• facebook
  • whatsapp
  • telegram

అసమానతలకు కరోనా ఆజ్యం!

పేదజనం - బతుకు దుర్భరం

‘మేం 99 మందిమున్నాం... గుర్తుంచుకోండి, అటు పక్క మీరొక్కరే’ ప్రపంచ పెట్టుబడిదారీ విధానానికి గుండెకాయలాంటి న్యూయార్క్‌లోని వాల్‌స్ట్రీట్‌కు కూతవేటు దూరంలో ధ్వజమెత్తిన ప్రజలు 2011లో వినిపించిన నినాదమది. విస్తరిస్తున్న ఆర్థిక అసమానతలు, పెరుగుతున్న దోపిడికి వ్యతిరేకంగా ‘ఆక్యుపై వాల్‌స్ట్రీట్‌’ (వాల్‌స్ట్రీట్‌ను ఆక్రమించుకోండి) పేరిట తొమ్మిదేళ్ల క్రితం  న్యూయార్క్‌లో ప్రారంభమైన ఆ తిరుగుబాటు నెల రోజుల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తమైంది. ముఖ్యంగా ఉత్తర అమెరికా, ఐరోపాల్లో కార్చిచ్చులా వ్యాపించిన ఆ తిరుగుబాటు 750కిపైగా నిరసన ప్రదర్శనలకు అంటుకట్టింది. ప్రపంచంలో ఒక శాతం ఉన్న సంపన్నుల సంపద పెరగడం చుట్టూ జరుగుతున్న చర్చ- కొవిడ్‌ ముప్పుతో మరో మలుపు తిరిగింది. ‘దశాబ్దకాల ప్రపంచ పురోగతిని ఈ వైరస్‌ కసిగా నుసి చేసే భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి’ అని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) కొన్ని నెలల క్రితం హెచ్చరించినట్లే- కనీసం పది కోట్ల మంది కొవిడ్‌ వల్ల కొత్తగా పేదరికం విష కౌగిలిలో చిక్కుకొన్నారు. కొవిడ్‌ కర్కశంగా విరుచుకుపడిన ఈ ఏడాదిలో ప్రపంచంలోని పదిమంది కుబేరుల సంపద 30వేల కోట్ల డాలర్లు పెరిగితే- రోజుకు రెండు డాలర్లకన్నా తక్కువ ఆదాయంతో బతుకులీడుస్తున్న వారి సంఖ్య అదనంగా పదికోట్లు పెరగడం గమనార్హం!

దోపిడి ప్రయోగాలు

వనరులను కొల్లగొట్టి ఎంతగా వినియోగిస్తే అంత గొప్ప అభివృద్ధి అనే తప్పుడు ప్రాతిపదికలు- వర్ధమాన దేశాల ఆర్థిక, రాజకీయ, సామాజిక విలువల విధ్వంసానికి కారణమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అసమానతల విస్తరణకు వేగం పెంచాయి. కొవిడ్‌ కారణంగా ఉన్నపళంగా ఉపాధి కోల్పోయి దుర్బర దారిద్య్రంలోకి జారుకున్నవారు గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే- పట్టణాల్లోనే అధికంగా ఉన్నట్లు ప్రపంచబ్యాంకు తాజా నివేదిక వెల్లడిస్తోంది. మురికివాడల్లో బతుకునెరపుతూ చిన్నా చితకా పనులతో పొట్టపోసుకొనే, పారిశ్రామికవాడల్లో కూలీలుగా బతుకులీడ్చే కోట్లాది ప్రజానీకానికి కొవిడ్‌ శరాఘాతమైంది. అనేక ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ప్రపంచ బ్యాంకు నిర్వహించిన అధ్యయనాల్లో పట్టణప్రాంత ప్రజలే అత్యధికంగా పేదరికం బారినపడినట్లు వెల్లడైంది. మరీముఖ్యంగా దక్షిణాసియాలో కనీసం అయిదున్నర కోట్లమంది కొత్తగా పేదరికం పెనుఉచ్చులో చిక్కుకొన్నారు. అభివృద్ధిలో అట్టడుగున మగ్గుతున్న 47 దేశాల్లో కొవిడ్‌ కారణంగా ఆరోగ్య సంక్షోభాన్ని మించి ఆర్థిక ఉత్పాతం వికటాట్టహాసం చేస్తోంది. ప్రపంచ వాణిజ్యం కుదేలై, పర్యాటక రంగం చతికిలపడి, లాక్‌డౌన్లతో ఉపాధికి కోలుకోలేని దెబ్బతగిలిన కారణంగా- ఈ పేద దేశాల వాణిజ్య లోటు నిరుడు నమోదు చేసుకున్న 9,100 కోట్ల డాలర్ల రికార్డు లోటును అధిగమించనుందని అంచనా.

కరోనా కారణంగా ముంచుకొస్తున్న అంధకారంతో ముష్టియుద్ధం చేయడమెలాగో అంతుపట్టని 110కిపైగా దేశాలు మానవీయ, ఆర్థిక సాయంకోసం ఐఎంఎఫ్‌ను అభ్యర్థించాయి. కొన్ని పేద దేశాల రుణ చెల్లింపులపై ఈ ఏడాది చివరి వరకూ ‘మారటోరియం’ విధిస్తున్నట్లు పెద్ద దేశాలు ప్రకటించాయి. ఆ మేరకు ఈ ఏడాదికి 73వేల కోట్ల డాలర్ల మేర చెల్లింపులు చేయాల్సిన భారం ఆయా దేశాలకు తగ్గినప్పటికీ- వచ్చే ఏడాదికి రెట్టింపయ్యే ఆ బరువును అవి ఎలా మోస్తాయన్నది అతిపెద్ద ప్రశ్న. కరోనా నివారణకు అవసరమైన వ్యాక్సిన్‌లకోసం పేద దేశాలు తలకిందులు తపస్సు చేయాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. ప్రపంచంలోని 14శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంపన్న దేశాలు 53శాతం మేర  వ్యాక్సిన్‌లు సమకూర్చుకోవడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నట్లు అంచనా! వచ్చే ఏడాది చివరినాటికి తమ దేశాల్లోని ప్రజలకు మూడు పర్యాయాలు వ్యాక్సిన్‌ డోసులు ఇచ్చేందుకు సంపన్న దేశాలు సర్వ సన్నద్ధంగా ఉన్నాయంటున్నారు. అవసరమైతే ఒక్కొక్కరికి అయిదుసార్లు వ్యాక్సిన్‌ ఇచ్చేందుకూ సిద్ధమైన కెనడా ఆ జాబితాలో అగ్రభాగాన ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రపంచంలోని కొన్ని వందల కోట్ల మందికి కనీసం మరో ఏడాదికాలం వరకూ టీకా దొరికే అవకాశాలే ఉండకపోవచ్చు!

కొత్త నమూనాలు కావాలి

కొద్దిమంది డబ్బులో ఓలలాడి, అత్యధికులు పేదరికంలో మగ్గిపోయే దుర్వ్యవస్థ మూడో ప్రపంచ దేశాల్లోనే కాదు... సంపన్న రాజ్యాల్లోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. సంపన్న కోవలోని ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ)కు చెందిన 37 దేశాల మధ్య కూడా గడచిన 50ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయికి ఆర్థిక అసమానతలు విస్తరించాయన్న అధ్యయనాలు- వ్యవస్థలపై కరోనా పంజా ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తున్నాయి. అనారోగ్యం పాలబడి హాస్పిటల్‌ బిల్లు అధికంగా చెల్లించాల్సి వచ్చినా, వర్షాలు సరిగా కురవక ఏడాదిలో ఒక పంట సరిగా పండకపోయినా దుర్భర దారిద్య్రంలోకి జారుకునే దుస్థితిలో పదుల కోట్ల ప్రజలు జీవిస్తున్నారు. పేద సమాజాలకు చెందినవారు సంపన్న కుటుంబీకులతో పోలిస్తే సగటున 15 సంవత్సరాల ముందే కన్నుమూస్తున్నట్లు అధ్యయనాలున్నాయి. పెద్ద దేశాల, బహుళ జాతి కంపెనీల వ్యూహాల కారణంగా- పేద దేశాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాంస్కృతిక జీవనంలో వచ్చిన మార్పుల గురించి ఇప్పటికే చాలినంత చర్చ జరిగింది. ఇక ఇప్పుడు కావలసింది కార్యాచరణ. ప్రస్తుత నమూనాలన్నింటినీ ఒక్కపెట్టున మార్చేసి, పర్యావరణ హితకరంగా ఆర్థిక వ్యవస్థలను తీర్చిదిద్దుకొనే ఒక అవకాశం కరోనా రూపంలో మనకు దొరికింది. సంక్షోభం అందించిన ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుంటే... సమసమాజం దిశగా మానవాళి అడుగులు మొదలైనట్లే!

- ఇందిరాగోపాల్‌
 

Posted Date: 30-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం