• facebook
  • whatsapp
  • telegram

మారాలి నగరాల అభివృద్ధి నమూనా

సన్నగిల్లుతున్న జీవన యోగ్యత

భారతీయ పట్టణాలను, నగరాలను జీవనయోగ్యంగా తీర్చిదిద్దడానికి మన పట్టణ అభివృద్ధి ప్రణాళికలను పునస్సమీక్షించుకోవలసిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఇటీవల పిలుపిచ్చారు. భారతీయ నగర వ్యవస్థల బలహీనతలు ఇప్పుడిప్పుడే స్పష్టంగా కళ్లకు కడుతున్నాయి. విపత్తులను ఎదుర్కోవడంలో మనకున్న మౌలిక వసతుల పరిమితులు బహిర్గమవుతున్నాయి. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక అధ్యయనాల సంస్థ ఇటీవల ప్రచురించిన నివేదికలోని వాస్తవాలు- భారత నగరాల అభివృద్ధి నమూనాల్లోని డొల్లతనాన్ని తేటతెల్లంచేశాయి. పేదరికం, నిరుద్యోగం, మౌలిక వసతుల లేమి వంటి సమస్యలతో పాటు అంటువ్యాధులు, ప్రకృతి విపత్తులతో మన నగరాలు కునారిల్లుతున్నాయి. కరోనా మహమ్మారి నగరీకరణ దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది. నగర ముఖ్య లక్షణమైన జనసాంద్రత కరోనా వ్యాప్తికి అత్యంత అనుకూలం. ప్రపంచంలోని మెట్రో నగరాలన్నీ కరోనా బారినపడ్డాయి. దేశంలోని దిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, సూరత్‌, అహ్మదాబాద్‌ వంటి పెద్ద నగరాల్లోనే 65 శాతం కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రపంచీకరణను అందిపుచ్చుకొని, ఆర్థిక చోదక శక్తులుగా మారిన నగరాల్లో అంటువ్యాధులు సులభంగా విస్తరిస్తున్నాయి.

అంటువ్యాధుల ప్రమాదం
జనాభాతో కిక్కిరిసిన నగరాల్లో జీవన యోగ్యత సన్నగిల్లుతోంది. ప్రభుత్వాలు రూపొందించిన అభివృద్ధి నమూనాలు ఇప్పటి పరిస్థితుల్లో అక్కరకొచ్చేలా లేవు. నగరాలు బాహ్యముఖంగా విస్తరించడంతో హెచ్‌ఐవీ, సార్స్‌ వంటి వ్యాధుల ముప్పు పెరిగిందన్నది నిపుణుల మాట. సామాజిక అసమానతల కారణంగా నగరాల్లో వంద చదరపు గజాల స్థలంలో పదిమంది వరకూ నివసిస్తున్నారన్న అధ్యయనాలూ అంటువ్యాధుల ప్రమాదాన్ని చాటుతున్నాయి. కరోనా ముప్పు నేపథ్యంలో నగరాల సామాజిక, ఆర్థిక స్వభావాలను, ప్రణాళికలను మార్చుకోక తప్పని వాతావరణం ఏర్పడింది. 19వ శతాబ్దంలో విస్తరించిన కలరా, ఆధునిక నగర పారిశుద్ధ్య వ్యవస్థల ఆవిష్కారానికి కారణమైంది. పారిశ్రామికీకరణ ఫలితంగా మురికివాడల్లో సంక్రమించే శ్వాసకోశ వ్యాధులను ఎదుర్కొనేందుకు- ఐరోపా దేశాలు గాలి,    వెలుతురు అధికంగా ప్రసరించడానికి అవకాశం కల్పించే గృహ నిర్మాణ నిబంధనల్ని రూపొందించాయి. 1908లో హైదరాబాద్‌లో వచ్చిన వరదల ఫలితంగా ఆనాటి నిజాం ప్రభుత్వం శాస్త్రీయమైన మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేసింది. కరోనా వంటి అంటువ్యాధుల నిరోధానికి దీటైన నగర అభివృద్ధి నమూనాలను, ప్రణాళికలను రూపొందించడానికి చాలా దేశాలు కసరత్తు ప్రారంభించాయి. భౌతిక దూరం అనే ముఖ్యమైన సూత్రం ఇప్పుడు కీలకంగా మారింది. కిక్కిరిసిన జనాభా ఉన్న నగరాల్లో భౌతిక దూరం పాటించడం అంత సులభమైన విషయమేమీ కాదు. ఆ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడుకొత్తరకం నగర నమూనాలను రూపొందిస్తున్నారు.

భారతీయ నగరాలు చాలా వరకు ఇరుగ్గా ఉంటాయి. అనేక నగరాలకు బృహత్‌ ప్రణాళికలు ఉన్నా ఆ మేరకు నిబంధనలు అమలు కావడం లేదు. విద్యాసంస్థలు, ఆస్పత్రులు, వ్యాపార సంస్థలు, నివాసాలు వంటివన్నీ ఒకే ప్రాంతంలో ఉంటాయి. ఫలితంగా జనం కిక్కిరిసిపోవడానికి అవకాశాలు అధికం.పాదచారులు నడిచే మార్గాలు సక్రమంగా లేవు. ప్రపంచంలోని చాలా దేశాలు అన్ని సౌకర్యాలతో కూడిన చిన్న, సౌకర్యవంతమైన నగరాల అభివృద్ధి దిశగా యోచిస్తున్నాయి. రాష్ట్రానికంతటికీ ఒకే నగరం ఉండటం కాకుండా, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, దానివల్ల నగరీకరణ సమస్యలు పరిష్కారమవుతాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు! చినుకు పడితే నగరాలు చిత్తడిగా మారుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. వేల కోట్ల రూపాయల ఆస్తినష్టం సంభవిస్తోంది. వేగంగా జరుగుతున్న నగరీకరణ, జనాభా పెరుగుదల, నిర్మాణ రంగం విస్తరించడం, చెరువులు, నాలాల ఆక్రమణ,  నగరం చుట్టుపక్కల వ్యవసాయ భూములు క్షీణించడం, పెరుగుతున్న నగరానికి తగినట్లుగా లేని పారిశుద్ధ్య వ్యవస్థ... మన నగరాలకు వరద ముంపు ముప్పు పెరగడానికి ప్రధాన కారణాలు.

చిన్న నగరాలు ఆర్థిక చోదక శక్తులు
ప్రణాళిక లేని ఆచరణ- నిధుల దుర్వినియోగానికి, అస్తవ్యస్తమైన పెరుగుదలకు దారితీస్తుంది. మన నగరాల్లో ఇప్పుడు జరుగుతున్నది అదే. నగరంలోని ఏ ప్రాంతానికైనా పదిహేను నిమిషాల్లో చేరుకునేలా ప్రణాళికలు రూపొందించాలి. తద్వారా ప్రజారవాణాపై ఆధారపడకుండా వెళ్ళవచ్చు. భౌతిక దూరం పాటించవచ్చు. దేశంలోని వంద ద్వితీయ శ్రేణి నగరాలను ‘ఆకర్షణీయ నగరాలు’గా రూపాంతరీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ‘స్మార్ట్‌ సిటీ మిషన్‌’ను ఏర్పాటు చేసింది. ఈ నగరాల నిర్మాణ ప్రణాళికల్లో అంటువ్యాధుల నిరోధానికి అనువైన మార్పులు చేస్తే- అవి కరోనా వంటి మహమ్మారుల వ్యాప్తిని సమర్థంగా నిరోధిస్తాయి. చిన్న నగరాలను ఆర్థిక చోదక శక్తులుగా, ఉద్యోగ కల్పన కేంద్రాలుగా అభివృద్ధి చేయవచ్చు. చిన్న నగరాలు విపత్తులను ఎదుర్కోవడానికి అవసరమైతే ఆకృతులను మార్చుకోగలవు. మారిన పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్తు నగర నిర్మాణ విధాన రూపకల్పనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలి. నగరాలను ఆరోగ్యవంతంగా, జీవనయోగ్యంగా మలచడమే ప్రభుత్వాల పరమార్థం కావాలి!

- పుల్లూరు సుధాకర్‌
 

Posted Date: 25-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం