• facebook
  • whatsapp
  • telegram

ఎన్నికల పోరులో మత పాచికలు

పశ్చిమ్‌ బంగలో కొత్త సమీకరణలు

పశ్చిమ్‌ బంగ రాజకీయాల్లో మునుపెన్నడూ చూడని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హిందూ ధర్మశాస్త్రాల్లోని సూక్తులు, వేద మంత్రాలను వల్లెవేస్తూ తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ప్రచార సభల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మరోవంక వీధుల వెంబడి ఆలయాలు కనిపించిన ప్రతి చోటా భాజపా నేతల ప్రచార రథాలు ఆగిపోతున్నాయి. ఆ పార్టీ జాతీయ సారథి జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌ షా మొదలు బెంగాలీ స్థానిక నాయకుల వరకూ అందరిదీ ఇదే పంథా! భాజపాలోకి ఇటీవల ప్రవేశించిన బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి కోల్‌కతాలోని కాళీమాత ఆలయం సమీపంలో కూర్చుని విరామ సమయాల్లో ప్రతి రోజూ తాను పూజలు ఎలా చేస్తారో, శ్లోకపఠనం ఎలా సాగిస్తారో అభిమానులకు మురిపెంగా వివరిస్తున్నారు. పశ్చిమ్‌ బంగ అసెంబ్లీ రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా మతం పతాక శీర్షికల్లో నిలుస్తోంది. బెంగాలీ రాజకీయ నాయకుల దినచర్యలో ఆలయ సందర్శన ఇప్పుడు అనివార్యమవుతోంది. మతప్రాతిపదికన ప్రజలను సమీకరించే ధోరణి పశ్చిమ్‌ బంగలో బలపడుతోందా? ఆ బాటలో ముందుకు సాగితే తప్ప ప్రజామోదం సాధించలేమని మమతా బెనర్జీ సైతం భావిస్తున్నారా?

‘కొంతమంది నందిగ్రామ్‌ను 70-30 ప్రాతిపదికన (హిందూ, ముస్లిం జనాభా శాతం) విభజించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. నాకు మీ వంద శాతం మద్దతు కావాలి’ అంటూ నందిగ్రామ్‌ వేదికగా మమతా బెనర్జీ ఇటీవల పిలుపిచ్చారు. నందిగ్రామ్‌నుంచి అసెంబ్లీకి పోటీపడుతున్న మమతా బెనర్జీ ఆ స్థానంలో భాజపానుంచి సువేందు అధికారి, సీపీఐ(ఎం)కు చెందిన మీనాక్షి ముఖర్జీని ప్రత్యర్థులుగా ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజుల క్రితం నందిగ్రామ్‌లో మాట్లాడుతూ ‘62 వేలకు... 2.13 లక్షలకు’ మధ్య జరుగుతున్న పోటీగా సువేందు అధికారి ఈ ఎన్నికలను అభివర్ణించారు. ఆయన మతాన్ని ఎక్కడా నేరుగా ప్రస్తావించకుండానే, జనానికి చెప్పాల్సిందంతా చెప్పేశారు! మమతా బెనర్జీ, సువేందు అధికారి ఇరువురూ ప్రజలకు కచ్చితమైన సంకేతాలు ఇస్తున్నారు. బెంగాలీ రాజకీయాల్లో మత ముద్ర స్పష్టంగా కళ్లకు కడుతోంది. నందిగ్రామ్‌లోని పుర్బ మేదినిపూర్‌ గ్రామంలో చండీ మంత్రాలు, హిందూ శ్లోకాలు ప్రతినిత్యం ప్రతిధ్వనిస్తున్నాయి. గడచిన రెండు దశాబ్దాల్లో నందిగ్రామ్‌ అసెంబ్లీకి ఒక్క ముస్లిం మైనారిటీ అభ్యర్థి కూడా లేకుండా జరుగుతున్న ఎన్నికలివి. ఈసారి నందిగ్రామ్‌నుంచి పోటీపడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులైన మమతా బెనర్జీ, సువేందు అధికారి, మీనాక్షి ముఖర్జీ... అందరూ మైనారిటీయేతరులే! మైనారిటీల మద్దతు లేకుండానే నందిగ్రామ్‌లో విజయం సాధించాలని అక్కడ పార్టీలు తలపోస్తున్నాయా అన్న ప్రశ్నకు ఆ నియోజకవర్గంలో జనాభా సమీకరణల పేరిట బెంగాలీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యల్లోనే సమాధానం వెదుక్కోవాల్సి ఉంటుంది.

మమతా బెనర్జీ ఒకవేళ నందిగ్రామ్‌నుంచి కాకుండా మరో నియోజకవర్గంనుంచి పోటీపడి ఉంటే భాజపా ఆశించిన విధంగా ఓట్ల చీలిక సాధ్యమయ్యేదేమో! కానీ తనను తాను అతిపెద్ద హిందువుగా అభివర్ణించుకుని ఆమె స్వయంగా రంగంలోకి దిగడంతో నందిగ్రామ్‌లో మెజారిటీ ఓట్లను మూడు పార్టీలూ సమానంగా పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవంక తృణమూల్‌ కాంగ్రెస్‌ ఈదఫా ‘సోషల్‌ ఇంజినీరింగ్‌’పై ప్రధానంగా దృష్టిపెట్టింది. వెనకబడిన వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తామని తృణమూల్‌ మేనిఫెస్టోలో ప్రస్తావించారు. మరోవంక 291మంది సభ్యుల పార్టీ జాబితాలో ముస్లిం మైనారిటీ అభ్యర్థుల సంఖ్య ఈసారి గణనీయంగా తగ్గిపోయింది. 2016లో మమతా బెనర్జీ 53 స్థానాల్లో ముస్లిం అభ్యర్థులను పోటీపెట్టి, 35చోట్ల విజయం సాధించారు. ఈ దఫా అధికార పార్టీనుంచి కేవలం 35మంది ముస్లిం అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండటం గమనార్హం. హిందూ ఓట్ల సమీకరణ పేరిట భాజపా రచించిన వ్యూహంలో మమతా బెనర్జీ చిక్కుకొన్నారనడానికి ఇది నిదర్శనమని ఎన్నికల విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ముస్లిం మైనారిటీల వాటాకు కోతపెట్టిన మమత మరోవంక తన జాబితాలో దళితుల ప్రాతినిధ్యం పెంచారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో ఎస్‌సీ, ఎస్‌టీలకు చెందిన 84 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 46 స్థానాల్లో భాజపా మెజారిటీ ఓట్లు సాధించింది. భాజపా పథకాలనుంచి మమతా బెనర్జీ పాఠాలు నేర్చుకుని వ్యూహం మార్చారా అన్నది తేలాల్సి ఉంది. మత సమీకరణలతో ఒక పార్టీ; మతంతోపాటు కులాల లెక్కలనూ తనకు అనుకూలంగా మార్చుకోవాలన్న తలంపుతో మరో పార్టీ ముఖాముఖి పోటీపడుతున్న ఈ ఎన్నికల్లో ఫలితాలు ఏ మలుపు తిరుగుతాయన్నది ఆసక్తికరమే!

- దీపాంకర్‌ బోస్‌
 

Posted Date: 19-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం