• facebook
  • whatsapp
  • telegram

కూటముల కోలాటం

అసోమ్‌లో రక్తికడుతున్న ఎన్నికల పోరు

పెరుగుతున్న గ్యాస్‌, పెట్రో ధరలు, నిరుద్యోగం ఈసారి ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రధాన ఆయుధాలు కానున్నాయి. అసోమ్‌లో మొత్తం 2.29 కోట్ల మంది ఓటర్లు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించనున్నారు. ఆ రాష్ట్రంలోని 33,530 పోలింగ్‌ కేంద్రాల్లోని ఈవీఎమ్‌లలో మూడు దశల్లో తమ ఓటుహక్కును వినియోగించుకుంటారు.

దేశంలోని అయిదు అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల్లో అందరిదృష్టీ పశ్చిమ్‌ బంగ మీదే ఉంది. కానీ కీలక మెలిక అసోమ్‌లో ఉంది. దశాబ్దాల తరబడి అసలు తమకు ప్రాతినిధ్యం లేని రాష్ట్రంలో దాదాపు 68 శాతం సీట్లతో ఎన్డీయే అధికారం చేపట్టడం సామాన్యమైన విషయం కాదు. ఎప్పుడో 1978-79 సంవత్సరాల మధ్య జనతాపార్టీ ప్రభుత్వం అసోమ్‌లో ఉండేది. తరవాత మళ్లీ 2016లోనే భాజపా అక్కడ అధికార పీఠాన్ని దక్కించుకోగలిగింది. అసోమ్‌లో నెగ్గిన తరవాత ఈశాన్యప్రాంత ప్రజాస్వామ్య కూటమి (నార్త్‌ఈస్ట్‌ డెమొక్రాటిక్‌ ఎలయెన్స్‌-నెడా) పేరుతో ఒక కూటమిని ఏర్పాటుచేసి, దానికి హిమంత బిశ్వశర్మను కన్వీనర్‌గా నియమించారు. అప్పటినుంచి దాదాపు ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ స్వయంగానో, మిత్రపక్షాల సాయంతోనో క్రమంగా అధికారాన్ని భాజపా సొంతం చేసుకుంది. ఇప్పటికే కొన్ని మిత్రపక్షాలు చేజారడం, తాజాగా రాష్ట్రీయ జనతాదళ్‌ లాంటి పార్టీలూ భాజపాను నిలువరించేందుకు అసోమ్‌లో రంగప్రవేశం చేస్తుండటం వంటి పరిణామాలు కమలనాథులకు మింగుడుపడేవి కావు. ఈ అడ్డంకులను అధిగమించి మరోసారి అసోమ్‌లో అధికారాన్ని భాజపా చేపట్టగలదా?

2016 అసోమ్‌ అసెంబ్లీ ఎన్నికలలో భాజపా సొంతంగా 60, మిత్రపక్షాలైన అసోమ్‌ గణపరిషత్‌ (ఏజీపీ), బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ (బీపీఎఫ్‌)లతో కలిపి 86 స్థానాలు గెలుచుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 14 స్థానాలకు గాను తొమ్మిది చోట్ల భాజపా గెలిచింది. దశాబ్దాల పాటు అసోమ్‌లో రాజ్యమేలిన కాంగ్రెస్‌పార్టీని కేవలం మూడే స్థానాలకు పరిమితం చేసింది. ఇన్నాళ్లూ అక్కడ కేవలం జాతులకు సంబంధించిన విషయాలే ఎన్నికల ప్రధానాంశాలుగా ఉండగా దాన్ని కాస్తా హిందూ-ముస్లిం, భారతీయ-భారతీయేతర విషయాల మీదకు విజయవంతంగా మళ్లించగలిగింది. ఈసారి ఎన్నికల సమయానికి తమ మిత్రపక్షమైన అసోమ్‌ గణపరిషత్‌ క్రమంగా బలహీనపడటంతో కొత్తగా యూపీపీఎల్‌తో భాజపా జట్టుకట్టింది. బోడో విద్యార్థి నాయకుడైన ప్రమోద్‌ బోడో ఈ పార్టీని స్థాపించారు. కొన్ని మిత్రపక్షాలు దూరం కావడం, మరికొన్ని చేరువ కావడం లాంటి పరిణామాల మధ్య భాజపా మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటే పర్వాలేదు గానీ, ఓడితే మాత్రం ఈశాన్య రాష్ట్రాల్లో తన పట్టు మొత్తాన్ని కోల్పోతుంది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) రగిల్చిన నిరసన మంటలు అసోమ్‌లో వ్యాపించినంతగా మరే రాష్ట్రంలోనూ లేవు. సహజంగా, ఈ వివాదంతో భాజపా పీకల్లోతు మునిగిపోవాల్సిందే! కానీ 2020లో జరిగిన బోడోలాండ్‌ ప్రాంతీయ మండలి (బీటీసీ) ఎన్నికల్లో కొత్త వ్యూహాన్ని అనుసరించింది. మిత్రపక్షమైన బీపీఎఫ్‌ను పక్కన పెట్టి ఐక్య ప్రజావిమోచన పార్టీ (యూపీపీఎల్‌)తో జట్టుకట్టి గట్టెక్కింది. 40 స్థానాలున్న బీటీసీలో బీపీఎఫ్‌ 17 స్థానాలు గెలిచి ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. యూపీపీఎల్‌ 12 చోట్ల, భాజపా తొమ్మిది చోట్ల గెలవడంతో 21 స్థానాలతో ఎన్డీయే అక్కడ పాగా వేసింది.

కాంగ్రెస్‌ పార్టీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా అసోమ్‌లో ఇటీవలే రెండురోజులు పర్యటించి, గిరిజనులతో కలిసి ఝుముర్‌ నృత్యం చేసి తమ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన మహాకూటమిలో ఎంపీ బద్రుద్దీన్‌ అజ్మల్‌ నేతృత్వంలోని ఏఐయూడీఎఫ్‌, బోడో పీపుల్స్‌ ఫ్రంట్‌, సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్‌) ఉన్నాయి. ఇతర పార్టీలకూ ద్వారాలు తెరిచే ఉంటాయని కూటమి నేతలు ప్రకటించారు. అయితే కాంగ్రెస్‌కు రాష్ట్రంలో చెప్పుకోదగ్గ నాయకత్వం లేకపోవడం పెద్ద సమస్య. మూడుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తరుణ్‌ గొగోయి మరణానంతరం ఆ పార్టీలో నాయకత్వలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరోవైపు సీఏఏకు వ్యతిరేకంగా అసోమ్‌ జాతీయ పరిషత్‌ (ఏజేపీ), రైజొర్‌దళ్‌ కలిసి మరో కూటమిగా ఏర్పడ్డాయి. ఏజేపీకి లురిన్‌జ్యోతి గొగోయి, రైజొర్‌దళ్‌కు అఖిల్‌ గొగోయి నేతృత్వం వహిస్తున్నారు. అఖిల అసోమ్‌ విద్యార్థి సంఘం (ఆసు), అసోమ్‌ జాతీయవాదీ యువ ఛాత్ర పరిషత్‌ ఏజేపీకి మద్దతిస్తున్నాయి. రైతు సంఘాలతో కూడిన కేఎంఎస్‌ఎస్‌ అండ రైజొర్‌దళ్‌కు ఉంది. ఈ రెండు పార్టీలు ఏమాత్రం ప్రభావం చూపినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు మహాకూటమికి, ఈ కొత్త కూటమికి మధ్య కొంతవరకు చీలే అవకాశం ఉంది.

- పి.రఘురామ్‌
 

Posted Date: 06-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం