• facebook
  • whatsapp
  • telegram

ముందస్తు ఏర్పాట్లలో మనమెక్కడ?

కొవిడ్‌ వ్యాక్సిన్లపై సన్నద్ధత
 

కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్‌పైనే ఆశలు పెట్టుకున్నాయి. మన దేశంలో నిర్వహిస్తున్న వ్యాక్సిన్ల క్లినికల్‌ ట్రయల్స్‌పై ఉత్కంఠ నెలకొంది. ప్రధాని మోదీ స్వయంగా వ్యాక్సిన్‌ తయారీ సంస్థలను సందర్శించి, సంబంధిత బృందాలతో చర్చలు జరపడం ఆసక్తిరేపింది. టీకాల రాక చేరువవుతుండటంతో వాటిని అందిపుచ్చుకొనే యత్నాలూ ముమ్మరమవుతున్నాయి. కోట్లమందికి టీకా ఇవ్వాలంటే- ముందస్తు ప్రణాళిక, కసరత్తు, పకడ్బందీ కార్యాచరణ అవసరమవుతాయి. భారీ స్థాయిలో నిధులూ అవసరమే. టీకా వస్తే తొలి ఏడాదిలోనే కొన్ని వేల కోట్ల రూపాయలదాకా వ్యయం చేయాల్సి ఉంటుందని అంచనా. ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితిలో భారీ స్థాయి నిధుల సమీకరణ కష్టమే. పీఎంకేర్స్‌ నిధి, కొవిడ్‌ సెస్‌ వంటి మార్గాల్లో నిధులు సమకూర్చుకోవాలనే సూచనలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. ఇందులో సగం భారాన్ని రాష్ట్రాలపై వేసి, నిధులు సేకరించుకోవాలని సూచించే అవకాశాలూ లేకపోలేదంటున్నారు. ప్రభుత్వ పరంగా టీకా ఉచితంగా వేసినా, డబ్బులు చెల్లించగల వారికోసం ప్రైవేటు ఆస్పతులను అనుమతించే వీలుంది. కరోనా టీకా వేయించుకునేందుకు 80 శాతం భారతీయులు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు బ్రిటన్‌కు చెందిన ‘యూగవ్‌’ సంస్థ సర్వేలో తేలింది. అధికాదాయ, మధ్యాదాయ దేశాలు కొన్ని ఇప్పటికే 880 కోట్ల మోతాదులను ముందస్తు ఆర్డర్లతో రిజర్వు చేసుకున్నాయి. కొన్ని సంపన్న దేశాలతే తమ జనాభా అవసరాలకు మించి బుకింగ్‌ చేసుకున్నాయి. కెనడా తన జనాభాకు అయిదురెట్లు అధికంగా రిజర్వు చేసుకుంది. కొనుగోళ్ల కోసం కంపెనీలతో భారత్‌ చేసుకున్న లావాదేవీల వివరాలు అధికారికంగా వెల్లడి కాకున్నా, 30 కోట్లమందికి సరిపడేలా సుమారు 60 కోట్లదాకా మోతాదులు సమీకరిస్తున్నట్లు అమెరికాకు చెందిన డ్యూక్‌ యూనివర్సిటీ హెల్త్‌ ఇన్నొవేషన్‌ సెంటర్‌ పేర్కొంది.
 

కసరత్తు ఇలా...
టీకా కార్యక్రమం కోసం ఏర్పాటైన జాతీయ నిపుణుల కమిటీ పంపిణీకి ఏర్పాట్లు చేసేందుకు పలు ఉపకమిటీలను నియమించింది. ప్రస్తుతం సార్వత్రిక టీకా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న డిజిటల్‌ వేదిక తరహాలోనే కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌(కొవిన్‌)ను ఉపయోగించనున్నారు. దీనిద్వారా శీతల కేంద్రాల్లో నిల్వ, పంపిణీ, వితరణ, ఉష్ణోగ్రతలు, ఇతరత్రా సమాచారం వంటి అన్ని అంశాలనూ పర్యవేక్షిస్తారు. ఆధార్‌ కార్డు వివరాల్నీ నమోదు చేసే దిశగా యోచిస్తున్నారు. భారీస్థాయిలో సుశిక్షిత మానవ వనరులు అవసరం కావడంతో టీకాలు ఇచ్చేవారికి శిక్షణ ఇచ్చేందుకు ఆన్‌లైన్‌లో ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. టీకాల సరఫరా గొలుసు, రవాణా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఏర్పాటైన ప్రభుత్వ ఉపసంఘం- గిరాకీ, ఉత్పత్తి, అదనపు సామర్థ్యం తదితర వివరాలతో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఎవరెవరికి ప్రాధాన్య క్రమంలో టీకాలు వేయాలనే జాబితాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ఆరోగ్య శాఖ ఇంతకుముందే అడిగింది. తొలివిడతలో దేశవ్యాప్తంగా ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బంది, యాభైఏళ్ల పైబడినవారు, తదితరులు ఉన్నట్లు కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గౌబా ఇటీవల వివరించారు.
 

అవసరాలేమిటి?
గిడ్డంగులు, శీతల గొలుసు వ్యవస్థ, సరఫరా, వాడేసిన సిరంజీలను వెనక్కి తీసుకురావడం, మానవ వనరులను సమకూర్చుకోవడం, వారికి శిక్షణ, జనబాహుళ్యంలో అవగాహన పెంచే కార్యక్రమాలు వంటివన్నీ భారీస్థాయిలో చేపట్టాల్సి ఉంది. భారత్‌కు భారీస్థాయిలో ప్రజారోగ్య టీకా పంపిణీ కార్యక్రమాల్ని చేపట్టిన అనుభవం, రికార్డు ఉంది. ఏటా 40 కోట్ల టీకాల్ని వేయగల సామర్థ్యం ఉంది. ఇప్పటికే టీకా కార్యక్రమం కోసం దేశంలో పెద్ద సంఖ్యలో శీతలనిల్వ కేంద్రాలున్నా, ఇంకా అవసరమని చెబుతున్నారు. అవసరమైతే, వేగంగా సామర్థ్యాన్ని సముపార్జించుకోవాల్సి ఉంది. ప్రభుత్వం ప్రైవేటు శీతల గొలుసు రవాణా నిర్వాహకుల సేవల్ని ఉపయోగించుకునే దిశగా యోచిస్తోంది. ప్రస్తుతం డాక్టర్లు, నర్సులకే సిరంజీలపై నైపుణ్యం ఉంది. కోట్లమందికి టీకా వేయాలంటే వీరు మాత్రమే సరిపోరు. ప్రపంచవ్యాప్తంగా ఫార్మసిస్టులకు టీకాలు వేసేందుకు అనుమతి ఉంది. మనదేశంలోనూ ఈ దిశగా ఆలోచించాలి. ఇంటింటికి వెళ్ళి టీకా వేయడం సిబ్బందికి తలకుమించిన భారమే. అందుకని ఆరోగ్య కేంద్రాలతో పాటు, అంగన్‌వాడీలు, బడులు, పంచాయతీరాజ్‌ భవనాలు, స్టేడియాల్లో శిబిరాలు ఏర్పాటుచేయవచ్చు. దేశంలోని 30 వేల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరిగ్గా పనిచేయనివే ఎక్కువ. సత్వరమే వీటిని పునరుద్ధరించాల్సి ఉంది. కొవిడ్‌ టీకా అందుబాటులోకి వస్తే వచ్చే ఏడాది జులై నాటికి 40 నుంచి 50 కోట్ల మోతాదుల ద్వారా 25 కోట్ల మందికి వేయవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ భావిస్తోంది. ఈ లెక్కన వ్యాక్సిన్‌ను నింపేందుకు తొలి ఆరు నెలల్లోనే దేశానికి సుమారు ఆరు కోట్లకు పైగా గాజు వైల్స్‌ అవసరమవుతాయి. తరవాత ఆరు నెలల్లో అంతకన్నా ఎక్కువగానే వైల్స్‌ అవసరం కావచ్చు. ప్రతి వ్యక్తికీ రెండు డోసులు ఇవ్వాలంటే 50 కోట్ల సిరంజీలతో కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి వస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద సిరంజీ ఉత్పత్తిదారుల్లో భారత్‌ ఒకటి కావడం, ఏటా వందకోట్లకుపైగా సిరంజీల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండటం ఆశావహ పరిణామాలు ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని 2021 మధ్యనాటికి 140 కోట్లకు పెంచనున్నట్లు ఉత్పత్తిదారులు చెబుతున్నారు.
 

జాగ్రత్తగా అడుగులెయ్యాలి
వ్యాక్సిన్‌ ఉత్పత్తి, పంపిణీకి సాధనసంపత్తిని సమకూర్చుకోవడం ఒక ఎత్తయితే- నిల్వ, రవాణా, టీకా వేయడం అసలైన సవాలు. మనదేశంలో ప్రస్తుతమున్న సంప్రదాయ శీతల రవాణా వ్యవస్థల్ని ఆధునికీకరించుకోవాల్సి ఉంది. వ్యాక్సిన్‌కు సంబంధించి పూర్తిగా సమాచారం తెలియని స్థితిలో- ముందస్తుగా ప్రణాళికలు రూపొందించడం కూడా కొంత క్లిష్టతరమైందే. అందుకే, ప్రభుత్వం చాలా జాగ్రత్తగా అడుగులెయ్యాలని, భిన్న రకాల ప్రణాళికలతో సంసిద్ధమై ఉండటం శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు. అంతర్జాతీయంగా తయారయ్యే వ్యాక్సిన్ల విషయంలో ధర, సరకు సరఫరా కోసం భారత్‌ గట్టిగా బేరమాడాల్సి ఉంటుంది. టీకాలు సిరంజీలు, వైల్స్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని దేశీయ అవసరాలకు తగిన రీతిలో ఉండేలా చూసుకోవడమే కాకుండా, మానవ వనరులను సంసిద్ధం చేసేందుకు టీకా అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రభుత్వం అనునిత్యం గమనిస్తోంది. టీకా పంపిణీ కోసం చేపట్టే శిక్షణ కార్యక్రమాల్లో వైద్య, నర్సింగ్‌ విద్యార్థులు, బోధన సిబ్బందినీ భాగస్వాములుగా చేయాలి. ఇదంతా ఒక ఎత్తయితే- టీకాలు చవకగా, తేలికగా నిల్వ, రవాణా చేసే పరిస్థితులు ఏర్పడే వరకు భారత్‌ వేచి ఉండటం మంచిదంటూ కొంతమంది నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
 

- శ్రీజన్‌
 

Posted Date: 18-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం