* ఎన్నికల అధికారి ఆదేశం
అమరావతి: ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ)ను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా? వాయిదా వేస్తారా? అనే సందిగ్ధతకు ఈసీ తెరదించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే డీఎస్సీ షెడ్యూల్ను మార్చిన పాఠశాల విద్యాశాఖ అధికారులు.. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తామని ఇటీవల ప్రకటించారు. పరీక్ష కేంద్రాల ఎంపికకు మార్చి 20 నుంచి ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలని, 25 నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. కానీ, ఇంతవరకు వెబ్సైట్లో పరీక్ష కేంద్రాల ఎంపికకే అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో శనివారం (మార్చి 30) సీఈవో ప్రకటనతో అభ్యర్థుల ఉత్కంఠకు తెరపడింది. మరోవైపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను మార్చి 14న విడుదల చేయాల్సి ఉండగా ఇంతవరకు విడుదల చేయలేదు. ఈసీ నిర్ణయం మేరకు కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాల కోసం ఎదురు చూడాల్సిందే.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.