• facebook
  • whatsapp
  • telegram

విద్యుత్తు నిల్వే కీలకం

పునరుత్పాదక ఇంధనం దిశగా అడుగులు
 

దేశంలో నానాటికీ పెరుగుతున్న విద్యుత్తు అవసరాలకు తగ్గట్లు ఉత్పత్తినీ పెంచుతూ పోతున్నాం. అయితే నేటికీ మొత్తం ఉత్పత్తిలో కేవలం 18శాతమే- పునరుద్ధరించగల ఇంధన వనరుల నుంచి సమకూరుతోంది. సంప్రదాయ ఇంధనాలైన బొగు,్గ సహజ వాయువులను మండించి విద్యుత్తు ఉత్పత్తి చేయడంవల్ల విపరీతమైన వాతావరణ కాలుష్యం ఏర్పడటమే కాకుండా, వనరులు అంతరించి పోతున్నాయన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరూ గుర్తించిన సత్యం. పారిస్‌లో జరిగిన జీవవైవిధ్య సదస్సులో భారతదేశం 2030 సంవత్సరానికల్లా పునరుద్ధరణ ఇంధన వనరుల ఉత్పత్తిని 40శాతానికి పెంచుకుంటానని వాగ్దానం చేసింది. ఇందుకోసం 2022కల్లా లక్షా 75 వేల మెగావాట్లు, 2030 సంవత్సరానికి నాలుగు లక్షల 50 వేల మెగావాట్లు లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తోంది. గత అయిదేళ్ల కాలంలో సౌర, పవన విద్యుదుత్పత్తి రెండింతలు కావడం హర్షించదగ్గ పరిణామం. సౌర, పవన విద్యుదుత్పత్తి నిలకడగా లేక వాతావరణ పరిస్థితులు మారడంతో గ్రిడ్‌ నిర్వహణ కష్టతరమైంది. ‘జాతీయ పునరుత్పాదక ఇంధన ప్రయోగశాల(ఎన్‌ఆర్‌ఈఎల్‌)’ సాంకేతిక అధ్యయనాల ప్రకారం- సౌర విద్యుత్తు సరఫరా పెరిగేకొద్దీ గ్రిడ్‌ నిర్వహణ కష్టతరమవుతుంది. కేంద్ర విద్యుత్తు ప్రాధికారసంస్థ అంచనాల ప్రకారం 2030 సంవత్సరానికల్లా పునరుద్ధరణ విద్యుదుత్పత్తి 44శాతానికి చేరబోతున్నట్లు అంచనా వేసింది. అప్పుడు గ్రిడ్‌ నిర్వహణ తీవ్రమైన సవాళ్లు రువ్వుతుందనడంలో సందేహం లేదు.
 

పరిష్కారాలివే...
సౌర విద్యుత్తు కేవలం పగటిపూట మాత్రమే అందుబాటులో ఉండగా, పవన విద్యుత్తు గరిష్ఠంగా రాత్రిపూట ఉత్పత్తి అవుతుంది. కాబట్టి పవన, సౌర సమ్మిళిత కేంద్రాలు స్థాపించినట్లయితే కొంతమేరకు ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈ తరహా మిశ్రమ కేంద్రాలు ఒకేచోట ఏర్పాటు చేయడం వల్ల భూమి కొరత తగ్గడమేకాక, స్థాపిత ఖర్చు ఏడు నుంచి పది శాతం తగ్గుతుంది. నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ (ఎమ్‌ఎన్‌ఆర్‌ఈ) 2018 సంవత్సరంలో ప్రోత్సాహకాలతో పవన, సౌర విద్యుత్తు కేంద్రాల విధానాన్ని ప్రకటించింది. రాబోయే మూడు సంవత్సరాల్లో 11,600 మెగావాట్ల కేంద్రాలు భారత సముద్ర తీరప్రాంతాల్లో ఏర్పాటు కాబోతున్నాయి. ఇప్పటికే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక మహారాష్ట్ర, రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాలు పవన, సౌర విద్యుత్తు మిశ్రమ కేంద్రాల స్థాపనకు ప్రణాళిక రచించుకొని ముందుకు సాగుతున్నాయి.
 

బ్యాటరీల్లో విద్యుత్తును నిల్వ చేసే విధానం అత్యంత ప్రాచుర్యం పొందింది. అయిదేళ్లుగా బ్యాటరీల ఖరీదు సుమారు 80 శాతం తగ్గింది. భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం ఉండటంతో అందరి దృష్టీ ఇప్పుడు విద్యుత్తును బ్యాటరీల్లో నిల్వ చేయడంపై పడింది. ఇప్పటివరకు ప్రపంచంలో ఆస్ట్రేలియాలో 100 మెగావాట్ల బ్యాటరీనిల్వ కేంద్రమే అత్యంత పెద్దది; మన దేశ రాజధాని దిల్లీలో 2019లో మొట్టమొదటి 10 మెగావాట్ల బ్యాటరీ నిల్వ కేంద్రం స్థాపించారు. ‘ఇంధన ఆర్థిక విశ్లేషణ సంస్థ(ఐఈఈఎఫ్‌ఏ)’ తాజా అధ్యయనం ప్రకారం పవన సౌర విద్యుత్తు మిశ్రమ కేంద్రాల విద్యుత్తు ధర యూనిట్‌కు రెండు రూపాయల 67పైసలు ఉండగా, కేవలం రెండు గంటల బ్యాటరీ నిల్వతో అది 4.59 రూపాయలకు పెరుగుతుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు నిల్వ విధానం అంత లాభసాటి కాదు. కేంద్ర ప్రభుత్వం 2019 సంవత్సరంలో ‘ట్రాన్స్‌ఫర్‌మేటివ్‌ మొబిలిటీ, బ్యాటరీ స్టోరేజ్‌పై జాతీయ కార్యక్రమం’ పేరిట ప్రోత్సాహక విధానాన్ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 160 మెగావాట్ల పవన, సౌర విద్యుత్తు మిశ్రమ కేంద్రాన్ని 40 మెగావాట్ల నిల్వతో ఏర్పాటు చేసే ప్రణాళికను సిద్ధం చేసింది. తగ్గుతున్న బ్యాటరీ ధరలతో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న విద్యుత్తు వాహనాలవల్ల- 2030 సంవత్సరానికల్లా విద్యుదుత్పత్తి కేంద్రాల సామర్థ్యంలో 50శాతం బ్యాటరీలో నిల్వ చేయగల అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 

ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం
విద్యుత్తును పరోక్షంగా నిల్వ చేయడంలో అనేక పద్ధతులున్నాయి. విద్యుత్తు అవసరాన్ని బట్టి ఒక్కోసారి ఒకే రోజులో యూనిట్‌ ఖరీదు రెండు రూపాయల నుంచి 12 రూపాయల వరకు ఉంటుంది. చౌకగా ఉన్నప్పుడు పరోక్షంగా నిల్వచేసుకొని, అధికంగా ఉన్నప్పుడు విద్యుత్తు ఉత్పత్తి చేస్తే లాభదాయకం అవుతుంది. వీటిలో జల విద్యుత్తు ప్రాజెక్టులు ముఖ్యమైనవి. విద్యుత్తు చౌక ధరకు లభిస్తున్నప్పుడు, రివర్స్‌ పంపింగ్‌ విధానం ద్వారా, నీటిని తోడి- మళ్లీ జలాశయంలోకి ఎత్తిపోసి, అత్యధిక డిమాండ్‌ ఉన్న సమయంలో ఉత్పత్తి చేస్తారు. తెలంగాణలో నాగార్జునసాగర్‌, శ్రీశైలం ఎడమ గట్టు ప్రాజెక్టుల్లో ఈ తరహా విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆరువేల మూడువందల మెగావాట్లకు సరిపడా ఏడు రివర్స్‌ పంపింగ్‌ కేంద్రాలను స్థాపించడానికి సన్నాహాలు చేస్తోంది. మరో 12,860 మెగావాట్ల మిశ్రమ విద్యుత్తు కేంద్రాల స్థాపనకు ప్రణాళిక రూపొందించగా, అందులో 4,290 మెగావాట్లకు ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారు. విద్యుత్తు చట్టం2003లో నిల్వ, సరఫరా గురించి వివరణ లేదు. కాబట్టి మారిన పరిస్థితుల్లో, కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన విద్యుత్తు సవరణల్లో దీన్ని కూడా చేర్చి ఒక విధానం రూపొందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు మరింత ప్రోత్సాహమిస్తే పునరుద్ధరణ ఇంధన వనరులతో విద్యుత్తు ఉత్పత్తి, నిల్వ కేంద్రాలు పెరిగి- కాలుష్య కారక థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలను తగ్గించుకోవచ్చు.
 

- ఇనుగుర్తి శ్రీనివాసాచారి
 

Posted Date: 18-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం