• facebook
  • whatsapp
  • telegram

అసోం రాజకీయాల్లో మలుపు

కొత్త కూటమితో ఉత్కంఠ

ఈశాన్య భారత్‌లోని కీలక రాష్ట్రమైన అసోమ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ రణక్షేత్రంలో ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కొత్త కూటమి (ఫ్రంట్‌) రంగంలోకి ప్రవేశిస్తుండటంతో రాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరగనున్నాయి. ఈ పరిణామం అధికార భాజపా ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి తలనొప్పిగా పరిణమించే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ పరిశీలకుల అంచనా.

బలమైన ప్రాంతీయ ఆకాంక్షలు, అస్తిత్వ రాజకీయాలు, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై తీవ్ర వ్యతిరేకతతో అసోం జాతీయ పరిషత్‌ (ఏజేపీ), రైజోర్‌ దళ్‌ (ఆర్‌డీ) అనే రెండు రాజకీయ పార్టీలు కొత్త ఫ్రంట్‌గా జట్టు కట్టాయి. ఏప్రిల్‌ మధ్యలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోరు బరిలో నిలిచేందుకు కొత్త కూటమి సిద్ధమైంది. ఇది కీలకశక్తిగా అవతరించి, ఎన్నికల అంచనాలను తారుమారు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ కూటమికి వివిధ వర్గాల్లో విస్తృతమైన మద్దతు ఉన్నా, దాన్ని ఎన్నికల్లో విజయంగా మార్చుకోగలుగుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది. కొత్త రాజకీయ కూటమి ఏర్పాటుకు మూలాలు- పౌరసత్వ సవరణ బిల్లు(సీఏబీ)ను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలు, విస్తృతంగా వ్యాపించిన నిరసనల్లోనే ఉన్నాయి. సీఏబీకి వ్యతిరేకంగా 2019 జనవరిలో ఆందోళనలు మొదలవ్వగా, 2019 అక్టోబర్‌ నాటికి తీవ్రస్థాయికి పెరిగాయి. బిల్లు కాస్తా సీఏఏ చట్టంగా మారడంతో హింస పెచ్చరిల్లింది.

అసోం జాతీయ పరిషత్‌(ఏజేపీ)కు నేతృత్వం వహిస్తున్న లూరిన్‌జ్యోతి గొగోయ్‌కి శక్తిమంతమైన ఆల్‌ అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఏఏఎస్‌యూ) అండదండలున్నాయి. 1979 నుంచి 1985 వరకు విదేశీయులకు వ్యతిరేకంగా ఉద్యమించిన చరిత్ర ఏఏఎస్‌యూకు ఉంది. ఏఏఎస్‌యూకు ఉన్న విస్తృత వ్యవస్థాగత బలాన్ని తోడుగా చేసుకొని ఏజేపీ బ్రహ్మపుత్ర లోయలో వ్యాపించింది. దాదాపు అచేతనంగా మారిన అసోం గణ పరిషత్‌ (ఏజీపీ) సభ్యులు, మద్దతుదారులను ఏజేపీ ఆకర్షించింది. దీనికితోడు, అస్సామీ ప్రాంతీయవాదుల మద్దతు తనకే దక్కుతుందని ఏజేపీ ఆశిస్తోంది. గొగోయ్‌ ఏఏఎస్‌యూ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఏజేపీ మద్దతుదారులు ఎక్కువగా యువత, సాంకేతికత ప్రియులు కావడంతో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి విభిన్న దృక్కోణాల్ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. సంప్రదాయ ఎగువ, దిగువ అసోం రాజకీయ భేదాలు, కుల సమీకరణాలు వంటివి వీరి రాజకీయ అజెండాలో ముఖ్యాంశం కాకపోయినా, కేంద్ర అధికారాల్ని పరిమితం చేయడం ద్వారా అసోమ్‌కు భారీ ప్రయోజనాల్ని సాధించవచ్చనే సమాఖ్యవాదనే కీలక సిద్ధాంతంగా తెలుస్తోంది.

మరోవైపు- రైతునేత, సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు అఖిల్‌ గొగోయ్‌ నేతృత్వంలోని రైజోర్‌ దళ్‌ (ఆర్‌డీ) కృషక్‌ ముక్తి సంగ్రామ సమితి(కేఎంఎస్‌ఎస్‌)కి రాజకీయ విభాగం. ప్రధానంగా అసోం వ్యవసాయ రాష్ట్రమైనా అక్కడి రైతులకు సంస్థాగతమైన బలం కొరవడింది. తొలిసారిగా రైతులందరినీ ఒకే ఛత్రం కిందికి తీసుకొచ్చిన ఘనత అఖిల్‌దే. కాలక్రమంలో కేఎంఎస్‌ఎస్‌ తనకంటూ సొంత బలాన్ని సమకూర్చుకుంది. ఇందుకు కొన్నేళ్లుగా సాగిస్తున్న ఆనకట్టల వ్యతిరేక ఉద్యమం, సహచట్టంపై క్రియాశీలత దోహదపడ్డాయి. రైతాంగ మద్దతుకు తోడు, పశ్చిమ అసోమ్‌లోని బెంగాలీ మాట్లాడే ముస్లిముల ఆదరణ చూరగొంది. వీరంతా బద్రుద్దీన్‌ అజ్మల్‌ నేతృత్వంలోని ఆల్‌ ఇండియా యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఏఐయూడీఎఫ్‌) మద్దతుదారులుగా పేరొందారు. సీఏఏను బలంగా వ్యతిరేకించడం ద్వారా కేఎంఎస్‌ఎస్‌ బెంగాలీ మాట్లాడే ముస్లిములలో తన ప్రాబల్యాన్ని గణనీయంగా పెంచుకుంది. ఏజేపీ తరహాలోనే ఆర్‌డీ సైతం తనకున్న ఆదరణను ఓట్ల రూపంలోకి ఏ మేరకు మరల్చుకుంటుందనేది ప్రాథమిక ప్రశ్న.

కార్బి గిరిజనుల్లో గణనీయమైన ప్రాబల్యమున్న ‘అటానమస్‌ స్టేట్‌ డిమాండ్‌ కమిటీ (ఏఎస్‌డీసీ)’ పార్టీతో ఏజేపీ కూటమి కట్టింది. పశ్చిమ అసోమ్‌లోని బోడోల ఆధిపత్యం అధికంగా ఉండే ప్రాంతానికి చెందిన ‘బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ (బీపీఎఫ్‌)’తోనూ ఒప్పందానికి పావులు కదుపుతుండటం ఆసక్తికర   పరిణామం. మరోవైపు, కాంగ్రెస్‌ పార్టీ ఏఐయూడీఎఫ్‌, సీపీఐ-మార్క్సిస్ట్‌, సీపీఐ, సీపీఐ (మార్క్సిస్ట్‌-లెనినిస్ట్‌)లతో కలిసి బరిలోకి దిగనుంది. కాంగ్రెస్‌కు మునుపెన్నడూ లేనంతగా అవకాశాలు సన్నగిల్లి పోతున్నా... ఏఐయూడీఎఫ్‌ కీలకంగా అవతరించే అవకాశం కనిపిస్తోంది.  2016 నాటి అసోం అసెంబ్లీ ఎన్నికల్లో 126 స్థానాలకుగాను భాజపా 60 సీట్లు గెలవగా, భాజపా మిత్రపక్షాలు ఏజీపీ 14, బీపీఎఫ్‌ 12 స్థానాలు గెలిచాయి. కాంగ్రెస్‌ 26, ఏఐయూడీఎఫ్‌ 13 స్థానాల్లో నెగ్గగా- ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో మారిన రాజకీయ సమీకరణల దృష్ట్యా ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

- సంజీవ్‌ కె.బారువా
 

Posted Date: 12-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం