• facebook
  • whatsapp
  • telegram

‘వెట్టి’ వెతలు తీరేదెప్పుడు?

నేడు అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం
 

‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం... నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అన్న శ్రీశ్రీ మాటలు- బానిసత్వం మానవ సమాజంలో అంతర్భాగం అయిందనడానికి మచ్చు తునకలు. పురాతన కాలంలో యుద్ధంలో చిక్కిన సైనికులను బానిసలుగా మార్చి అమ్మేవారు. ఆఫ్రికాలోని నల్లజాతీయులను ఖండాంతరాలకు తరలించి బానిసత్వపు సంకెళ్లు వేసేవారు. ఇప్పటి బానిసత్వం అలాంటిది కాదు. వివిధ రూపాల్లో కొనసాగుతోంది.
 

‘వాక్‌ ఫ్రీ ఫౌండేషన్‌’ ప్రకారం హింస, బలవంతం, మోసాల ద్వారా వ్యక్తుల స్వేచ్ఛను హరిస్తూ- వారిని నియంత్రణలో ఉంచుకోవడం; లాభార్జన కోసం శ్రమదోపిడికి పాల్పడటం, లైంగిక దోపిడి తదితరాలు ఆధునిక బానిసత్వం కిందకు వస్తాయి. ఇంకా రుణ బానిసత్వం, బలవంతంగా వ్యభిచారంలోకి దించడం, చిన్నారులను సైన్యంలో ఉపయోగించడం, బలవంతపు పెళ్ళిళ్లు చేయడం, మహిళలను పిల్లలను అక్రమంగా రవాణా చేయడం తదితర దురాగతాలకు గురైన వారందరినీ ఈ ఆధునిక బానిసత్వం కింద గుర్తించవచ్చని తెలిపింది. ఈ వ్యవస్థను ఛత్తీస్‌గఢ్‌లో కమియా-మాలిక్‌ అని, కర్ణాటకలో బిల్డి-చక్రి అని, తెలుగు రాష్ట్రాల్లో వెట్టిచాకిరీ అని వ్యవహరిస్తుంటారు. ‘గ్లోబల్‌ స్లేవరీ ఇండెక్స్‌-2013’ సర్వే ప్రపంచంలో మూడు కోట్ల మందికి పైగా ప్రజలు బానిసత్వంలో ఉన్నారని తెలిపింది. భావి తరాలను ఈ వ్యవస్థ నుంచి బయట పడేయటానికి ప్రజల మధ్య అవగాహన పెంపొందించేందుకు ఐక్యరాజ్యసమితి 1949లో జరిగిన ఒడంబడిక ప్రకారం ఏటా డిసెంబర్‌ రెండో తేదీన ‘అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం’గా నిర్వహించాలని నిర్ణయించింది.
 

ప్రపంచం మొత్తమ్మీద 15.20 కోట్ల మంది పిల్లలు వెట్టి చాకిరీలో ఉన్నారని అంచనా. అంటే ప్రతి పదిమందిలో ఒక బాలుడు కార్మికుడిగా జీవనం వెళ్లదీస్తున్నాడు. ‘ఎన్‌ఎస్‌ఎస్‌ఓ 2009-10’ గణాంకాల ప్రకారం భారతదేశంలో 2.30 కోట్ల మంది ఇటుక బట్టీల్లో పనిచేస్తుండగా- వారిలో బాల కార్మికులు కోటిమందికి పైగా ఉన్నారని గుర్తించింది. ఈ నిర్బంధ, బాల కార్మికులు ఎక్కువగా క్వారీలు, అగ్గిపెట్టెల తయారీ, మందుగుండు సామగ్రి తయారీ, పట్టు పరిశ్రమ, గనులు, వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్నట్లు వెల్లడించింది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఇతర ప్రాంతాలనుంచి సమూహాలుగా కూలీలను రప్పించి- వారికి ఒప్పంద పద్ధతిలో తక్కువ కూలి ఇస్తున్నారు. వారికి సరైన భోజన, వసతి సదుపాయాలూ ఉండటంలేదు. రోజుకు 16గంటలకు పైనే పని చేయించుకొంటున్నారు. ఆర్థికంగా, సామాజికంగా అట్టడుగున ఉన్న వర్గాలు ఈ విషవలయంలోకి జారిపోతున్నాయి. దారిద్య్రంతో పాటు, నిరక్షరాస్యత, వ్యసనాలకు బానిసలు కావడం వంటివీ ఇందుకు దోహదం చేస్తున్నాయి. కరోనా విజృంభణతో ఉపాధి కోల్పోయిన పేదలు సైతం బానిసత్వ కోరల్లో చిక్కుకునే అవకాశం లేకపోలేదు. ఈ దుస్థితిని అదుపు చేయడానికి జాతీయ, అంతర్జాతీయ చట్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాల సమన్వయలోపం వల్ల బానిసత్వాన్ని నియంత్రించడం పకడ్బందీగా జరగడం లేదు.
 

‘మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన (యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌)’ ప్రకారం బానిసత్వం చట్ట విరుద్ధం. భారతదేశం అంతర్జాతీయ కార్మిక వ్యవస్థ కన్వెన్షన్‌లో నిర్బంధ శ్రమకు వ్యతిరేకంగా ఓటు వేసినా- అత్యంత గర్హనీయమైన బాలకార్మిక వ్యవస్థకు సంబంధించిన 182వ ప్రకరణకు ఇంకా ఒప్పుకోవాల్సి ఉంది. భారత రాజ్యాంగంలోని 23వ అధికరణ బానిసత్వాన్ని పూర్తిగా నిషేధిస్తూ మనుషుల అక్రమ రవాణాను, నిర్బంధ శ్రమను నేరపరమైన చర్యలుగా పేర్కొంది. వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలన చట్టం-1976, బాలకార్మికుల జాతీయ విధానం-1987, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం-1988, అంతర్రాష్ట్ర వలస విధానం, కనీస వేతన చట్టం, పారిశ్రామిక చట్టాలు ఉన్నప్పటికీ అవినీతి, అధికారుల అలసత్వం, రాజకీయ పలుకుబడితో నిర్బంధ, బాల కార్మిక వ్యవస్థను సక్రమంగా నిరోధించలేకపోతున్నాయి. ఈ లోపాల కారణంగా 1985లో సుప్రీంకోర్టు ఈ చట్టాల అమలును పర్యవేక్షించే బాధ్యతను జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు అప్పగించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
 

బానిస వ్యవస్థను అదుపు చేయడంకోసం కఠిన చట్టాలను అమలు చేయడం తప్పనిసరి. దాంతోపాటు పేదరికం, అసమానతలను దూరం చేస్తూ పౌరులందరికీ సమాన విద్య వైద్య సదుపాయాలు కల్పించాలి. ముఖ్యంగా పౌర హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఎంతైనా ఉంది. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సామాజిక కార్యకర్తలు, సంఘసంస్కర్తలు, స్వచ్ఛంద సేవాసంస్థల ప్రతినిధులు తదితరులు బాధితులకు బాసటగా నిలవాలి. వారికి సహాయ సహకారాలు అందించడం, పునరావాస కేంద్రాల్లో ఆసరా కల్పించడం ద్వారా భావి పౌరులను ఈ అమానవీయ దుస్థితి నుంచి కాపాడాల్సిన అవసరం ఉంది.
 

- డాక్టర్‌ దన్నారపు వెంకట ప్రసాద్‌
 

Posted Date: 18-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం