• facebook
  • whatsapp
  • telegram

DSC Recruitment: 11,062 ఉపాధ్యాయ ఉద్యోగాలు.. 4న దరఖాస్తుల ప్రక్రియ షురూ..

* అప్లికేషన్‌ ఫీజు ఎంతంటే?

* ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహణ
 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ జారీ అయింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫిబ్రవరి 29న డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీని ద్వారా మొత్తం 11,062 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పరీక్షల తేదీలను త్వరలోనే తెలియజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

పోస్టుల వివరాలు

గతేడాది సెప్టెంబరు 6న 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చిన ప్రకటనను రద్దు చేసిన విద్యాశాఖ, తాజాగా అదనపు పోస్టులను జత చేస్తూ 11,062 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 2,629 కాగా, 727 భాషా పండితులు, 182 పీఈటీ, 6,508 ఎస్జీటీ, ప్రత్యేక కేటగిరీ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 220, ఎస్జీటీ 796 ఉన్నాయి. అభ్యర్థులు మార్చి 4వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ పేర్కొంది. ఒక పోస్టుకు దరఖాస్తు రుసుము రూ.1,000గా నిర్ణయించింది. ఇతర కేటగిరీల పోస్టులకు విడిగా దరఖాస్తు చేస్తే వాటికి రూ.వేయి చొప్పున రుసుము చెల్లించాలి. 2023 జులై 1 నాటికి 18 ఏళ్లు నిండి 46 ఏళ్లలోపు ఉన్నవారు అర్హులు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, మాజీ సైనికులకు మూడేళ్లు, దివ్యాంగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. గత డీఎస్సీలోని పాతపోస్టులకు కొత్తగా ఖాళీలను జతచేస్తూ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసినందున పాత అభ్యర్థులు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

* 11 చోట్ల పరీక్ష కేంద్రాలు

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) విధానంలో జరిగే పరీక్షలను మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. జిల్లాలను ప్రాధాన్య క్రమంలో అభ్యర్థులు దరఖాస్తుల్లో పేర్కొనాలని, వాటి సామర్థ్యం, అందుబాటులో ఉన్న వాటిని బట్టి కేంద్రాలను కేటాయిస్తామని పేర్కొంది.

* వేర్వేరు తేదీల్లో పరీక్ష

గతేడాది విడుదల చేసిన డీఎస్సీకి 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వాటినీ పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. మొత్తం 10 రోజులపాటు ఈ పరీక్షలు జరుగుతాయి. ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులతోపాటు స్కూల్‌ అసిస్టెంట్‌లో గణితం, ఫిజిక్స్‌ వంటి వివిధ సబ్జెక్టులకు పోటీపడనున్న నేపథ్యంలో వేర్వేరు తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

* హైదరాబాద్‌లో అత్యధికం.. పెద్దపల్లిలో అతి తక్కువ

జిల్లాలవారీగా చూస్తే హైదరాబాద్‌లో అత్యధికంగా 878 డీఎస్సీ పోస్టులు భర్తీ చేయనున్నారు. అత్యల్పంగా పెద్దపల్లిలో 93 మాత్రమే ఉన్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు గరిష్ఠంగా ఖమ్మం జిల్లాలో 176 ఉండగా.. కనిష్ఠంగా మేడ్చల్‌లో 26 పోస్టులు ఉన్నాయి. ఇక ఎస్జీటీ పోస్టుల విషయానికి వస్తే అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో 537, అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 21 ఖాళీలు భర్తీ చేయనున్నారు.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 4.3.2024.

చివరితేదీ: 2.4.2024.

వెబ్‌సైట్‌

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.