• facebook
  • whatsapp
  • telegram

‘స్థానిక’ విజయం దేనికి సంకేతం?

కేరళ రథం... వామపక్ష పథం!

ప్రజల మొగ్గు ఏ పార్టీవైపు ఉందో, వారి ఆలోచనా ధోరణి ఎలా సాగుతోందన్న స్పష్టత కోసం రకరకాల సర్వేలు చేస్తుంటారు. సర్వేలకోసం ఎంచుకునే ప్రాంతాన్ని బట్టి, ప్రజా సమూహాన్ని బట్టి, ‘శాంపిల్‌’ పరిమాణాన్ని బట్టి ఫలితాల్లో తేడా వస్తూ ఉంటుంది. కేరళలో ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అక్కడి ప్రజల ఆలోచన ధోరణికి అద్దం పట్టాయనే చెప్పాలి. అభివృద్ధి నినాదంతో అధికార ఎల్‌డీఎఫ్‌ ఈ ఎన్నికల్లో పోటీకి దిగింది. యూడీఎఫ్‌, ఎన్‌డీఏలు పలు రకాల విమర్శలతో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టి ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ప్రయత్నించాయి. కేరళలోని మొత్తం 1200 స్థానిక సంస్థల్లోని 21,893 వార్డులు, ఆరు కార్పొరేషన్లు, 941 గ్రామ పంచాయతీలు, 14 జిల్లా పంచాయతీలు, 87 మున్సిపాలిటీలకు ఈ నెల  ఎనిమిది నుంచి మూడు దశల్లో జరిగిన పోలింగ్‌ ఫలితాలు- ఎల్‌డీఎఫ్‌లో తిరుగులేని ఆత్మవిశ్వాసం నింపాయి. సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు లభించిన ప్రజామోదంగా విశ్లేషకులు ఈ ఫలితాలను అభివర్ణిస్తున్నారు. మరో ఆరు మాసాల్లో కేరళ శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో పార్టీల భవితవ్యాన్ని చూచాయగానైనా వెల్లడించిన ఫలితాలివి.

మునుపెన్నడూ లేని స్థాయిలో కేరళలో ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం ఈ దఫా విపక్షాలనుంచి మూకుమ్మడిగా తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అంతా తానై ఎల్‌డీఎఫ్‌ తరఫున ప్రచారం నిర్వహించారు. ‘అభివృద్ధికే ఓటు వెయ్యండి’ అన్న నినాదంతో ఎల్‌డీఎఫ్‌ సాగించిన ప్రచారం ముందు విపక్షాల ఆరోపణలు తేలిపోయాయి. ఉద్వేగపూరిత అంశాలను పట్టించుకోకుండా; తమ నిత్యజీవితాన్ని ప్రభావితం చేస్తున్న విషయాలకే ప్రాధాన్యమిచ్చి ప్రజలు ఈ ఎన్నికల్లో స్పందించినట్లు తెలుస్తోంది. దేశంలోనే అత్యుత్తమమైన స్థానిక పాలన వ్యవస్థలు కేరళలో ఉన్నాయి. మెరుగైన వికేంద్రీకరణ ఆ రాష్ట్రంలో పాలనలో ప్రజాభాగస్వామ్యాన్ని సాకారం చేసింది. పార్టీలతో సంబంధం లేకుండా సమస్యల పరిష్కారమే ప్రాథమ్యంగా కేరళలోని స్థానిక వ్యవస్థలు, యంత్రాంగం స్పందించే తీరు- ఇటీవల విపత్తుల సందర్భంగా తేటతెల్లమైంది. నిఫా వైరస్‌ బయటపడి రాష్ట్రాన్ని వణికించినప్పుడు స్థానిక వ్యవస్థలు సమర్థంగా వ్యవహరించి ఇంటింటినీ చైతన్యపరిచాయి. అదే విధంగా కేరళను వరదలు చుట్టుముట్టినప్పుడు కూడా పంచాయతీల స్థాయిలో స్థానిక యంత్రాంగం అద్భుతంగా స్పందించి పెను నష్టాన్ని నివారించగలిగింది. కొవిడ్‌ మహమ్మారి చుట్టుముట్టినప్పుడు కేరళ వ్యవహరించిన తీరు దేశానికే ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా మూలమూలకూ వైద్య బృందాలను పంపించి, ప్రతి ఒక్కరికీ ముందు జాగ్రత్తలు తెలియజెబుతూ వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంకోసం కేరళ ప్రభుత్వం స్పందించిన విధానం సర్వత్రా ప్రశంసలు అందుకొంది. మరే రాష్ట్రమూ మేలుకోకముందే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే 20 వేల కోట్ల రూపాయల ‘రిలీఫ్‌ ప్యాకేజీ’ ప్రకటించి కొవిడ్‌ కట్టడిలో కేరళ ముందు వరుసలో నిలిచింది. ‘లాక్‌డౌన్‌’ కారణంగా ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదన్న సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా సామూహిక వంటశాలలను ఏర్పాటు చేశారు. ప్రజల ఆర్థిక స్థితితో నిమిత్తం లేకుండా ప్రతి ఇంటికీ నిత్యావసర సరకులను అందజేశారు. స్వచ్ఛంద సంస్థలను, పౌర సంఘాలను, దాతలను ఒకే ఛత్రం కిందకు తీసుకువచ్చి సహాయ కార్యక్రమాల్లో వారిని క్రియాశీలంగా మార్చడంలో ప్రభుత్వం చురుకైన పాత్ర పోషించింది. స్థానిక ఎన్నికల ఫలితాలను ఈ కారణాలన్నీ ప్రభావితం చేసి ఉండవచ్చు.

ఎల్‌డీఎఫ్‌పై అవినీతి, బంగారు స్మగ్లింగ్‌ వంటి ఆరోపణలు ఉన్న తరుణంలో ఆ అవకాశాన్ని వినియోగించుకుని యూడీఎఫ్‌ ఈ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధిస్తుందేమోనని ఎదురుచూసిన వారికి నిరాశే మిగిలింది. కాంగ్రెస్‌పార్టీలోని నాయకత్వ సంక్షోభం ఈ ఎన్నికల్లో మరోసారి ప్రస్ఫుటమైంది. ప్రతిష్ఠాత్మకమైన తిరువనంతపురం కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ మూడో స్థానానికి పడిపోయింది. మరోవంక భాజపా ఆశించిన ఫలితాలు పొందలేకపోయినా, అక్కడక్కడా తన ప్రభావాన్నయితే కనబరచగలిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో యువ అభ్యర్థులే ఎక్కువగా విజయాలు సాధించడం మరో కీలక పరిణామం. సామాజిక మాధ్యమాలు ఈ ఎన్నికల్లో మునుపెన్నడూ లేని స్థాయిలో కీలక పాత్ర పోషించడం గమనించాల్సిన మరో విషయం. ఈ ఫలితాలు ఇచ్చిన దన్నుతో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను పినరయి విజయన్‌ నాయకత్వంలో ఎల్‌డీఎఫ్‌ తిరుగులేని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటుందనడంలో సందేహం లేదు.

- కె.ప్రవీణ్‌ కుమార్‌
 

Posted Date: 26-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం