• facebook
  • whatsapp
  • telegram

డిజిటల్‌ మందగమనం

ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎమ్‌సీ) వేదికపై ప్రధాని మోదీ మాటల్లో ‘డిజిటల్‌ భారత్‌’ మహాస్వప్నం సరికొత్తగా ఆవిష్కృతమైంది. ఆయన చెప్పినట్లు- కోట్లాది ప్రజానీకాన్ని సాధికారత వైపు నడిపించడానికి, భవిష్యత్తులో సాంకేతికంగా అందరికంటే మనం ఒక అడుగు ముందుండటానికి... దేశంలో అయిదోతరం (5జీ) నెట్‌వర్క్‌ సేవలు చురుగ్గా సాకారం కావాలి. దేశీయ స్థితిగతులు అందుకు తగ్గట్లు ఉన్నాయా? ప్రస్తుత అంతర్జాల వినియోగదారుల్లో యాభైశాతం గత నాలుగేళ్లలో చేరినవారేనని, ఆ జాబితాలో సగంమంది గ్రామీణులేనన్న గణాంకాలు- ఇంటర్‌నెట్‌ విస్తృతి వేగాన్ని కళ్లకు కడుతున్న మాట వాస్తవం. రాబోయే మూడేళ్లలో దేశంలోని అన్ని గ్రామాలకు ఫైబర్‌ ఆప్టిక్‌ అనుసంధానత చేకూరేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు ప్రధానమంత్రి చెబుతున్నారు. వాస్తవానికి, 2022నాటికి అందరికీ బ్రాడ్‌బ్యాండ్‌ సదుపాయాల్ని కల్పించడమే లక్ష్యమన్న నినాదం కొన్నేళ్లుగా మార్మోగుతోంది. ఆ గడువును ఇప్పుడు మరో ఏడాది పొడిగించినట్లు బోధపడుతూనే ఉంది! ఒకవైపు 5జీ ఆకాంక్షలు మోతెక్కుతున్నా, ఇండియాలో సుమారు 30కోట్ల మంది ఇంకా 2జీ శకంలోనే ఉన్నారన్నది ‘రిలయన్స్‌’ అధినేత ముకేశ్‌ అంబానీ తాజాగా చెప్పిన లెక్క. అటువంటి కోట్లమందికి స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వస్తేనే వారంతా డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కాగలిగేది. అందుకే టెలికాం ఉత్పత్తుల తయారీకి ముఖ్యకేంద్రంగా భారత్‌ అవతరించాలంటున్న ప్రధాని, ఇక్కడ డిజిటల్‌ వ్యవస్థకు ఉన్నన్ని అవకాశాలు మరెక్కడా లేవని స్పష్టీకరిస్తున్నారు. ఆ ధీమా అక్షరసత్యమై పెట్టుబడులు వెల్లువెత్తాలన్నా, 5జీ వైపు ప్రస్థానం వేగం పుంజుకోవాలన్నా- కీలక మౌలికాంశాలైన అంతర్జాల వేగం, భద్రతలకు ప్రభుత్వ అజెండాలో అగ్ర ప్రాధాన్యం దక్కాలి!

కరోనా మహమ్మారి నగదు చెల్లింపుల స్వరూపాన్నే మార్చేసిన దరిమిలా- 2030 సంవత్సరం నాటికి భారత్‌లో కార్డులు, డిజిటల్‌ లావాదేవీల పరిమాణం సుమారు రూ.65 లక్షల కోట్లకు చేరనుందని ‘యాక్సెంచర్‌’ నివేదిక ఇటీవలే మదింపు వేసింది. వ్యవస్థాగత సన్నద్ధత అందుకు తగ్గట్లు ఉందా అన్నది గడ్డుప్రశ్న. పోనుపోను డిజిటల్‌ లావాదేవీల ఉద్ధృతిని వెన్నంటి సైబర్‌ భద్రతకు ఎదురయ్యే సవాళ్లను ముందుగానే ఊహించి 18ఏళ్ల క్రితమే ఇజ్రాయెల్‌ సకల విధాల సంసిద్ధమైంది. అంతర్జాల చొరబాటుదారుల భరతం పట్టే నిమిత్తం చైనా నాలుగేళ్ల క్రితమే పది లక్షలమంది సుశిక్షితుల్ని మోహరించింది. సైబర్‌ సామర్థ్యాల రీత్యా 30 దేశాల జాబితాలో 21వ స్థానానికి పరిమితమైన భారత్‌లో నయా చోరగణం రెచ్చిపోతోంది. కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌-అక్టోబర్ల మధ్య ఏడు నెలల్లోనే దేశం నలుమూలలా ఎనిమిది లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి. నెట్‌వర్క్‌లో భద్రతా లోపాలతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాల వినియోగం, ఆన్‌లైన్‌ చెల్లింపులు పెరుగుతున్నకొద్దీ- మాయమాటలతో బురిడీ కొట్టించి క్షణాల్లో ఖాతాల్లోని డబ్బంతా కొల్లగొడుతున్న ఉదంతాల ఉరవడి జనసామాన్యాన్ని బేజారెత్తిస్తోంది. పచ్చిమోసాలు పెచ్చరిల్లుతున్నా, సైబర్‌ నేరాల నిరూపణ స్వల్ప శాతమేనని జాతీయ నేరగణాంక సంస్థ ధ్రువీకరిస్తోంది! మరోవైపు, చరవాణుల్లో నెట్‌ వేగం ప్రాతిపదికన పొరుగున శ్రీలంక కన్నా వెనకబడి, నేపాల్‌ పాకిస్థాన్ల కంటే తీసికట్టుగా ఇండియా 131వ స్థానానికి పరిమితం కావడం జాతికే తలవంపులు. దేశంలో ఇప్పటికీ సగటు చరవాణి డౌన్‌లోడ్‌ వేగం సుమారు 12 మెగాబిట్స్‌. అదే సింగపూర్‌ లాంటిచోట్ల బ్రాడ్‌బ్యాండ్‌ వేగం 226 ఎంబీపీఎస్‌ కన్నా అధికమంటే, ఇక్కడి మందకొడితనం నివ్వెరపరచక మానదు. కంతల్ని పూడ్చి నెట్‌ వేగం, సైబర్‌ భద్రతల్లో గణనీయంగా మెరుగుదల సాధించినప్పుడే- సాంకేతికంగా భారత్‌ ముందడుగు వేసినట్లు!

- ఈనాడు ఎడిటోరియ‌ల్‌
 

Posted Date: 25-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం