుప్తా, రాజేశ్‌ గుప్తా సోదరుల పేరు వినిపిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌కు చెందిన గుప్తా సోదరులు 1993లో దక్షిణాఫ్రికా చేరారు. చెప్పుల అమ్మకాలతో మొదలుపెట్టి, కంప్యూటర్ల వ్యాపారంలోకి ప్రవేశించారు. రాజకీయ సంబంధాలు పెంచుకోవడంతో వ్యాపారం ఇంతలంతలైంది. విమానయానం, ఇంధనం, గనులు, టెక్నాలజీ, మీడియా రంగాలకు విస్తరించారు. జుమాతో పెరిగిన పరిచయం మరింత ఉన్నతికి దారితీసింది.

వ్యాపార వర్గాలపై దాడి

జుమా ప్రభుత్వ విధానాలను, నియామకాలను, నిర్ణయాలను గుప్తా సోదరులే నిర్దేశించేవారన్న ఆరోపణలున్నాయి. వీరి సాయంతో జుమాకూడా భారీగా ప్రయోజనం పొందారన్న విమర్శలున్నాయి. దేశాధినేతల రాకపోకలకు ఉద్దేశించిన సైనిక వైమానిక స్థావరాన్ని 2013లో గుప్తా సోదరుల కుటుంబ వేడుకలో వాడుకోవడం గగ్గోలు రేపింది. 2017లో లక్ష ఈ-మెయిళ్ల లీకేజీ వ్యవహారంతో గుప్తా సోదరులు జుమా సర్కారును ప్రభావితం చేసిన తీరు బయటపడటంతో జుమా, గుప్తా సోదరులకు వ్యతిరేకంగా నిరసనలు చెలరేగాయి. జుమా 1999లో ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన ఆయుధాల కొనుగోలు వ్యవహారం, 2009-18 వరకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చోటుచేసుకొన్న అవినీతి కార్యకలాపాలపైనా విచారణ సాగుతోంది. 2018లో విపక్షాలు జుమాకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం తీసుకురావడంతో ఆయన గద్దె దిగారు. దాంతో గుప్తా సోదరులు దుబాయి పారిపోయారు. ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసు సైతం జారీ చేసింది. వారిని తీసుకొచ్చేందుకు దక్షిణాఫ్రికా సర్కారు యూఏఈ ప్రభుత్వంతో నిందితుల మార్పిడి ఒప్పందాన్ని సైతం కుదుర్చుకుంది. 2019 నాటి ప్రపంచబ్యాంకు నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత అసమానతల దేశంగా దక్షిణాఫ్రికా పేరొందింది. ఇది పూర్తిగా భారత సంతతి ప్రజలపై జరిగిన దాడి కాదని, వ్యాపార వర్గాలపై జరిగిన దాడిగా చెబుతున్నారు. పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలకూ పరిష్కారాలు చూపడం ద్వారా దక్షిణాప్రికా సమాజంలో, ప్రజల్లో శాంతియుత పరిస్థితులను నెలకొల్పాలి. అప్పుడే దేశం పురోగతి బాటన సాగుతుంది.

- శ్రీనివాస్‌ దరెగోని
 

Posted Date: 31-07-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం