• facebook
  • whatsapp
  • telegram

కశ్మీరీల మద్దతు ఎవరికి?

జమ్మూకశ్మీర్‌- జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికలు

జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు అన్న మాట చెబితేనే ఒకప్పుడు ఉగ్రవాదులు, బాంబుదాడులు గుర్తుకు వచ్చేవి. పోలింగ్‌ కేంద్రాల ముందు బక్కచిక్కిన క్యూలైన్లలో, భయాందోళనల మధ్య ఓటింగ్‌ ప్రకియలో పాల్గొంటున్న చిత్రాలు దర్శనమిచ్చేవి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని రద్దుచేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన తరవాత అక్కడ మొదటిసారిగా జిల్లా అభివృద్ధి మండలి(డీడీసీ) ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా ఏళ్ల తరవాత ఎన్నికల సందడి మొదలైంది. మొత్తం ఎనిమిది దశల పోలింగ్‌ ప్రక్రియలో ఇప్పటివరకూ అయిదు దశలు పూర్తయ్యాయి. అయిదో దశలో పోలింగ్‌ 51శాతంగా నమోదయింది. ఉగ్రవాదుల తూటాల ధ్వనులు, భద్రతాదళాల బూట్ల చప్పుడుతో దద్దరిల్లిన నేల ఇప్పుడు బహిరంగ సభలు, ర్యాలీలు, ఇంటింటి ప్రచారాలతో కోలాహలంగా మారింది. తొమ్మిదో దశకంతో పోలిస్తే జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల ఉద్రిక్తతలు గణనీయంగా తగ్గాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కొన్నేళ్లుగా ఓటింగ్‌ శాతాలు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుతున్నాయి. కూడు, గూడు, వస్త్రాలు వంటి మౌలిక సౌకర్యాల కల్పనే ప్రాతిపదికగా ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఓటింగ్‌ ప్రక్రియలో క్రమం తప్పకుండా పాల్పంచుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్య సంస్కృతిని బలోపేతం చేయవచ్చునన్న స్పృహ అక్కడి ప్రజానీకంలో విస్తరిస్తుండటం విశేషం!

పీడీపీతో తెగతెంపులు చేసుకొని భాజపా సంకీర్ణంనుంచి బయటకు వచ్చేసిన తరవాత 2018నుంచి జమ్మూకశ్మీర్‌లో గవర్నరు పాలన కొనసాగుతోంది. 2014 నవంబరు- డిసెంబరు మాసాల మధ్య అక్కడి అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌-370 రద్దు అనంతరం జరుగుతున్న భారీ ఎన్నికలివి. ప్రతి జిల్లానూ డీడీసీ ఎన్నికలకోసం 14 నియోజకవర్గాలుగా విభజించారు. ఇప్పటికే పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికలకూ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఎనిమిది దశల పోలింగ్‌ ప్రక్రియలో పార్టీలన్నీ తమ మేనిఫెస్టోలను ప్రజల ముందు పెట్టాయి. ఇంటింటికీ తిరిగి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శక్తిమేర ప్రయత్నిస్తున్నాయి. భాజపాకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ ప్రత్యేక ఫ్రంట్‌గా ఏర్పాటయ్యాయి. పీపుల్స్‌ అలయెన్స్‌ ఫర్‌ గుప్కర్‌ డిక్లరేషన్‌ (పీఏజీడీ) పేరిట నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ సహా మరో అయిదు పార్టీల సమాహారంగా ఏర్పాటైన సంకీర్ణం 370-అధికరణ పునరుద్ధరణే లక్ష్యంగా, భాజపా వ్యతిరేక కూటమిగా ఏర్పాటైంది. జిల్లా అభివృద్ధి మండళ్లకు జరిగే ఎన్నికలు- ప్రధానంగా పీఏజీడీ కూటమి, భాజపా, ఒకప్పటి ఆర్థికమంత్రి అల్తాఫ్‌ బుఖారీ సారథ్యంలో ఏర్పాటైన ‘అప్ని పార్టీ’ల చుట్టూ తిరుగుతున్నాయి. త్రిముఖ పోటీలో విజయమెవరిని వరిస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ‘గుప్కర్‌’ సంకీర్ణాన్ని జాతి వ్యతిరేక కూటమిగా భాజపా అభివర్ణిస్తోంది. సంకీర్ణ కూటమి వెల్లడించిన అజెండాపై కాంగ్రెస్‌ తన వైఖరిని స్పష్టం చేయాలని భాజపా డిమాండ్‌ చేస్తోంది. ఈ విషయంలో కాంగ్రెస్‌ ఆచితూచి వ్యవహరిస్తోంది. ‘గుప్కర్‌’ కూటమితో తమ పార్టీకి ఎలాంటి సంబంధాలూ లేవని ప్రకటిస్తోంది.  

దేశ విభజన సమయంలో ‘పశ్చిమ పాకిస్థాన్‌’నుంచి వలసవచ్చిన లక్షన్నరమంది శరణార్థులకు తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం దొరికింది. 2019 ఆగస్టు 5న అధికరణ-370 రద్దుతో వీరికి ‘స్థానిక శాశ్వత నివాస’ హోదా లభించింది. గతంలో కేవలం లోక్‌సభకు మాత్రమే ఓటు వేయగల అవకాశం ఉన్న ఈ శరణార్థులు- ఇప్పుడు స్థానిక సంస్థల్లోనూ అభిప్రాయం ప్రకటించే హక్కు దక్కించుకున్నారు. ఓటు హక్కుతోపాటు డీడీసీ ఎలెక్షన్లలో పోటీపడే అవకాశమూ వీరికి దొరికింది. జమ్ము డివిజన్‌లోని 18 డీడీసీలకు 124 మంది ‘శరణార్థులు’ పోటీపడుతున్నారు. 1989నాటి జమ్మూకశ్మీర్‌ పంచాయతీ రాజ్‌ చట్టాన్ని కేంద్రం సవరించింది. గతంలోని జిల్లా ప్రణాళిక-అభివృద్ధి బోర్డుల స్థానే డీడీసీలు ఏర్పాటు చేశారు. ఎంపీలు, ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సీలు సభ్యులుగా క్యాబినెట్‌ మంత్రి సారథ్యంలో జిల్లా ప్రణాళిక అభివృద్ధి బోర్డులు మునుపు పనిచేసేవి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సవరణ నేపథ్యంలో డీడీసీలకు ఎంపికైన ప్రతినిధులనుంచే ఒకరు ఛైర్మన్‌గా ఎంపికై జిల్లా అభివృద్ధి మండళ్లకు సారథ్యం వహిస్తారు. ప్రాంతీయ రాజకీయ పార్టీల అధికారాలకు కోతపెట్టే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ సవరణలు చేపట్టిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా అభివృద్ధి మండళ్లకు జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో జాతీయ స్థాయి నాయకులందరినీ భాజపా మోహరించింది. ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి అజెండాను ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకొని ఎన్నికల్లో ముందుకు వెళుతోంది. అధికరణ-370 రద్దు తరవాత నిర్వహిస్తున్న తొలి ఎన్నికలు కావడంతో- త్రాసులో ప్రజాభిప్రాయం ఎటువైపు మొగ్గుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ముస్లిం మెజారిటీ స్థానాల్లో భాజపా ఏమాత్రం మద్దతు పొందినా అది ఆ పార్టీకి కొత్త దన్నునిస్తుంది!

- సమియా లతీఫ్‌
 

Posted Date: 25-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం