• facebook
  • whatsapp
  • telegram

పొరుగు దేశాల చూపు నేపాల్‌ వైపు

ఉత్కంఠ రేపుతున్న రాజకీయ పరిణామాలు

నేపాల్‌లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను భారత్, చైనా క్షుణ్నంగా పరికిస్తున్నాయి. కేపీ శర్మ ఓలీ సిఫార్సు మేరకు నిరుడు డిసెంబరు 20న నేపాల్‌ పార్లమెంటు ప్రతినిధుల సభ(హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌)ను రద్దు చేయడం రాజ్యాంగ వ్యతిరేకమంటూ- ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. పార్లమెంటును రద్దు చేసే అధికారం నేపాల్‌ రాజ్యాంగం ప్రధానికి ఇవ్వలేదని అయిదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పులో పేర్కొంది. సభను రద్దు చేసి తనకిష్టమైనప్పుడు మధ్యంతర ఎన్నికలకు వెళ్లే దిశగా ఓలీ వ్యవహరించడాన్ని తప్పు పట్టింది. 13 రోజుల(మార్చి ఎనిమిదో తేదీ)లోగా సభను తిరిగి సమావేశపరచాలంటూ ఫిబ్రవరి 23వ తేదీన ఆదేశించింది. ఓలీ చర్యలకు నిరసన తెలిపిన వారంతా సుప్రీం తీర్పు వెలువడిన అనంతరం సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని పదవి నుంచి దిగిపోతే తప్ప- ప్రతిపక్షాల నుంచి, తన మాజీ సహచరుల నుంచి ఓలీ అవిశ్వాస తీర్మాన ముప్పును ఎదుర్కోవలసిందే! 

భారత్‌తో వివాదం

భారత్‌ - నేపాల్‌ 1,800 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగి ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య సంస్కృతి, చరిత్ర, భౌగోళిక, మతపరమైన అంశాల్లో సామీప్యత ఉంది. అందుకే నేపాల్‌లో జరిగే ఏ చిన్న పరిణామం ప్రభావమైనా ఇండియాపై ఉంటుంది. తొలి నుంచి కేపీ శర్మ ఓలీ ధోరణి భారత్‌కు కంటగింపుగానే ఉంది. గత ఏడాది జూన్‌లో ఓలీ నేతృత్వంలో నేపాల్‌ రాజకీయ చిత్రపటం (మ్యాప్‌) విడుదలైంది. అందులో లిపులేక్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను నేపాల్‌ భూభాగంలో కలపడం వివాదాస్పదమైంది. ఆ మ్యాప్‌ నేపాల్‌ పార్లమెంటు ఆమోదం పొందింది. నిరుడు మే ఎనిమిదో తేదీన భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ లిపులేక్‌ నుంచి కాలాపానీ వరకు రోడ్డు మార్గాన్ని ప్రారంభించడంపై నేపాల్‌లో వ్యతిరేకత వ్యక్తమయింది. లిపులేక్‌లోని భూభాగాన్ని తనదిగా నేపాల్‌ దీర్ఘకాలంగా చెబుతోంది. ఈ వివాదాల పరిష్కారానికి దిల్లీ కాఠ్‌మాండూల మధ్య ద్వైపాక్షిక చర్చలు ప్రారంభం కావలసి ఉంది. ఈ లోగా చోటు చేసుకుంటున్న పరిణామాలు నేపాల్‌లో అస్థిరతను మరింత ఎగదోసేలా ఉన్నాయి. మావోయిస్టుల తిరుగుబాటుతో రెండు దశాబ్దాలపాటు నేపాల్‌లో సంభవించిన హింసలో సుమారు 17 వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కొత్త రాజ్యాంగాన్ని ఇంకా పూర్తిస్థాయిలో అమలు చేయనేలేదు. ఆర్థిక వ్యవస్థ సైతం గాడిన పడలేదు. నిరుద్యోగిత తీవ్రంగా ఉంది. ఉపాధిని, ఇతర అవకాశాలను వెతుక్కుంటూ సరిహద్దుల్లోని యువత భారత్‌ సహా పలు పొరుగు దేశాలకు వెళుతున్నారు. 

నేపాల్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలను చైనా అత్యంత శ్రద్ధగా పరిశీలిస్తోంది. ఆ రెండు దేశాల మధ్యా 1,400 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అందులో అత్యధిక భాగం వివాదరహితమైనదే.‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ)’ పథకం ద్వారా నేపాల్‌ను చైనా ఆకట్టుకొంటోంది. కొన్ని సంవత్సరాలుగా కాఠ్‌మాండూ-బీజింగ్‌ మధ్య అత్యున్నతస్థాయి రాకపోకలు, సందర్శనలు చోటు చేసుకున్నాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సహా ఉన్నతాధికారులు ఆయా సమావేశాల్లో పాల్గొన్నారు. నేపాల్‌లోని కమ్యూనిస్టు నాయకులంతా ఐక్యంగా ఉండాలంటూ వారు పదేపదే విజ్ఞప్తులూ చేశారు. ఓలీ, మాజీ మావోయిస్టు నేత పుష్ప కమల్‌ దహాల్‌(ప్రచండ), ఇతర నేతలు ఐక్యంగా ఉండేందుకు నేపాల్‌లోని చైనా రాయబారి హో యాంగ్చీ తీవ్రంగా ప్రయత్నించారు. ప్రచండ, మాజీ ప్రధాని మాధవ్‌ కుమార్‌ నేపాల్‌ల మధ్య ఐక్యత సాధనలో ఆమె సఫలమైనా, ఓలీ-ప్రచండల మధ్య సంబంధాలు మరింత విషమించడంతో ఆమె సైతం ఏమీ చేయలేని పరిస్థితి ఎదురయింది.  

సంకీర్ణ భాగస్వాములకోసం అన్వేషణ 

నేపాల్‌ పార్లమెంటు పునరుద్ధరణకు సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో- సీపీఎన్‌కు చెందిన ఇరువురు నేతలు ప్రధాన మంత్రి పదవికోసం పోటీ పడనున్నారు. రెండుగా చీలిన పార్టీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులకు చెందిన ఒక వర్గానికి ఓలీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రత్యర్థి వర్గానికి చెందిన ప్రచండ- మాజీ ప్రధాని మాధవ్‌ కుమార్‌ నేపాల్‌తో చేతులు కలిపారు. కేంద్ర కమిటీకి చెందిన 70శాతం సభ్యుల మద్దతు తమకు ఉన్నట్లు ప్రచండ వర్గం చెప్పుకొంటోంది. ఓలీ మాత్రం దాన్ని తోసిపుచ్చుతున్నారు. మరోవైపు ఓలీ; ప్రచండ-మాధవ్‌ కుమార్‌ నేపాల్‌ వర్గాలు ప్రతిపక్షమైన నేపాలీ కాంగ్రెస్‌ నాయకుడు షేర్‌ బహదూర్‌ డ్యూబాతో జట్టు కట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. నమ్మదగిన సంకీర్ణ భాగస్వామికోసం అన్వేషణ జరుగుతున్న ఈ తరుణంలో మాజీ మావోయిస్టు నేత బాబూరామ్‌ భట్టారాయ్‌ నేతృత్వంలోని సమాజ్‌బాదీ పార్టీ వంటి శక్తులూ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రోజుకో విధంగా మలుపులు తిరుగుతున్న రాజకీయ పరిణామాలకు ఒక ఆకృతి రావడంలో రాబోయే రెండు వారాలూ కీలకమవుతాయి. ఈ సంధి సమయంలో మళ్లీ ఓలీయే రంగప్రవేశం చేస్తారా? ప్రచండ గద్దెనెక్కుతారా? డ్యూబా పదవిని కైవసం చేసుకొంటారా అన్నవి ఉత్కంఠ కలిగించే అంశాలు.

- సురేంద్ర ఫూయాల్‌ 
(కాఠ్‌మాండూలో ప్రముఖ పాత్రికేయులు)

 

Posted Date: 02-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం