• facebook
  • whatsapp
  • telegram

సర్కారుకు పరీక్ష

విద్యార్థుల్లో సంసిద్ధత పెంచాలి

గడచిన విద్య సంవత్సరంలో కరోనా తీవ్రత దృష్ట్యా పలు రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేసి- విద్యార్థులను పై తరగతులకు పంపించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదీ కరోనా ఉద్ధృతి పూర్తిస్థాయిలో తగ్గకపోవడం, వైరస్‌ కొత్త స్ట్రెయిన్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ అభ్యసనాన్నే  కొనసాగిస్తున్నాయి. దీంతో అసలు పరీక్షలు ఉంటాయా, ఉంటే ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం నిలుపుదల (డిటెన్షన్‌) విధానం అమలులో లేదు కాబట్టి, ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు పరీక్షలు లేకుండా విద్యార్థులను ఉత్తీర్ణులుగా ప్రకటించడంలో ఇబ్బంది లేదు. కానీ 10, 12 తరగతులకు మాత్రం బోర్డు పరీక్షలు తప్పనిసరి. విస్తృత స్థాయి చర్చలు, సంప్రతింపుల అనంతరం కేంద్ర విద్యాశాఖ పరీక్షలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించనున్నట్లు ఇటీవల ప్రకటించడంతో ఉత్కంఠకు తెరదించినట్లయింది. మే నాలుగు నుంచి జూన్‌ పదో తేదీ వరకు పరీక్షల కాల పట్టికనూ విడుదల చేశారు. దీనికనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు పది, ఇంటర్‌ బోర్డు పరీక్షల షెడ్యూళ్లు ప్రకటించాల్సి ఉంది.

పరీక్షలు విద్యార్థి విషయ పరిజ్ఞానాన్ని పరిశీలించడంతో పాటు- విశ్లేషణాత్మక జ్ఞానం, తార్కిక నైపుణ్యాలను అంచనా వేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. విద్యార్థి క్రమశిక్షణకు బీజం వేస్తూ, పఠనం పట్ల దృష్టి కేంద్రీకరింపజేస్తాయి. పరీక్షల్లో వచ్చిన మార్కులు విద్యార్థికి ప్రోత్సాహాన్నివ్వడంతో పాటు అభ్యసనంలోని లోపాలను సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తాయి. అందుకే విద్యా ప్రణాళికలో పరీక్షలు అంతర్భాగంగా ఉంటాయి. పరీక్షలకు ఆధారం సిలబస్‌. దీన్ని పూర్తి చేయడానికి విద్యాసంవత్సరంలో నిర్దిష్టమైన పని దినాలుంటాయి. పది, ఇంటర్‌లలో మంచి మార్కులు సాధించడం ప్రత్యక్ష బోధనతోనే సాధ్యమని నిపుణుల అభిప్రాయం. స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు బడులు ప్రారంభించుకోవచ్చని గతంలోనే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. కానీ, చాలా రాష్ట్రాలు కరోనా తీవ్రత దృష్ట్యా విముఖత వ్యక్తం చేశాయి. మరికొన్ని రాష్ట్రాలు పాఠశాలలు ప్రారంభించినప్పటికీ- విద్యార్థుల హాజరు శాతం ఆశించిన స్థాయిలో లేదు.

ఆన్‌లైన్‌ అభ్యసనంలో విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పలు అధ్యయనాలు ఇప్పటికే పేర్కొన్నాయి. ముఖ్యంగా డిజిటల్‌ సాధనాల లేమి, ఇంటర్నెట్‌ సౌకర్యం లేకపోవడం, క్షేత్రస్థాయి పర్యవేక్షణ లోపించడం, బోధనను కొందరు విద్యార్థులు అర్థం చేసుకోలేకపోవడం వంటివి ప్రధాన సమస్యలు. విద్యార్థులు పరీక్షలను ఎదుర్కోవడంలో ఇవి ప్రతిబంధకాలుగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుత సంక్షోభంలో పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పై తరగతికి  పంపడంవల్ల ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు, ఉద్యోగావకాశాలకు ప్రతిబంధకంగా మారే ప్రమాదం ఉందని విద్యారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పరీక్షల నిర్వహణే శ్రేయస్కరమని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రత్యక్ష విద్యాబోధన లేకుండా విద్యార్థులు పరీక్షలను ఎలా ఎదుర్కొంటారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఆన్‌లైన్‌ తరగతులలో 50శాతం సిలబస్‌ కూడా పూర్తి కాలేదు. సాధారణంగా విద్యాసంస్థల్లో వార్షిక పరీక్షలకు ముందు విద్యార్థులు పలు మోడల్‌ పేపర్లు రాసేవారు. వీటిద్వారా ప్రిపరేషన్‌ లోపాలను సరిదిద్దుకొని పాఠాలను పునశ్చరణ చేసుకొనేవారు. ఇప్పుడు వీటికి ఆస్కారం లేదు. కొవిడ్‌ నియమావళితో పెద్దయెత్తున విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడమూ సర్కారుకు సవాలే.

నేటి సంక్షోభ సమయంలో పరీక్షల్లో పలు సంస్కరణలు తీసుకురావాలి. కఠినత్వాన్ని తగ్గించి, సరళత్వానికి శ్రీకారం చుట్టాలి. కొవిడ్‌ నేర్పిన పాఠాలను ప్రశ్నపత్రంలో అడగాలి. ప్రశ్నల్లో ఛాయిస్‌ ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా బహుళైచ్చిక ప్రశ్నలివ్వాలనే వాదన వినిపిస్తోంది. ఇలాంటి ప్రశ్నలివ్వడంపై ప్రతిభావంతులైన విద్యార్థులు నష్టపోతారని టీచర్లు, ప్రిన్సిపళ్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే నిపుణులతో చర్చించి ప్రశ్నపత్రంలో సహేతుకమైన మార్పులు తీసుకురావాలి. లఘు ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలకు కూడా చోటివ్వాలి. ప్రశ్నపత్ర విధానంపైన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సరైన అవగాహన కల్పించాలి. మోడల్‌ పరీక్షలు ఆన్‌లైన్‌లో విద్యార్థులకు పంపించాలి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 11 పేపర్లతో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షలను ఆరు పేపర్లకు కుదించాలని, బహుళైచ్చిక ప్రశ్నల సంఖ్య పెంచాలని ప్రతిపాదన వస్తోంది. పాఠశాల నిర్వహిస్తేనే  కొత్త పద్ధతి, పరీక్షల సరళిపై అవగాహన ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మొదటగా టీకా ఇచ్చి బడులను ప్రారంభించాలి. సిలబస్‌ పూర్తి చేసి, సన్నాహక పరీక్షలను రాయించాలి. దీనికంటే ముందు పాఠశాలల్లో స్వచ్ఛత కార్యక్రమాలకు పెద్ద పీట వేయాలి. పరీక్షల వేళ విద్యార్థులు ఒత్తిడికి గురి కావడం సహజం. కాబట్టి ముందుగా వారిని మానసికంగా సంసిద్ధులను చేయాలి. అప్పుడే విద్యార్థులు పరీక్షలను సమర్థంగా ఎదుర్కొని విజేతలుగా నిలవగలుగుతారు!

- సంపతి రమేష్‌ మహారాజ్‌
 

Posted Date: 13-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం