• facebook
  • whatsapp
  • telegram

అంతర్జాతీయ సంస్థల ప్రతిష్ఠకు తూట్లు

ప్రశ్నార్థకమవుతున్న విశ్వసనీయత

ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకు, డబ్ల్యూహెచ్‌ఓ వంటి అంతర్జాతీయ సంస్థల విశ్వసనీయతపై నానాటికీ అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అంతర్జాతీయ సమాజం ఎదుట బలమైన సందేశాన్ని వినిపించారు. కరోనా సంక్షోభంపై డబ్ల్యూహెచ్‌ఓ, చైనా వ్యవహరించిన తీరును, డ్రాగన్‌ను ప్రసన్నం చేసుకునే విధంగా ప్రపంచ బ్యాంకు అధికారులు సులభతర వాణిజ్య నివేదికను రూపొందించినట్లు బయటకొచ్చిన వార్తలను ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్ళారు. ప్రపంచంపై కరోనా పిడుగు పడి రెండేళ్లు కావస్తున్నా, మహమ్మారి పుట్టుకపై ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదు. అది డ్రాగన్‌ దేశంలోని వుహాన్‌ ల్యాబ్‌ నుంచే బయటకొచ్చిందన్న ఆరోపణలు ఇప్పటికీ బలంగా వినిపిస్తున్నాయి. వుహాన్‌ ప్రయోగశాలకు వెళ్ళి, వాస్తవాలు తెలుసుకుందామనుకున్న అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులకు తొలినాళ్లలో చైనా అనుమతులు ఇవ్వకపోవడంతో- ప్రాణాంతక వైరస్‌ అక్కడి నుంచే పుట్టుకొచ్చిందని, ఆ విషయాన్ని డ్రాగన్‌ తొక్కిపెడుతోందని చర్చలు జోరుగా సాగాయి. డబ్ల్యూహెచ్‌ఓ సారథి టెడ్రోస్‌ అథనోమ్‌ చైనాకు వత్తాసు పలుకుతూ మీడియా ముందు ప్రకటనలు చేయడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్వసనీయతపై మచ్చపడింది.

వ్యవహార శైలిపై సందేహాలు

ఎట్టకేలకు చైనా డబ్ల్యూహెచ్‌ఓ బృందాన్ని వుహాన్‌కు ఆహ్వానించినా, శాస్త్రవేత్తల పర్యటనపై డ్రాగన్‌ ప్రవర్తించిన తీరుతో అనుమానాలు మరింత పెరిగాయి. కరోనా మూలాలపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు జరగకుండా చైనా అడ్డుకుంటోందనే అభిప్రాయాలు వెలువడ్డాయి. ఇందుకోసం ఆరోగ్య సంస్థ అధినేతను పావుగా ఉపయోగించుకుంటోందనే విమర్శలు వెల్లువెత్తాయి. శాస్త్రవేత్తల బృందంతో చైనా అధికారులు ప్రవర్తించిన తీరు చూసి ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయి. వైరాలజిస్టుల వుహాన్‌ పర్యటనపై అంతర్జాతీయ మీడియా అనేక కథనాలు ప్రచురించింది. పర్యటన అనంతరం డబ్ల్యూహెచ్‌ఓ బృందం రూపొందించిన నివేదికపై జపాన్‌కు చెందిన సాంకేయ్‌ షింబున్‌ వార్తాపత్రిక ప్రశ్నల వర్షం కురిపించింది. అసలు శాస్త్రీయంగా దర్యాప్తు జరిగిందా అని నిలదీసింది. వుహాన్‌ ప్రజలను ఇంటర్వ్యూ చేసే స్వేచ్ఛ శాస్త్రవేత్తలకు చైనా ఇవ్వలేదని, అక్కడి ల్యాబ్‌లోని ఎన్నో కీలకమైన ప్రాంతాలకు అసలు డబ్ల్యూహెచ్‌ఓ బృందానికి అనుమతులే లభించలేదని వెల్లడించింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, శాస్త్రవేత్తల బృందం అసలు కరోనా మూలాలపై పరిశోధనలు చేయలేదని తేల్చేసింది. బీజింగ్‌ పెద్దలు చెప్పినట్లు బృందం నివేదిక వెల్లడించిందని విమర్శించింది. శాస్త్రవేత్తల నివేదికను అసంపూర్ణం, నిస్సారమైనదిగా అభివర్ణించింది. అనేక వార్తాపత్రికలూ ఇదే తరహాలో స్పందించడంతో వుహాన్‌ ల్యాబ్‌పై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలనే డిమాండ్‌ సర్వత్రా ఊపందుకొంటోంది. జపాన్‌ వార్తాపత్రిక- అథనోమ్‌పైనా విమర్శల బాణాలు ప్రయోగించింది. కరోనా వైరస్‌ విషయంలో డ్రాగన్‌ దేశానికి క్లీన్‌చిట్‌ ఇచ్చేందుకు ఆయన తహతహలాడారని మండిపడింది. ఆయన ప్రవర్తన కారణంగా డబ్ల్యూహెచ్‌ఓ అంతర్జాతీయ సమాజం విశ్వసనీయతను కోల్పోయిందని ఆరోపించింది. డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచ దేశాల విశ్వాసాన్ని తిరిగి కూడగట్టుకోవాలంటే నిష్పాక్షిక దర్యాప్తు నిర్వహించడం ఒక్కటే మార్గమని స్పష్టం చేసింది. ఇంత జరుగుతున్నా, డబ్ల్యూహెచ్‌ఓ ప్రతిష్ఠను కాపాడేందుకు అథనోమ్‌ కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గడచిన రెండేళ్లలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యకలాపాలపై ఎన్నో అనుమానాలు తలెత్తాయి. ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోదీ- సంస్థలు, దేశాల పేర్లను ప్రస్తావించకుండా చేసిన వ్యాఖ్యల సారాంశం కూడా ఇదే! కొవిడ్‌ మూలాల అన్వేషణలో నెలకొన్న అనుమానాస్పద అంశాలు, సులభతర వాణిజ్య ర్యాంకుల్లో అవకతవకల కారణంగా దశాబ్దాల పాటు నిర్మించుకున్న అంతర్జాతీయ సంస్థల విశ్వసనీయత దెబ్బతిన్నదని పేర్కొన్నారు.

ర్యాంకుల్లో గిమ్మిక్కులు!

సులభతర వాణిజ్య ర్యాంకుల నివేదికలో అవకతవకల కారణంగా ప్రపంచ బ్యాంకు అప్రతిష్ఠ మూటగట్టుకుంది. నివేదికాంశాలు చైనాకు అనుకూలించేలా ఉన్నాయన్న ఆరోపణలతో, దానిపై దర్యాప్తు చేపట్టాల్సి వచ్చింది. దీంతో నివేదికను బ్యాంకు వెనక్కి తీసుకుంది. సంస్థకు ఇది సిగ్గుచేటు అంటూ మీడియా కథనాలు వెలువడ్డాయి. ప్రముఖ ఆర్థికవేత్త ఎస్‌.గురుమూర్తి ఈ వ్యవహారంపై స్పందిస్తూ- ‘ర్యాంకింగ్స్‌లో ఏళ్ల తరబడి అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. వాటిపై దర్యాప్తుల్లేవు. చైనా మోసాలకు కొమ్ము కాయడంతో ప్రపంచ బ్యాంకు బండారం బయటపడింది. ర్యాంకులను ఏ ప్రాతిపదికన ఇస్తారనే అంశాలపై దర్యాప్తు జరగాలి’ అన్నారు. ప్రపంచ బ్యాంకు మద్దతుతో విల్మర్‌హేల్‌ సంస్థ ఈ ర్యాంకుల నివేదిక రూపొందిస్తుందని; చైనా, సౌదీ అరేబియాలను ప్రసన్నం చేసుకునేందుకు బ్యాంకులోని సీనియర్లు ఆయా దేశాలకు అనుగుణంగా సమాచారాన్ని వక్రీకరించారని ఆరోపించారు. 2018-20 మధ్య కాలంలో విడుదలైన నివేదికలను నాటి బ్యాంకు చీఫ్‌ క్రిస్టెలినా జియార్జివా తారుమారు చేసినట్లు వెల్లడించారు. డ్రాగన్‌కు ర్యాంకులు వచ్చేలా అధికారులపై ఆమె ఒత్తిడి తెచ్చారని, అందుకు తగినట్లుగా ర్యాంకులను నిర్ణయించే పద్ధతిని మొత్తానికే మార్చేశారన్నారు. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిస్టెలినా ఇప్పుడు అంతర్జాతీయ ద్రవ్య నిధి మేనేజింగ్‌ డైరెక్టర్‌ పదవిలో ఉండటం గమనార్హం. ఐరాస సాధారణ సభ వేదికగా ప్రధాని మోదీ సూటి మాటలు అందరినీ ఆలోచింపజేశాయి. ఐరాసపై ప్రపంచ దేశాలు నమ్మకం పెట్టుకోవాలంటే... సంస్థ ప్రభావం, విశ్వసనీయత పెరగాలని మోదీ తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా చాణక్యుడి మాటలు గుర్తుచేస్తూ- ‘సరైన సమయంలో సరైన పని చేయకపోతే, విజయావకాశాలను ఆ కాలమే నాశనం చేస్తుంది’ అన్నారు. తప్పుల నుంచి ఐరాస పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం ఇది. అనైతికంగా వ్యవహరించే శక్తులు, వ్యక్తులకు అంతర్జాతీయ సంస్థలు వత్తాసు పలికితే, ఐరాస సమర్థతపై అనుమానాలు పెరుగుతాయన్న విషయాన్ని గ్రహించాలి. ఇకనైనా దిద్దుబాటు చర్యలు చేపట్టి, తమపై పడిన మచ్చను తుడుచుకునే ప్రయత్నం చేయాలి.

చైనా గుప్పిట్లో...

శక్తిమంతమైన దేశాలు అంతర్జాతీయ సంస్థల మెడలు వంచి వాటిని తమకు అనుగుణంగా పని చేయించుకుంటుండటం దురదృష్టకరం. చైనా తన రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం ఆయా సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకుంటోంది. ఈ పరిస్థితులు అత్యంత ఆందోళనకరం. దశాబ్దాలుగా అత్యున్నత సంస్థలుగా గుర్తింపు పొందిన డబ్ల్యూహెచ్‌ఓ, ప్రపంచ బ్యాంకులే ఇలా ఉంటే, ఇక పాశ్చాత్య దేశాల్లోని వీ-డెమ్‌, రిపోర్టర్స్‌ వితౌట్‌ బార్డర్స్‌ వంటి ఇతర సంస్థల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది.


 

Posted Date: 12-10-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం