• facebook
  • whatsapp
  • telegram

గెలుపు వ్యూహాల్లో తలమునకలు

యూపీలో రాజకీయ పార్టీల ఎత్తులు జిత్తులు

కాశీ, అయోధ్య, మధురలకు కేంద్రస్థానమైన ఉత్తర్‌ ప్రదేశ్‌లో హిందుత్వ రాజకీయాలదే జోరు! 2017 ఎన్నికల్లో యూపీ శాసనసభలోని 403 సీట్లలో మూడువందలకుపైగా స్థానాలు గెలుచుకున్న భాజపా, అతివాద హిందుత్వ నేత యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. అప్పటినుంచి యోగి సర్కారు నేరస్థులు, మాఫియా ముఠాలపై ఉక్కు పిడికిలి బిగించింది. యోగి అధికారంలోకి వచ్చాక యూపీ పోలీసులు 8,472 ఎన్‌కౌంటర్లకు పాల్పడ్డారు. 156 మంది రాటుదేలిన నేరస్థులు హతమయ్యారు. ‘ఆపరేషన్‌ లంగ్డా’ పేరిట పోలీసులు కాళ్లకు గురిచూసి కాల్పులు జరపడంతో 3,300 మంది నేరగాళ్ల కాళ్లను శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి వచ్చింది. మరోవైపు, మతమార్పిళ్లను, బహిరంగ స్థలాల్లో నమాజ్‌ను నిషేధించారు. జిన్నా, తాలిబన్లు వంటివారిపై ఒంటికాలిపై విరుచుకుపడ్డారు. ఆజంఖాన్‌, ముఖ్తార్‌ అన్సారీ, ఆతిక్‌ అహ్మద్‌ వంటి ప్రముఖ నాయకులు జైళ్లలో మగ్గుతున్నారు. కొంతమంది ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మరికొందరి ఆస్తులు నేలమట్టమయ్యాయి. కాషాయధారి ముఖ్యమంత్రి నేరసామ్రాజ్యంపై విరుచుకుపడటంతోపాటు- సరికొత్త రహదారులు, ఎక్స్‌ప్రెస్‌దారుల నిర్మాణాన్ని విస్తృతంగా చేపడుతూ, నయా ఉత్తర్‌ ప్రదేశ్‌ను సాకారం చేస్తానని చెబుతున్నారు. తూర్పు యూపీని లఖ్‌నవూతో అనుసంధానిస్తూ 341 కిలోమీటర్ల పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ మార్గాన్ని నిర్మించారు. లఖ్‌నవూను దక్షిణాన ఉన్న ఝాన్సీతో కలిపే బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారి త్వరలో పూర్తికానుంది. రైతులకు మెరుగైన ధరలు కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన 27 ఆధునిక మండీల నిర్మాణం పూర్తి కావస్తోంది. 220 సరికొత్త మార్కెట్‌ యార్డులను నిర్మించారు. చిన్న, మధ్యతరహా రైతులకు లక్ష రూపాయల దాకా రుణమాఫీ ప్రకటించారు. రాష్ట్రంలోని 2.53 కోట్లమంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్‌ పథకం కింద రూ.6,000 చొప్పున అందించారు. పేదలకు 52 లక్షల ఇళ్లు నిర్మించి, 1.41 కోట్ల కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ కనెక్షన్‌ అందించారు. రాష్ట్రవ్యాప్తంగా 2.56 కోట్ల కొత్త మరుగుదొడ్లు నిర్మించారు. విద్యార్థులకు ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేస్తామని యూపీ సర్కారు ప్రకటించింది. మరోవైపు ప్రధాని మోదీ 16 లక్షలమంది స్వయంసహాయక బృందాల మహిళల ఖాతాల్లోకి వెయ్యికోట్ల రూపాయలు బదిలీ చేశారు. ఇలా- హిందుత్వ, సంక్షేమం వంటి జోడుగుర్రాల రథంపై పయనించి విజయాన్ని అందుకోగలనని భాజపా ఆశలు పెట్టుకొంది.

ఆసక్తికర  పరిణామాలు

మరోవైపు, యోగి ఆదిత్యనాథ్‌ ఉత్తర్‌ ప్రదేశ్‌ను 20 ఏళ్లు వెనక్కుతీసుకెళ్ళారని, ఎన్‌కౌంటర్లను నిత్యకృత్యం చేశారని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) తెగనాడుతున్నాయి. 19.26 శాతం ముస్లిం ఓట్లు, 10 శాతం యాదవ ఓట్లపై ఆశలు పెట్టుకొన్న ఎస్పీ- యూపీ జనాభాలో సగభాగమున్న ఓబీసీలను ఆకట్టుకోవడానికి గట్టిగా యత్నిస్తోంది. ముఖ్యంగా తూర్పు, మధ్య యూపీలోని 156 నియోజక వర్గాల్లో 12 నుంచి 22 శాతం ఓట్లున్న రాజ్‌భర్‌ల ఓట్లను ఆకర్షించేందుకు ఎస్పీ నేత అఖిలేష్‌ కృషి చేస్తున్నారు. రాజ్‌భర్‌, మరికొన్ని ఓబీసీ కులాలలో పట్టు ఉన్న సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ (ఎస్బీఎస్పీ)తో పొత్తు పెట్టుకున్నారు. ఈ పొత్తు తూర్పు యూపీలో భాజపాకు నష్టం కలిగించవచ్చు. 2017 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఎస్బీఎస్పీతో పొత్తుతో భాజపా 72 సీట్లు గెలుచుకుంది. పశ్చిమ యూపీలో జాట్లకు చెందిన రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్డీ)తో ఎస్పీ పొత్తు కుదుర్చుకుంది. పశ్చిమ యూపీ జనాభాలో సగంవాటా జాట్లు, ముస్లిములదే.  సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన రైతు ఉద్యమం మూలంగా ఆర్‌ఎల్‌డీ- ఎస్పీతో చేతులు కలిపిన క్రమంలో ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. 

వర్గాల సమీకరణ

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలం నామమాత్రంగా మారింది. ప్రధాన పార్టీలైన భాజపా, ఎస్పీలతో తలపడే సత్తా బీఎస్పీకి మాత్రమే ఉంది. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో తాము సాధించిన విజయాన్ని 2022లో పునరావృతం చేయాలని బీఎస్పీ అధినేత మాయావతి తనదైన వ్యూహంతో ముందుకెళుతున్నారు. యూపీ జనాభాలో 21 శాతంగా ఉన్న దళితులను, 10 శాతమున్న బ్రాహ్మణులను ఒకేతాటిపైకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. 2007లో దళిత-బ్రాహ్మణ కూటమి బీఎస్పీకి 206 సీట్లను సాధించిపెట్టింది. ఈసారి కూడా అలాంటి విజయంపై మాయావతి ఆశలు పెట్టుకున్నారు. యూపీలో బ్రాహ్మణులకు, రాజపుత్ర వర్గానికి మధ్యనున్న వైరాన్ని తనకు అనువుగా మలచుకోవాలని చూస్తున్నారు. 2007లో బీఎస్పీ 40 మంది బ్రాహ్మణులను అసెంబ్లీకి పంపితే, యోగి అధికారంలోకి వచ్చాక 400 మంది బ్రాహ్మణులను నకిలీ ఎన్‌కౌంటర్లలో హతమార్చారంటూ బీఎస్పీ బ్రాహ్మణ నేత సతీశ్‌చంద్ర మిశ్రా ఆరోపిస్తున్నారు. యూపీలో రాజపుత్రుల జనాభా 8.5 శాతమే. బ్రాహ్మణ వర్గానికి చెందిన ముఠా నాయకుడైన వికాస్‌ దూబేని రాజపుత్ర వర్గానికి చెందిన సీఎం యోగి సర్కారు ఎన్‌కౌంటర్‌ చేసిందనే ఆగ్రహం బ్రాహ్మణ వర్గంలో ఉన్నట్లు విదితమవుతోంది. దీనికితోడు, పరశురామ జయంతినాడు సెలవుదినాన్ని రద్దు చేయడమూ ఆగ్రహాన్ని పెంచుతోంది. వీరంతా పూర్తిగా బీఎస్పీ వైపు మరలిపోకుండా చూసేందుకు పోలీసులతోపాటు అనేక ప్రభుత్వ శాఖల్లో పలువురు బ్రాహ్మణులకు ఉన్నత పదవులు ఇచ్చారు. మాయావతి వర్గమైన జాతవులు రాష్ట్ర ఎస్సీ జనాభాలో 10 శాతం ఉంటారు. మిగతా దళిత కులాలను తనవైపు తిప్పుకోవడానికి భాజపా యత్నిస్తోంది. ప్రధాని చేపట్టిన పలు సంక్షేమ పథకాలు జాతవేతర దళితులను భాజపావైపు మళ్ళేలా చేస్తున్నాయి. అయితే, తరతరాలుగా ఫ్యూడల్‌ ఆధిపత్యానికి, అణచివేతకు పేరొందిన రాజపుత్రులకు యూపీ సింహాసనాన్ని కట్టబెట్టడంపై దళితులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ ఇటీవల సీఎం యోగి భుజాలపై చేయివేసి హితవాక్యాలు పలుకుతున్నట్లుగా కనిపించే ఫొటోను విస్తృత వ్యాప్తిలోకి తీసుకురావడం సైతం ప్రచారంలో ఓ భాగమేననే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా మళ్ళీ విజయ ఢంకా మోగించాలంటే 80 లోక్‌సభ సీట్లున్న ఉత్తర్‌ ప్రదేశ్‌ను గెలుచుకోవడం తప్పనిసరి. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలు యోగికే కాదు, మోదీకీ కీలకమే.

అభివృద్ధిమీదే ఆశలు

విపక్ష కూటములను ఎదుర్కోవడానికి వ్యవసాయ చట్టాల రద్దు తోడ్పడుతుందని భాజపా ఆశిస్తోంది. భూస్వాములైన జాట్‌లకు పోటీదారులైన త్యాగి వర్గానికి చెందిన భూస్వాములను, సైనీ, కాశ్యప్‌, గుజ్జర్‌ వంటి ఓబీసీ రైతు వర్గాలను కమలం పార్టీ కూడగడుతోంది. ఈ వర్గాలన్నీ కలిసి పశ్చిమ యూపీలో 60 సీట్లలో జయాపజయాలను ప్రభావితం చేయగలవనే వాదన ఉంది. యూపీ సర్కారు పశ్చిమ యూపీలో రూ.10 వేలకోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. చెరకు ధరలను పెంచి 45 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయానికి అతి సమీపంలో జాట్‌ రాజు మహేంద్ర ప్రతాప్‌సింగ్‌ పేరిట కొత్త వర్సిటీ నిర్మాణానికి సీఎం యోగి శంకుస్థాపన చేశారు.

- రాజీవ్‌ రాజన్‌
 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ స్త్రీ సాధికారతకు ఇదా మార్గం?

‣ చైనాకు పొరుగు పోటు

‣ నియంత్రణల నుంచి సరళీకరణ వైపు...

‣ భూమి హక్కుల్లో చిక్కులు

‣ హక్కుల పేరిట అమెరికా దూకుడు

Posted Date: 22-12-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం