• facebook
  • whatsapp
  • telegram

‘గల్ఫ్‌’ పరుగులో గుండె బరువు!

ప్రవాస కార్మికులకు భరోసా కరవు

‘మేం ఉపాధి కోసం దేశాన్ని, కుటుంబాలను వదిలి ఇక్కడికి వచ్చాం.  ఇక్కడన్నీ సమస్యలే. మాకు సరిగా జీతాలు అందడం లేదు. సౌకర్యాలు లేవు. ఉద్యోగాలు ఎప్పుడు పోయేది తెలియదు. మీరే మమ్మల్ని ఆదుకోవాలి. న్యాయం చేయాలి’- 2015 ఆగస్టు 16న ప్రధాని నరేంద్రమోదీ యూఏఈ పర్యటనలో అబుదాబిలోని కార్మిక క్షేత్రాన్ని సందర్శించగా అక్కడున్న భారతీయ వలస కార్మికులు కన్నీళ్ల పర్యంతమవుతూ ఆయనతో పెట్టుకున్న మొర ఇది. అప్పుడూ, ఇప్పుడూ గల్ఫ్‌లోని వలస కార్మికుల జీవితాలు అలాగే ఉన్నాయి. దశాబ్దాల వారి వ్యథ తీరడం లేదు. దేశంగానీ దేశంలో వారు నిత్యం నానాయాతన పడుతూనే ఉన్నారు. కరోనా మహమ్మారితో గడచిన తొమ్మిది నెలలుగా వారి జీవితాలు అతలాకుతలమయ్యాయి. ఈ తరుణంలో గల్ఫ్‌కు వెళ్ళే కార్మికుల కనీస వేతనాల తగ్గింపునకు ఆమోదం తెలుపుతూ ఇటీవల వెలువడిన ఉత్తర్వులు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీనివల్ల ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులు, వారి కుటుంబాలలో భయాందోళనలు ఏర్పడ్డాయి. 

రోగమొకటి... మందొకటి!

గల్ఫ్‌దేశాల్లో సుమారు 30శాతానికిపైగా భారతీయ కార్మికులే. అభివృద్ధి, నిర్మాణ రంగాల్లో వారిది కీలకపాత్ర. లక్షల మంది అనేక సంవత్సరాలుగా అక్కడే నివసిస్తున్నారు. కార్మికులను మభ్యపెట్టి సందర్శకుల పేరిట వారిని ట్రావెల్‌ ఏజెంట్లు తరలించే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది. గడువు ముగిసిన తరవాతా కార్మికులు అక్కడే ఉండిపోతున్నారు. అక్కడి చట్టాలు కఠినంగా ఉండటంతో వీసాలు, పాస్‌పోర్టులు లేనివారు రహస్యంగా జీవిస్తున్నారు. భారతీయ కార్మికుల భయం, బలహీనతలను ఆసరాగా తీసుకొని అక్కడి సంస్థలు వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. తమ వద్ద పనిచేసేవారి వీసాలు, పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకొని ఆయా సంస్థలు సరైన వేతనాలు ఇవ్వడం లేదు. ఎక్కువ వేతనాలు అడిగితే వేధిస్తున్నాయి. వీసాలు, పాస్‌పోర్టులు లేకుండా అక్రమంగా ఉండటంవల్ల; యాజమానులతో సమస్యల కారణంగా ఏటా సగటున 12వేల మందికి పైగా జైళ్లలో మగ్గుతున్నారు. లక్షల మంది అనారోగ్యం, ప్రమాదాల బారిన పడుతున్నారు. వేలమంది భారతీయ కార్మికులు గల్ఫ్‌ దేశాల్లో మరణిస్తున్నారు.

గల్ఫ్‌లోని భారతీయ కార్మికుల పరిస్థితి దిక్కూమొక్కూలేని చందంగా మారింది. కార్మికులు తగిన రుసుము చెల్లించి, విమానాల్లో ప్రయాణాలు చేస్తున్నా వారి పేర్లను అధికారికంగా నమోదు చేసుకోవడం లేదు. విదేశాల్లో వారికి బీమా లభించడం లేదు. ఉద్యోగ భద్రత గురించి అడిగే ధైర్యం వారికీ లేదు. పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నా భయమే! స్థానికంగా రాయబార కార్యాలయాలు ఉన్నా, ఆశించిన రీతిలో అవి కార్మికులను ఆదుకోలేకపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 30లక్షల మంది గల్ఫ్‌ దేశాల్లో కార్మికులుగా, ఉద్యోగులుగా ఉన్నారు. కరోనా మొదలయ్యాక వలస కార్మికుల కష్టాలు మిన్నుముట్టాయి. కంపెనీలు మూతపడటంతో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. వేతనాల చెల్లింపులు నిలిచిపోయాయి. స్వదేశానికి వెళ్లడానికీ విమానాలు అందుబాటులో లేని పరిస్థితి. గల్ఫ్‌లో పనిచేసేవారు తమ సంపాదనలో కొంత భాగం వాడుకుని మిగిలింది సొంత ఊళ్లోని కుటుంబాలకు పంపేందుకు ప్రయత్నిస్తుంటారు. కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో ఆ మాత్రం డబ్బు కూడా తమ కుటుంబాలకు పంపుకొనేందుకు వారికి వీలుకాలేదు. కోలుకోలేని విధంగా కార్మికులను కరోనా దెబ్బతీయడంతో ఇప్పుడు వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. 

రాష్ట్రాలదే పెద్ద బాధ్యత!

అమెరికా తదితర దేశాల పౌరులకు లేని సమస్యలు విదేశాల్లోని భారతీయులకు ఎందుకు తలెత్తుతున్నాయి? దేశీయంగా కేరళ మినహా మిగిలిన రాష్ట్రాలు ప్రవాసుల పట్ల శ్రద్ధ చూపడంలేదు. కేంద్రం కనీస వేతన నిర్ణయం వెలువరించిన తరవాత గల్ఫ్‌కు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు కరోనా, మరోవైపు వేతన సంక్షోభం నెలకొన్నందున గల్ఫ్‌లో కార్మికుల ఆశలు గల్లంతవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా స్పందించి సమస్యల పరిష్కారానికి గట్టి చర్యలు తీసుకోవాలి. కార్మికుల మెరుగైన వేతనాలకు భరోసా ఇవ్వడంతోపాటు- యాజమాన్యాల వేధింపుల నుంచి వారిని రక్షించాలి. గల్ఫ్‌లోని రాయబార కార్యాలయాలను మరింత క్రియాశీలంగా, సత్వర స్పందన కేంద్రాలుగా మార్చాలి. క్షమాభిక్షల సమయంలో కార్మికులను స్వదేశానికి పంపించేందుకు కృషి చేయాలి. జరిమానా చెల్లించి, విమానాల టికెట్లు కొనుగోలు చేసి వారికి ఇవ్వాలి. జైళ్లలో మగ్గుతున్న వారిని విడిపించాలి. ప్రవాసులు ఆపదలకు గురైన సందర్భాల్లో వారిని ఆదుకునేందుకు బీమా సౌకర్యం ఉండాలి. కేంద్రమే గాక రాష్ట్ర ప్రభుత్వాలూ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు రావాలి. విదేశాలకు వెళ్లేవారి పేర్ల నమోదుతో పాటు ఆయా జిల్లాల్లో వారి యోగక్షేమాల కోసం కలెక్టరేట్లలో ప్రత్యేకాధికారులను నియమించాలి. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రవాస భారతీయ శాఖ లేదా విభాగం తప్పనిసరిగా ఉండాలి. కార్మికులు కష్టాల్లో ఉంటే ఆదుకునేందుకు కేరళ ప్రభుత్వం సంక్షేమ నిధిని నిర్వహిస్తోంది. గల్ఫ్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించలేని పక్షంలో- వారిని స్వదేశానికి రప్పించి, సొంత ఊళ్లలో స్థిరపరిచేందుకు సహకరించాలి. కార్మికుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వాలు క్రియాశీలంగా వ్యవహరించాలి!

కనీస వేతన పిడుగు!

కార్మికులకు కనీస వేతనాలపై కేంద్ర ప్రభుత్వం నిరుడు సెప్టెంబరులో రెండు ఉత్తర్వులు ఇవ్వడం తీవ్ర ప్రభావం చూపింది. గల్ఫ్‌లోని కంపెనీలు, యాజమానులకు ఈ ఉత్తర్వులు అస్త్రంగా మారాయి. కార్మికుల వేతనాలను కుదించడంతోపాటు; తమకు నచ్చనివారిని తొలగించి, తక్కువ వేతనాలకు కొత్తవారిని తీసుకోవడం ప్రారంభించారు. కార్మికుల జీవితాలు, ఉపాధి, సంస్థల వైఖరి తదితర అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోనికి తీసుకుని ఉంటే వారి కష్టానికి తగిన ఫలితం దక్కేది. కానీ, రాయబార కార్యాలయాల సూచనలకు అనుగుణంగా విధానం ప్రకటించి, ఉత్తర్వులు జారీ చేయడంతో సమస్యలు తలెత్తాయి. దాంతో కార్మికుల వేతనాలు 30శాతం నుంచి 50శాతం మేర తగ్గాయి. 

- ఆకారపు మల్లేశం
 

Posted Date: 06-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం