• facebook
  • whatsapp
  • telegram

కరోనాకు తలవంచని అంకురాలు

సంక్షోభాన్ని అధిగమించే అవిరళ కృషి
 

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నుంచి జూన్‌ వరకు విధించిన లాక్‌డౌన్‌ దుష్పభ్రావం అంతాఇంతా కాదు. చిన్నాపెద్ద వ్యాపారాలు దెబ్బతిని కోట్లమంది జీవనోపాధి కోల్పోయారు. కరోనా దెబ్బ సాంకేతిక రంగంలోని అంకురాలకూ భారీగానే తగిలింది. 40శాతం అంకుర సంస్థలు నష్టాలపాలయ్యాయి. మరో 15శాతం మూతపడ్డాయి. అంతమాత్రాన అంకుర సంస్థలు ధైర్యం కోల్పోలేదు. నవకల్పనలతో చొరవగా దూసుకుపోయే ఔత్సాహికులు ఇటువంటి తుపానులకు వెరవబోమని చాటుకున్నారు. ఇంతటి గడ్డుకాలంలోనూ ఎనిమిది అంకురాలు 100 కోట్ల డాలర్ల విలువైన (యూనికార్న్‌) కంపెనీలుగా ఎదిగి, గట్టివాడే నిలుస్తాడనే డార్విన్‌ సూక్తిని నిజం చేశాయని నీతిఆయోగ్‌ ప్రధాన కార్యనిర్వహణాధికారి అమితాబ్‌ కాంత్‌ వెల్లడించారు. ఈ ఏడాది కొత్తగా యూనికార్న్‌లుగా మారిన అంకురాల్లో నైకా, పోస్ట్‌మ్యాన్, యునకాడెమీ, పైన్‌ల్యాబ్స్, రేజర్‌ పే వంటివి ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 32 యూనికార్న్‌ అంకురాలు ఉండగా 2025కల్లా వాటి సంఖ్య 100కు పెరుగుతుందని ‘ది ఇండ్‌యూఎస్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ (టీఐఈ)’ దిల్లీ-ఎన్‌సీఆర్‌ శాఖ అధ్యక్షుడు రాజన్‌ ఆనందన్‌ అంచనా వేశారు. ఈ శాఖ జినోవ్‌ సంస్థతో కలసి జరిపిన అధ్యయనం, లాక్‌డౌన్‌ తరవాత 75శాతం అంకురాలు కోలుకొంటున్నాయని తేల్చింది. 
 

ఉజ్జ్వల భవిత
నీతి ఆయోగ్‌ గణాంకాల ప్రకారం దేశంలో సాధికార గుర్తింపు పొందిన అంకురాల సంఖ్య 38,756 కాగా, వాటిలో 30శాతం కొవిడ్‌ కాలంలో ఆదాయం పెంచుకోవడానికి కొత్త మార్కెట్లలో ప్రవేశించాయి. కరోనా వల్ల అంకురాలకు పెట్టుబడుల ప్రవాహం తగ్గుతుందనే అంచనాలు తలకిందులవుతున్నాయి. 2019లో భారతీయ అంకురాలకు లభించిన పెట్టుబడులు 2,000 కోట్ల డాలర్లయితే, 2020 మే నెలకే 1,670 కోట్ల డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు నీతి ఆయోగ్‌ తెలిపింది. 2020 సంవత్సరం ముగిసేనాటికి అంకురాలు దాదాపు ఏడున్నర లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు, 26 నుంచి 28 లక్షల వరకు పరోక్ష ఉద్యోగాలను కల్పిస్తాయని టీఐఈ-జినోవ్‌ నివేదిక తెలిపింది. కొవిడ్‌ వల్ల ప్రజలు, వ్యాపారాలు డిజిటల్‌ మార్గంలో వస్తుసేవల క్రయవిక్రయాలకు మళ్లడం అంకురాలకు కొత్త మార్కెట్లను అందిస్తోంది. లాక్‌డౌన్‌ వల్ల విద్య, ఆరోగ్య సంరక్షణ, ఈ కామర్స్‌ రంగాలకు కొత్త ఊపు రాగా, లాక్‌డౌన్‌ అనంతరం ప్రయాణాలు, హోటళ్లు క్రమంగా కోలుకొంటున్నాయి. లాక్‌డౌన్‌లో అమెజాన్, ఫ్లిప్‌ కార్ట్, శ్నాప్‌ డీల్‌ వంటి బడా ఈ-కామ్‌ సంస్థలతో పాటు బిగ్‌ బాస్కెట్, గ్రోఫర్స్‌ కూడా వ్యాపారాన్ని బాగా పెంచుకున్నాయి. పెరిగిన గిరాకీని తీర్చడానికి వేలాది కొత్త సిబ్బందిని నియమించుకొంటున్నాయి.
 

జాతీయ విద్యావిధానం, జాతీయ డిజిటల్‌ ఆరోగ్య పథకం కొత్త అంకురాలకు అంకురార్పణ చేస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఆరోగ్య సంరక్షణ రంగంలో ఎంఫైన్‌ అనే అంకురం కృత్రిమ మేధ సహాయంతో ప్రజలకు 3,500 మంది వైద్యులను సంప్రదించే సౌలభ్యం కల్పిస్తోంది. ఫార్మ్‌ ఈజీ పలు రకాల మందులను సరఫరా చేస్తోంది. మెడ్‌ లైఫ్, 1ఎంజీ సంస్థలు సైతం ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుని ఖాతాదారుల ఇళ్లకు మందులు సరఫరా చేస్తున్నాయి. అపోలో, మెడ్‌ప్లస్‌లూ ఈ రంగంలో దూసుకెళుతున్నాయి. ఈ ఆన్‌లైన్‌ ఫార్మా పంపిణీ సంస్థలన్నింటికీ సొంత యాప్‌లు ఉన్నాయి. నేడు కొవిడ్‌పై పోరుకు 600కు పైగా అంకురాలు బరిలో దిగాయి. అవి కరోనా వ్యాక్సిన్‌ పరిశోధనలో పాల్గొంటున్నాయి. టెస్ట్‌ కిట్ల తయారీ, టెలిమెడిసిన్‌ రంగాల్లో చురుగ్గా పనిచేస్తున్నాయి. విద్యారంగంలో ఇప్పటికే బైజూస్‌ ఏడు కోట్లమంది విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన సౌకర్యం కల్పిస్తూ యూనికార్న్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది యునకాడెమీ సైతం దీని సరసకు చేరగా, క్యాంప్‌ కె 12 అనే అంకురం గ్రామీణ విద్యార్థులకు కోడింగ్‌ పాఠాలు బోధిస్తోంది. ఇంకా వైట్‌హ్యాట్‌ జూనియర్, టాపర్, వేదాంతు ఆన్‌లైన్‌ బోధన సంస్థలు కరోనా కాలంలో తమ వినియోగదారుల సంఖ్యను మూడురెట్లు పెంచుకోగలిగాయి. 
 

ఐఐటీల కీలక పాత్ర
కరోనాకు ముందు నెలకు 10.22 కోట్లమంది విద్యార్థులు ఆన్‌లైన్‌ విద్యాసంస్థల సైట్లను సందర్శిస్తే, ఏప్రిల్‌ నెలలో కేవలం నాలుగు వారాల్లోనే 12.88 కోట్లమంది సందర్శించారు. అంతరిక్ష రంగంలో ఇప్పటికే కొన్ని ప్రైవేటు అంకుర సంస్థలు వికసిస్తున్నాయి. వీటికి ప్రభుత్వ ముసాయిదా అంతరిక్ష విధానం కొత్త ఊతమివ్వనుంది. పిక్సెల్‌ అనే అంకురం పలు ఉపగ్రహాల ద్వారా సేకరించే సమాచారాన్ని కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌ల సాయంతో విశ్లేషించి వ్యవసాయం, వాతావరణం, గనుల రంగాల్లో ఉత్పాదకత పెంచడానికి తోడ్పడుతుంది. బెలాట్రిక్స్‌ ఏరోస్పేస్‌ సొంత ఉపగ్రహ ప్రయోగ సాధనాల తయారీకి నడుం కట్టింది. ఐఐటీల ప్రోత్సాహంతో నెలకొన్న అంకురాలు కరోనాపై పోరులో తమ వంతు సేవలు అందిస్తున్నాయి. టెస్ట్‌ కిట్లు, వెంటిలేటర్లు, శానిటైజర్లు, ఫేస్‌ మాస్కులు, పీపీఈల తయారీలో అవి ముందున్నాయి. ప్రస్తుతం కొవిడ్‌ చికిత్సకు వాడుతున్న మందులకన్నా టైకోప్లానిన్‌ అనే మందు పది రెట్లు ఎక్కువ ప్రభావశీలమైనదని దిల్లీ ఐఐటీ పరిశోధన తేల్చింది. ఈ ఐఐటీ ఇంక్యుబేట్‌ చేసిన రెండు అంకుర సంస్థలు కరోనా వైరస్‌ను నిరోధించే కిట్లను తయారుచేస్తున్నాయి. ఈ పనిలో వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఐఐటీ-మద్రాస్‌ అండదండలతో ఏర్పడిన మాడ్యులస్‌ హౌసింగ్‌ అనే అంకురం ఎక్కడికైనా తీసుకెళ్లగల సంచార మాడ్యులర్‌ ఆస్పత్రి యూనిట్‌ మెడిక్యాబ్‌ను రూపొందించింది. కేవలం రెండు గంటల్లో కూర్పు చేయగల ఈ యూనిట్‌ను కేరళలో ఉపయోగిస్తున్నారు. ఈ ప్రయోగం సఫలమయ్యాక దేశమంతటికీ ఈ సంచార ఆస్పత్రి యూనిట్లను సరఫరా చేస్తారు. మొత్తంమీద కొవిడ్‌ తెచ్చిపెట్టిన ఆర్థిక, ఆరోగ్య సంక్షోభాలను అధిగమించడానికి అంకుర సంస్థలు అవిరళ కృషి జరుపుతున్నాయి. 
 

కార్పొరేట్ల కన్ను... ప్రభుత్వ దన్ను
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంకురాల విస్తరణకు పలు విధానాలను అనుసరిస్తున్నాయి. ఉదాహరణకు టీహబ్, క్యూసిటీలు కొవిడ్‌ నిరోధానికి కొత్త పరిష్కారాలను సూచించాల్సిందిగా విద్యార్థులను కోరుతూ, వారు అంకుర సంస్థల స్థాపకులుగా మారడానికి అనువైన వాతావరణం కల్పిస్తున్నాయి. స్టార్టప్‌ ఇండియా పథకం కింద ఎంపికైన అయిదు ఉత్తమ అంకురాలకు తలా 50,000 డాలర్ల నగదు గ్రాంట్లను ఇస్తానని ఫేస్‌ బుక్‌ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఇటీవల 16 భారతీయ అంకురాలను ఎంపిక చేసుకుని- వాటి అభివృద్ధికి అండదండలిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్, జన్‌ధన్, యూపీఐ, ఇండియా స్టాక్‌లు దేశంలో డిజిటల్‌ చెల్లింపుల అంకురాల స్థాపనకు ఊతమిస్తున్నాయి. 26,000 మంది బ్యాంకింగ్‌ ఏజెంట్ల యంత్రాంగమైన ఎఫ్‌ఐఏ గ్లోబల్‌ కృత్రిమ మేధను ఉపయోగించి 3.4 కోట్లమంది ఖాతాదారులకు నగదు జమ సౌకర్యాలు, గ్రామీణ రుణాలను అందిస్తోంది. ఓకే క్రెడిట్‌ అనే అంకురం 55 లక్షలమంది చిరు వ్యాపారులకు డిజిటల్‌ ఖాతా నిర్వహణ సదుపాయాన్ని అందిస్తోంది.
 

- ఏఏవీ ప్రసాద్‌ 
 

Posted Date: 23-11-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం