• facebook
  • whatsapp
  • telegram

APPSC Group-1: పట్టుపట్టి సాధించారు  

* గ్రూపు-1 ర్యాంకర్ల మనోగతం 
 

కుటుంబ ప్రోత్సాహమే గెలిపించింది
* గ్రూపు-1 టాపర్‌ రాణి సుస్మిత

పిఠాపురం, న్యూస్‌టుడే: కుటుంబ ప్రోత్సాహమే తనను టాపర్‌గా నిలిపిందని రాణి సుస్మిత చెప్పారు. కుటుంబంలో ఎక్కువ మంది విద్యావంతులు కావడం, భర్త సహా అందరి ప్రోత్సాహం లభించడం తన విజయానికి కారణమని పేర్కొన్నారు. తొలి 5 ర్యాంకుల్లో నిలుస్తానని భావించానని, మొదటి ర్యాంకు రావడం మరింత సంతోషాన్ని కలిగించిందన్నారు. డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుకు ఎంపికైన కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన రాణి సుస్మిత ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. పదో తరగతి వరకూ పిఠాపురంలో చదువుకున్నట్లు వివరించారు. ఎక్కడా కోచింగ్‌ తీసుకోకుండా... గతంలో ర్యాంకులు సాధించిన టాపర్ల సూచనలతో గ్రూప్స్‌కు సాధన చేసినట్లు చెప్పారు. ‘సివిల్స్‌ సన్నద్ధత గ్రూపు-1లో విజయం సాధించేందుకు ఉపయోగపడింది. గ్రూపు-1 మౌఖిక పరీక్ష దరఖాస్తులో నమోదుచేసిన వివరాల ఆధారంగా బోర్డు సభ్యులు ప్రశ్నలు వేశారు. సెంట్రల్‌ యూనివర్సిటీ, రాష్ట్ర యూనివర్సిటీల మధ్య ఉన్న వ్యత్యాసం, సుకన్య సమృద్ధి యోజన అంటే ఏమిటి? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాధాన్యం, పీహెచ్‌డీ చేసి, ఇటువైపు ఎందుకొచ్చారు? అన్న ప్రశ్నలు నాకు ఎదురయ్యాయి. ‘డూయింగ్‌ గ్రేటర్‌ గుడ్‌’ అనే సిద్ధాంతం నమ్మి... అధ్యాపకురాలిగా కంటే.. గ్రూపు-1 ఆఫీసర్‌ అయితే ఎక్కువ మందికి సేవలు అందించొచ్చని ఇటువైపు వచ్చినట్లు చెప్పాను’ అని సుస్మిత వివరించారు.
 

డిప్యూటీ కలెక్టర్‌గా రైతు బిడ్డ

లక్కిరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డి మండలం పందిళ్లపల్లె పంచాయతీ కోతులగుట్టపల్లెలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన కొండూరు శ్రీనివాసులు రాజు గ్రూప్‌-1 ఫలితాల్లో రెండోర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. 1వ తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్వగ్రామంలో... 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు రాయచోటిలోని ఓ ప్రైవేట్‌ విద్యా సంస్థలో చదివారు. కడపలో డిగ్రీ, తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంసీఏ చదివారు. తర్వాత దిల్లీలో కోచింగ్‌ తీసుకుని మూడు మార్లు సివిల్స్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూ దాకా వెళ్లారు. సామాన్య వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తనకు ఈ విజయం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని శ్రీనివాసులురాజు తెలిపారు.   - గ్రూపు-1 రెండోర్యాంకరు శ్రీనివాసులురాజు
 

రచనా నైపుణ్యం ఉండాలి

సివిల్స్‌ కంటే గ్రూపు-1 సిలబస్సే ఎక్కువ. ముఖ్యంగా ఏపీ ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ చాప్టర్లను అదనంగా చదవాల్సి వచ్చింది. గ్రూపు-1 కానీ... సివిల్స్‌లో కానీ మెయిన్స్‌కు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలు చూసి, జవాబులు ఎలా రాయాలో ముందుగానే సన్నద్ధం అయ్యాను. రైటింగ్‌ స్కిల్‌ బాగుంటేనే మార్కులు ఎక్కువగా వస్తాయి. గ్రూపు-1 ఇంటర్వ్యూలో ఇన్‌కంటాక్స్‌, సోషియాలజీకి సంబంధించిన ప్రశ్నలూ వచ్చాయి. నేను రామకృష్ణమఠంలో వాలంటీరుగా పనిచేసినందున స్వామి వివేకానంద గురించి ఏమి తెలుసు, బ్యూరోక్రసీలోకి వస్తే మీరు ప్రజలకు ఎలా సేవ చేస్తారన్న ప్రశ్నలు ఎదురయ్యాయి. మాది హైదరాబాద్‌. నా విజయంలో భర్త సహకారమెంతో ఉంది. ఇటీవల ప్రకటించిన యూపీఎస్సీ సివిల్స్‌-2021లో 37వ ర్యాంకు వచ్చింది. ఐ.ఎ.ఎస్‌. వచ్చే అవకాశం ఉంది. 2020 సివిల్స్‌లో 207వ ర్యాంకు వచ్చింది. ప్రస్తుతం అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇన్‌కంటాక్స్‌ ట్రైనింగ్‌ కోసం నాగ్‌పుర్‌లో ఉన్నా. గ్రూపు-1 తొలిసారి రాశా. డిజిటల్‌ మూల్యాంకనం ద్వారా వెల్లడైన జాబితాలో నా పేరు లేదు. సంప్రదాయ విధానంలో జరిగిన మూల్యాంకనం ద్వారా ఇంటర్వ్యూకు హాజరయ్యాను.   - సంజనా సింహా, హైదరాబాద్‌, గ్రూపు-1 మూడో ర్యాంకు

విజయవాడ గృహిణి ప్రతిభ

కానూరు, న్యూస్‌టుడే: విజయవాడ నగరంలోని కరెన్సీనగర్‌కు చెందిన నీలాపు రామలక్ష్మి (35) 2018 ఏపీపీఎస్‌సీ గ్రూపు-1 పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు కైవసం చేసుకుని డిప్యూటీ కలెక్టర్‌ కొలువుకు ఎంపికయ్యింది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఓ వైపు కుటుంబ బాధ్యతలు, మరో వైపు సాఫ్టువేర్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తూనే గ్రూప్‌-1లో సత్తా చాటారు.  ఆమె తండ్రి వెంకటేశ్వరరావు పవర్‌గ్రిడ్‌లో మేనేజర్‌ పనిచేసేవారు. తల్లి పార్వతి గృహిణి. రామలక్ష్మి 10వ తరగతిలో 77, ఇంటర్‌లో 85 శాతం మార్కులు సాధించారు. అనంతరం గుంటూరు ఆర్‌వీఆర్‌జేసీ కళాశాలలో బీటెక్‌ సీఎస్‌ఈ పూర్తి చేశారు. అందులో ఆమెకు 77 శాతం మార్కులు లభించాయి. అనంతరం బెంగళూరులో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ఆమె భర్త కొండలరావు కూడా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరే. వారికి సిదార్థ అనే 10 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. 
టాపర్స్‌ సూచనలతో 
గ్రూపు-1 సిద్ధం కావడానికి ముందుగా 2016 టాపర్స్‌గా నిలిచిన అనంతపురానికి చెందిన నిషాంత్‌రెడ్డి (ఆర్‌డీవో), తెలంగాణ రాష్ట్రం జగిత్యాల ఆర్‌డీవో మాధురిల సూచనలు తీసుకున్నానని, అవి ఎంతో ఉపయోగపడ్డాయని రామలక్ష్మి తెలిపారు. ప్రణాళికాబద్ధంగా రోజూ 6 గంటలకు తక్కువ లేకుండా సాధన చేయడం, డిప్యూటీ కలెక్టర్‌ కొలువుకు ఎంపిక కావడం, చిన్నప్పటి నుంచి గ్రూపు-1 విజేతగా నిలవాలన్న  లక్ష్యం నెరవేరడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఈడీ, జూనియర్‌ అసిస్టెంట్స్‌ పరీక్షలకు ఇదుగో వ్యూహం

‣ మెరుగైన మార్కులు ఎలా?

‣ ఉందా...మీకు రెండో మెదడు?

‣ అన్ని పరీక్షల్లోనూ ఉండే ప్రశ్నలివి! 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.