• facebook
  • whatsapp
  • telegram

విధానం లేని ‘ఇంటి నుంచి పని’

కొరవడిన మార్గదర్శకాలు
 

ప్రపంచంలో ఎన్నో సంప్రదాయ పద్ధతుల్ని కొవిడ్‌ సమూలంగా మార్చేసింది. కొన్ని ఉద్యోగాల తీరుతెన్నులే మారిపోయాయి. రోజూ కార్యాలయానికి వెళ్లి రావాల్సిన అవసరం లేకుండా- ఇంటి నుంచే పనిచేసే ‘వర్క్‌ ఫ్రం హోం’, ఎక్కడి నుంచైనా పనిచేసే ‘రిమోట్‌ వర్క్‌’ వంటి నూతన పద్ధతులకు ఆదరణ పెరిగింది. కొత్త పద్ధతుల్లో యాజమాన్యాలకు కార్యాలయ నిర్వహణ భారం, రవాణా వ్యయాలు తగ్గి, ఇతరత్రా వెసులుబాట్లూ సమకూరాయి. ఉద్యోగులకు తమ కుటుంబ సభ్యులతో అధిక సమయం గడిపే అవకాశం పెరగడం, ప్రయాణ భారం తగ్గడం వంటి ప్రయోజనాలు సమకూరాయి. ఇలాంటి పద్ధతులు సుదీర్ఘ కాలంపాటు చక్కని వాతావరణంలో పకడ్బందీగా కొనసాగడానికి స్పష్టమైన విధివిధానాలు అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు ఎలాంటి నిబంధనలు, చట్టాలు రూపొందించకపోవడం గమనార్హం.
 

ఎన్నెన్నో ఇబ్బందులు...
ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో 2018 నాటికే 70శాతం ఉద్యోగులు వారానికోరోజు ఇంటివద్దే విధులు నిర్వర్తిస్తుండగా, 53శాతం వారంలో సగం రోజులు ఈ అవకాశం వినియోగించుకుంటున్నారు. మన దేశంలో ఐటీ, ఐటీ ఆధారిత సేవల (ఐటీఈఎస్‌) రంగంలో ప్రస్తుతం 40.36 లక్షల మంది ఉద్యోగులు ఉండగా,  కొవిడ్‌ ప్రభావంతో 85శాతం ఇళ్లకే పరిమితమై విధులు నిర్వర్తించారు. గూగుల్‌, ఫేస్‌బుక్‌, సేల్స్‌ఫోర్స్‌, అడోబ్‌ సంస్థలు తమ ఉద్యోగులకు 2020లో పూర్తిగా ఇంటి నుంచే పని చేసే వెసులుబాటు ఇచ్చాయి. ట్విటర్‌ మరో అడుగు ముందుకేసి శాశ్వతంగా ఇంటి వద్దే విధులు చేపట్టవచ్చని పేర్కొంది. టీసీఎస్‌ 2025 నాటికి తన ఉద్యోగుల్లో 75 శాతాన్ని కార్యాలయానికి రప్పించాల్సిన అవసరం లేకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాబోయే మూడు నుంచి అయిదేళ్లలో ఐటీలో 60శాతం, ఐటీఈఎస్‌లో 40శాతం ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసే అవకాశం ఉందని నాస్కామ్‌ వెల్లడించింది. దశాబ్దం కిందటే మన దేశంలో ఇలాంటి పద్ధతులు అందుబాటులో ఉన్నా, కొవిడ్‌ సంక్షోభం తరవాతే చాలా కంపెనీలు ఆన్‌లైన్‌ పనులబాట పట్టాయి. కార్యాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేకపోవడంతో దిల్లీలో ఉండే ఓ ఉద్యోగికి నెలకు రూ.ఆరు వేలదాకా రుసుముల భారం తగ్గడంతోపాటు, రోజుకు 1.45గంటల సమయం కలిసి వస్తున్నట్లు ఐస్టాక్‌ సంస్థ విశ్లేషించింది. మరోవైపు- ఇంటి నుంచే పని కారణంగా సుదీర్ఘ పని గంటలు, ఒత్తిడి, తక్కువ విరామం, కంప్యూటర్‌ తెరముందు ఎక్కువసేపు గడపాల్సి రావడం వంటి సమస్యలున్నాయి. ఓ ఆన్‌లైన్‌ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం- 55శాతం ఉద్యోగులు సామాజిక ఒంటరితనానికి లోనవుతున్నట్లు తేలింది. కుటుంబ అవసరాల్ని సమన్వయం చేసుకోలేకపోతున్నట్లు 44శాతం, సహోద్యోగులతో ఆన్‌లైన్‌ చర్చల్లో పాల్గొనేందుకు ఇబ్బందిగా ఉందని 40శాతం, అంతర్జాల వేగం అవరోధంగా ఉందని 41శాతం వెల్లడించారు. చాలామంది ఇళ్లలో ప్రత్యేక కార్యస్థలాన్ని సమకూర్చుకోలేకపోతున్నారు. సంస్థలకు 20 నుంచి 25శాతం ఉత్పాదకత పెరిగింది. కరోనా ప్రభావం ఉన్నా ఏప్రిల్‌- సెప్టెంబరు కాలంలో సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు గతంలోకంటే పెరుగుతాయని సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. సంస్థలకు కార్యాలయ నిర్వహణ భారం, విద్యుత్తు, రవాణా భత్యాలు, బ్రాడ్‌బాండ్‌ ఖర్చులు కలిసి వస్తున్నాయి. కార్యాలయాలకు భారీ భవనాల అవసరమూ తప్పుతుంది. చాలా సంస్థలు కరోనాకు ముందున్న కార్యాలయ వైశాల్యాన్ని 50శాతం తగ్గించాయి.  
 

నియంత్రణ వ్యవస్థ అవసరం
కొన్ని సంస్థలు ఉద్యోగులకు కంప్యూటర్లు, సాంకేతిక సాయం అందిస్తున్నాయి. నిర్దిష్ట పనివేళల్లోనే పనిపై ఉండాలని, మధ్యాహ్నం గంటపాటు ఫోన్లు, ఉపకరణాలకు దూరంగా ఉండేలా స్వీయ పరిమితులు విధించుకున్నాయి. అయితే ఇవన్నీ ఆయా సంస్థల దయాదాక్షిణ్యాలపై ఆధారపడినవే. ఇంటి నుంచే పని విషయంలో చట్టపరంగా స్పష్టమైన విధివిధానాలు, మార్గదర్శకాలు రాతపూర్వకంగా లేవు. యాజమాన్య కంపెనీ ఒక రాష్ట్రంలో, పనిచేసే ఉద్యోగి మరో రాష్ట్రంలో ఉంటే జీతభత్యాలు ఏ ప్రాతిపదికన ఇవ్వాలి? ఇంటివద్దే ఉండటం వల్ల ఆర్జిత సెలవు ఇవ్వాలా వద్దా? కార్యాలయానికి వచ్చే పని లేదు కాబట్టి రవాణా భత్యం ఎలా? ఇంట్లో పని చేసేటప్పుడు ఉద్యోగి అన్నీ సొంతంగా సమకూర్చుకోవాల్సిందేనా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అందువల్లే చట్టపరంగా నిర్దిష్టమైన విధివిధానాల అవసరం ఉంది. ఈ సమస్యను కొన్ని దేశాలు 2000లోనే గుర్తించాయి. ఫిలిప్పీన్స్‌, జర్మనీ, అమెరికా వంటి దేశాల్లో కొన్ని చట్టాలు అమలులో ఉన్నాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉద్యోగి విద్యుత్తు వ్యయం, అంతర్జాలం, ఏసీల ఖర్చుల్లో కొంతమేర యాజమాన్య సంస్థ భరించేలా చూస్తోంది. భారత్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న చట్టాలేవీ ఇంటి నుంచే పని, సుదూరంగా పని వంటి విధానాలకు అనుగుణంగా లేవు. ప్రభుత్వాలు కొత్త తరహా పని విధానాలపై స్పష్టమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కార్యాలయంతో ఎంతసేపు అనుసంధానమై ఉండాలి తదితర అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలి. పనివేళలు, జీతభత్యాల విషయంలో సమగ్ర విధివిధానాలు నిర్దేశించాలి. యాజమాన్యాలు, ఉద్యోగులకు వారధిగా ఉంటూ ఇరు వర్గాలను సంతృప్తిపరచేలా ప్రభుత్వం చట్టాలు రూపొందించి అమలు జరిగేలా చూడాలి!
 

- బండపల్లి స్టాలిన్‌
 

Posted Date: 23-11-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం