• facebook
  • whatsapp
  • telegram

చేరికలు కూడికలు అవుతాయా!

పశ్చిమ్‌ బంగలో జోరుగా వలస రాజకీయాలు

ఒకటికి మరొకటి జత కలిస్తే రెండు. రాజకీయాల్లో మాత్రం రెండు కావచ్చు... పదకొండూ కావచ్చనేది నిపుణుల మాట. కొన్నిసార్లు ఏమీ కాకుండానూ పోవచ్చు. రాజకీయ క్షేత్రంలో లెక్కలకన్నా కెమిస్ట్రీయే ముఖ్యమని మరికొంతమంది చెబుతుంటారు. గణితం, రసాయనాలకన్నా, జీవరసాయనం సరిగ్గా కుదిరితేనే మెరుగైన ప్రయోజనాలు సిద్ధిస్తాయని గతంలో ఎన్నో ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. ప్రస్తుతం పశ్చిమ్‌ బంగలో శాసనసభ ఎన్నికలకు మరికొన్ని నెలల వ్యవధి ఉండగానే వలసలు జోరందుకున్నాయి. అవతలి పక్షం నేతల చేరికలు ఇవతలి పక్షానికి నిజంగానే లాభాన్ని కలగజేస్తాయా అనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే!

ఆపరేషన్‌ ఆకర్ష

ఈసారి ఎలాగైనా పశ్చిమ్‌ బంగ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న భాజపా- వలసలపైనే దృష్టి పెట్టి ఆపరేషన్‌ ఆకర్షను కొనసాగిస్తోంది. రాష్ట్రంలో అధికార పక్షమైన తృణమూల్‌ కాంగ్రెస్‌లోని కీలక నేతలను పెద్దయెత్తున తన జట్టులోకి చేర్చుకుంటోంది. 2019 మొదలు వివిధ పార్టీల నుంచి దాదాపు ఇరవై మందికిపైగా ఎమ్మెల్యేలకు కాషాయ కండువా కప్పింది. తాజాగా తృణమూల్‌లో కీలక నేతగా, పెద్ద సంఖ్యలో నియోజక వర్గాల గెలుపోటములపై ప్రభావం చూపగలరని పేరున్న సువేందు అధికారిని కమల దళం అక్కున చేర్చుకుంది. సువేందుతోపాటు పలువురు అధికార పక్ష, సీపీఐ, సీపీఐ(ఎం), కాంగ్రెస్‌ తదితర విపక్ష ఎమ్మెల్యేలూ భాజపాలో చేరారు. దీనికి ప్రతివ్యూహంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ- భాజపా ఎంపీ సౌమిత్రఖాన్‌ భార్య సుజాత మోండల్‌ఖాన్‌కు తృణమూల్‌ తీర్థం అందించారు. ఈ పరిణామం సౌమిత్రఖాన్‌ తన భార్యకు విడాకుల నోటీసు పంపించేదాకా వెళ్ళింది. ఇలా ఇరుపక్షాలూ పోటాపోటీగా నేతలను లాగేసుకుంటూ పశ్చిమ్‌ బంగ రాజకీయాల్లో సంచలనాలు రేపుతున్నారు. ఒకప్పుడు ఇతర పార్టీల నుంచి నేతలను వలేసి పట్టుకొచ్చి, మమత గూట్లోకి చేర్చిన తృణమూల్‌ నేతలు ముకుల్‌రాయ్‌, సువేందు అధికారి ఇప్పుడు భాజపా శిబిరంలో ఉండటం విశేషం. వీరిద్దరినీ అదే తరహా కార్యాలకే వినియోగించుకోవాలనేది కమలం నేతల వ్యూహంగా తెలుస్తోంది. కీలక నేతలన్న ముద్ర కలిగిన వారిని తమ జట్టులోకి లాగేసుకున్నంత మాత్రాన పరిస్థితులన్నీ అనుకూలంగా మారిపోతాయా? అలవోకగా విజయాలు వరిస్తాయా? సందేహమే. క్షేత్రస్థాయిలో అప్పుడుండే పరిస్థితులను బట్టి ఫలితాలు ఉంటాయే తప్పించి- నేతలను ఆకర్షించి, తమ శిబిరాల్లో చేర్చుకోగానే మొత్తం పని పూర్తయినట్లు కాదని చెప్పేందుకు ఎన్నో నిదర్శనలున్నాయి. పశ్చిమ్‌ బంగలో ఇతర పార్టీల నుంచి వస్తున్న నేతలకు భాజపాలో పరిస్థితులు మరీ సానుకూలంగా ఏమీలేవు. వలస నేతల రాకను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నవారూ ఉన్నారు. ఇటీవల తృణమూల్‌ నేత జితేంద్ర తివారీని పార్టీలో చేర్చుకోవడాన్ని భాజపా నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అసన్‌సోల్‌ ఎంపీ, కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులు అగ్నిమిత్ర పాల్‌ బహిరంగంగానే అసంతృప్తి వెళ్ళగక్కారు. చేరికలను వ్యతిరేకించిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయంతన్‌ బసు తదితరులతోపాటు పలువురు జిల్లాస్థాయి నేతలకూ పార్టీ షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. ఈ చర్య ద్వారా కొత్త నేతల రాకను ఎవ్వరూ వ్యతిరేకించవద్దనే సందేశాన్ని భాజపా జాతీయ నాయకత్వం పంపినట్లు తెలుస్తోంది. కొంతమంది కమలం గడపదాకా వచ్చి, వ్యతిరేకత కారణంగా వెనక్కి వెళ్ళిపోయిన ఉదంతాలూ చోటుచేసుకున్నాయి.  

కుదరని లంకె

పశ్చిమ్‌ బంగ భాజపాలో పాత నేతలకు, వలస నాయకులకు మధ్య లంకె కుదరడం లేదని ఈ పరిణామాలు సంకేతాలిస్తున్నాయి. తృణమూల్‌ సీనియర్‌ నేత ముకుల్‌రాయ్‌ 2017లో సొంతపార్టీని వీడి కమలం పక్షాన చేరగా, భాజపా జాతీయ ఉపాధ్యక్ష పదవి దక్కినా పెద్దగా ప్రభావితం చేయలేకపోయారనే విమర్శలున్నాయి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం కావడంతో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నట్లు చెబుతున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చినవారికీ అవకాశాలు కల్పించాలంటూ అగ్రనేత అమిత్‌ షా రాష్ట్ర నాయకులకు స్పష్టం చేసినా, అది పెద్దగా కార్యరూపం దాల్చినట్లు కనిపించడం లేదు. మరో ఉదాహరణ- తృణమూల్‌ బిష్ణుపూర్‌ ఎంపీ సౌమిత్ర ఖాన్‌ తృణమూల్‌ను వీడి 2019లో భాజపాలో చేరి గెలిచారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్ష పదవి సైతం దక్కింది. అయినా ఘోష్‌తో సౌమిత్రకు ఏ మాత్రం పొసగడం లేదంటున్నారు. తృణమూల్‌ పాలకవర్గాలున్న ఆరు మున్సిపాలిటీల నేతలు పెద్దయెత్తున భాజపాలోకి మారినా, తదనంతర పరిణామాలతో తిరిగి తృణమూల్‌ గూటికే చేరిన వైనం ఇలాంటి పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తోంది. బెంగాల్‌లో పార్టీకే విధేయత చూపుతారని, కులం మతం, భాష వంటివాటి పాత్ర తక్కువేనన్నది పరిశీలకుల అభిప్రాయం. పెద్దయెత్తున సాగే వలసలు- పార్టీల అదృష్టరేఖలను మార్చేస్తాయా, విజయతీరాలకు చేరుస్తాయా అనేవి అంత తేలిగ్గా సమాధానం దొరికే ప్రశ్నలు కావు!

- శ్రీనివాస్‌ దరెగోని
 

Posted Date: 02-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం