• facebook
  • whatsapp
  • telegram

శృంఖలాల్లో మహిళా సంఘం

మూడు దశాబ్దాల ఎన్‌సీడబ్ల్యూ చట్టం
 

స్వాతంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్న భారతీయ మహిళలు సహజంగానే ఈ దేశ రాజకీయ స్రవంతిలో మొదటి నుంచీ అంతర్భాగంగా ఉన్నారు. చాలా దేశాల్లో మహిళలు సుదీర్ఘ ఉద్యమాలు నడిపి కానీ ఓటు హక్కు సాధించుకోలేకపోయారు. భారతదేశంలో తొలి ఎన్నికల నుంచే మహిళలు ఓటుహక్కు వినియోగించుకొంటున్నారు. అలాగని భారతీయ మహిళ స్థితిగతులు దివ్యంగా ఉన్నాయని చెప్పలేం. వారి ఎదుగుదలకు అన్ని రంగాల్లో అడ్డంకులు ఎదురవుతున్నాయి. పని, వేతనాలు మొదలుకొని వారసత్వ హక్కుల వరకు అంతటా దుర్విచక్షణను ఎదుర్కొంటున్నారు. దీన్ని సరిదిద్ది మహిళలకు సాధికారత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం 1990లోనే జాతీయ మహిళా సంఘం (ఎన్‌సీడబ్ల్యూ) చట్టాన్ని తీసుకొచ్చినా 1992 జనవరి 31న కమిషన్‌ను చట్టబద్ధ సంస్థగా నెలకొల్పింది. రాజ్యాంగం, వివిధ చట్టాలు మహిళలకు కల్పించిన హక్కులను సంరక్షించడం, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి పరిష్కారాలు ప్రతిపాదించడం ఈ సంస్థ బాధ్యతలు. మహిళల స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షించి, తదుపరి కార్యాచరణను సిఫార్సు చేయడం, మహిళా హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు న్యాయం కోసం పోరాడటమూ సంస్థ కార్యకలాపాల్లో భాగమే. అధ్యక్షులు, కార్యదర్శి, అయిదుగురు సభ్యులతో ఎన్‌సీడబ్ల్యూ ఏర్పడింది.
 

పిలిచి విచారించే అధికారం...
ఒక దావాను విచారించే సివిల్‌ కోర్టుకు ఉండే అధికారాలన్నీ ఎన్‌సీడబ్ల్యూకు ఉంటాయి. దేశంలో ఏ రంగంలోని వ్యక్తినైనా పిలిచి విచారించడం, సంబంధిత పత్రాలను సమర్పించాల్సిందిగా ఆదేశించడం, అఫిడవిట్ల రూపంలో వాంగ్మూలాలు సేకరించడం, ఏ కోర్టు లేక ఏ ప్రభుత్వ కార్యాలయం నుంచైనా సాధికార రికార్డులను కోరడం, సాక్షులను రప్పించి విచారించడం వంటి అధికారాలు ఎన్‌సీడబ్ల్యూకు ఉన్నాయి. అంతేకాకుండా, మహిళలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు లేక విధానాలను రూపొందించే ముందు కేంద్ర ప్రభుత్వం ఎన్‌సీడబ్ల్యూని సంప్రదించాల్సి ఉంటుంది. ఇన్ని అధికారాలున్న ఎన్‌సీడబ్ల్యూ గడచిన మూడు దశాబ్దాల్లో మహిళాజనోద్ధరణలో అనితర సాధ్యమైన విజయాలను నమోదు చేసి ఉండాల్సింది. మహిళల స్థితిగతులు ఈపాటికి అద్భుతంగా మెరుగుపడి ఉండాలి. కానీ, వాస్తవంలో అలా జరిగిన దాఖలా లేదు. స్త్రీలపై మానభంగాలు పెచ్చరిల్లాయి. ఎన్నోచోట్ల మహిళలు వేధింపులకు గురవుతున్నారు. పిల్లలు, ముఖ్యంగా మగ పిల్లలను కనలేని వనితల స్థితి దుర్భరంగా ఉంటోంది. ఆస్తిలో వాటా కోరే మహిళలను అణగదొక్కడం సర్వసాధారణమైపోయింది. అభివృద్ధి సూచికల్లో మహిళలు అట్టడుగున ఉన్నారు. భారత్‌లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 943 మంది స్త్రీలే ఉన్నారని 2011 జనగణన తేల్చింది. సాటి ఆసియా దేశాల్లోనూ ఇంతటి అధ్వాన లింగనిష్పత్తి లేదు. 2014-15లో ప్రాథమిక తరగతుల్లో ప్రతి 100 మంది బాలురకు 93 మంది బాలికలే ఉన్నారు. మాధ్యమిక తరగతుల్లో 95 మంది, సెకండరీ తరగతుల్లో 91 మంది, సీనియర్‌ సెకండరీ తరగతుల్లో 90 మంది బాలికలే ఉన్నారు. 2011లో అఖిల భారత స్థాయిలో కార్మిక భాగస్వామ్య రేటు పురుషులకు 53.26 శాతమైతే, స్త్రీలకు కేవలం 25.51శాతం. భారతీయ పురుషులకన్నా స్త్రీలు 19శాతం తక్కువ సంపాదిస్తున్నారు. పురుషుడు సగటున రోజుకు రూ.242.49 సంపాదిస్తుంటే, స్త్రీ సంపాదన కేవలం రూ.196.30 మాత్రమే. 2014 సార్వత్రిక ఎన్నికల తరవాత లోక్‌సభ సభ్యుల్లో మహిళలు 12శాతం (64మంది) మాత్రమే. 75 మంది సభ్యుల కేంద్ర మంత్రిమండలిలో మహిళలు (12 శాతం) తొమ్మిది మందే. ఈ పరిస్థితిని మార్చడం ఒక్క ఎన్‌సీడబ్ల్యూతోనే సాధ్యపడుతుందని భావించలేం. ఈ సంఘానికి అప్పగించిన బృహత్తర విధులు నెరవేరాలంటే ఎన్‌సీడబ్ల్యూ నిర్మాణం, పనివిధానాల్లో లొసుగులను తొలగించడానికి కీలకమైన మార్పులు తీసుకురావలసి ఉంటుంది. జాతీయ మహిళా సంఘం తన సభ్యులను తానే నియమించుకునే పద్ధతి రావాలి. ప్రస్తుతం ఎన్‌సీడబ్ల్యూ సభ్యులను ప్రభుత్వమే నియమిస్తోంది. అవసరమనుకుంటే వారిని తప్పించే అధికారమూ సర్కారుకు ఉంది. పైగా ఈ సంఘం ప్రభుత్వమిచ్చే నిధులపైనే పూర్తిగా ఆధారపడి పనిచేస్తోంది. మహిళల కోసం చట్టాలు ప్రతిపాదించే అధికారం ఎన్‌సీడబ్ల్యూకి లేదు. ఈ మేరకు సిఫార్సులే చేయగలదు. వాటిని ప్రభుత్వం ఆమోదించాలనే నియమమేమీ లేదు. ఒక్కమాటలో ఎన్‌సీడబ్ల్యూకి కార్యనిర్వహణ స్వేచ్ఛ లేదు.
 

సమానత్వ సాధనకు చట్టాలు తీసుకురావాలి
మొదట లింగ నిష్పత్తిని మెరుగుపరచడానికి తక్షణం నడుంకట్టాలి. బాలికల విద్య, మహిళల ఆరోగ్యం, పోషకాహారం, ఆయుర్దాయం పెంపు, వివిధ ప్రభుత్వ సేవల వినియోగ సౌలభ్యం పెరగాలి. ఉపాధిలో వారి వాటా పెంచాలి, పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలి. మహిళల ఆర్థిక హోదాను ఇనుమడింపజేయాలి. మహిళలకు నిజమైన సమానత్వాన్ని సాధించడానికి తగు విధానాలు, చట్టాలు తీసుకురావాలి. ఇప్పటికే ఉన్నవాటిని సమీక్షించి పదును పెట్టాలి. ఈ లక్ష్యాల సాధనకు అవగాహనను పెంచాలి. లింగ సమానత్వ సాధనకు ఉద్దేశించిన విధాన చర్చల్లో ఎన్‌సీడబ్ల్యూ చురుగ్గా పాల్గొనాలి. పార్లమెంటులో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహిళలకు సమాన వేతనాలు సాధించడం, కంపెనీల్లో, ప్రభుత్వ విభాగాల్లో స్త్రీలు అత్యున్నత స్థానాలను అందుకునే వాతావరణాన్ని సృష్టించడం, విద్యాసంస్థల్లో బాలికలకు మరుగుదొడ్డి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవడం, మహిళలపై నేరాలు జరిగిన కేసుల్లో పోలీసులు సక్రమంగా స్పందించేట్లు చూడటం వంటివి సాధించడానికి ఎన్‌సీడబ్ల్యూ చురుగ్గా కదలాలి. మహిళలకు జరిగే అన్యాయాలపై సమాచార సాధనాల్లో వచ్చే కథనాలను చూసి స్పందించే స్థాయి నుంచి, స్వయంగా జోక్యం చేసుకొని తక్షణ చర్యలు తీసుకునే స్థాయికి ఎదగాలి. ఈ లక్ష్యాల సాధనకు ప్రస్తుత చట్టాలు మరింత సమర్థంగా అమలయ్యేలా చూడటంతోపాటు కొత్త చట్టాల కోసం పట్టుబట్టాలి. ఒక్కమాటలో ఎన్‌సీడబ్ల్యూకు మరింత స్వాతంత్య్రం, మరింత స్పష్టమైన లక్ష్యాలు ఉండాలి. అవి లేనంతకాలం సంఘం నుంచి జవాబుదారీతనాన్ని ఆశించలేం! 
 

కూర్పులో మార్పు రావాలి
ఎన్‌సీడబ్ల్యూ సభ్యుల ప్రవర్తన సైతం తరచూ విమర్శలకు లోనవుతోంది. బెంగళూరులోని ఒక పబ్‌లో వనితల మీద దాడి జరిగినప్పుడు ఎన్‌సీడబ్ల్యూ సభ్యులు ఒకరు మహిళలు తమను తాము కాపాడుకోవలసిందని వ్యాఖ్యానించారు. గువాహటిలో మరో పబ్‌ వెలుపల ఇలాంటి ఘటనే జరిగినప్పుడు మహిళలు సరైన దుస్తులు వేసుకోవాలని మరో సభ్యులు సలహా ఇచ్చారు. లవ్‌ జిహాద్‌ విషయంలో ఎన్‌సీడబ్ల్యూ సభ్యుల వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు లోనయ్యాయి. మహిళా సమస్యలు, హక్కుల విషయంలో ఎన్‌సీడబ్ల్యూ సభ్యులకు సరైన అవగాహన లేదని, అన్యాయం జరిగినప్పుడు స్త్రీలనే తప్పుపట్టే వైఖరి వారిలో పాతుకుపోయిందనే విమర్శలు వచ్చాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే మొదట ఎన్‌సీడబ్ల్యూ కూర్పులో తగు మార్పులు తీసుకురావాలి. ఈ సంఘానికి నేరస్తులను శిక్షించే అధికారమివ్వాలి. మహిళా సంక్షేమానికి మధ్యకాలికంగా, దీర్ఘకాలికంగా తీసుకోవలసిన చర్యలపై స్పష్టమైన అవగాహన ఉండాలి.
 

- మీనా రఘునాథన్‌
(సామాజిక అభివృద్ధి వ్యవహారాల నిపుణురాలు)

 

Posted Date: 18-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం