• facebook
  • whatsapp
  • telegram

JEE Main: 25న జేఈఈ మెయిన్‌ ర్యాంకులు

* విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన ఎన్‌టీఏ
* తదనుగుణంగా అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తుల ప్రక్రియలో మార్పు
* ఏప్రిల్‌  21కి బదులు 27వ తేదీ నుంచి ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ ర్యాంకులు ఏప్రిల్‌ 25న విడుదల కానున్నాయి. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) వెల్లడించింది. ఫలితంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తుల ప్రక్రియ తేదీల్లో ఐఐటీ మద్రాస్‌ మార్పు చేసింది. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన 2.50 లక్షల మందికి మాత్రమే ఐఐటీల్లో బీటెక్‌లో చేరేందుకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసే అవకాశం కల్పిస్తారు. ఈసారి అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఐఐటీ మద్రాస్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్‌ ర్యాంకులను ఏప్రిల్‌ 20న వెల్లడిస్తామని గతంలో ఐఐటీ మద్రాస్‌కు ఎన్‌టీఏ సమాచారమిచ్చింది. దీంతో ఫలితాలు విడుదలైన మరుసటి రోజు ఏప్రిల్‌  21 నుంచి 30 వరకు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తామని ఐఐటీ మద్రాస్‌ గతేడాది డిసెంబరు 1న కాలపట్టిక విడుదల చేసింది. తాజాగా ఎన్‌టీఏ ఏప్రిల్‌  25న జేఈఈ మెయిన్‌ ర్యాంకులు వెల్లడిస్తామని ప్రకటించింది. ఫలితంగా ఐఐటీ మద్రాస్‌ ఏప్రిల్‌  21కి బదులు.. 27 నుంచి మే 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులు స్వీకరించేలా షెడ్యూల్‌లో మార్పు చేసింది. పరీక్ష మాత్రం యథాతథంగా మే 26న జరుగుతుందని ప్రకటించింది. జేఈఈ మెయిన్‌ చివరి విడత పేపర్‌-1 పరీక్షలు ఏప్రిల్‌  9న ముగిశాయి. పేపర్‌-1కు ఈసారి 12 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 95 శాతానికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 2.60 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 2.40 లక్షల మంది పరీక్షలు రాసినట్లు అంచనా.

* పరీక్ష మధ్యలో బయోమెట్రిక్‌ తీసుకోవడమా?

ఈసారి ఏపీలో పలు చోట్ల పరీక్ష ప్రారంభమైన తర్వాత బయోమెట్రిక్‌ హాజరు కోసం వేలిముద్రలు తీసుకోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. నిబంధనల ప్రకారం పరీక్ష ప్రారంభానికి ముందే బయోమెట్రిక్‌ తీసుకోవాలి. ఆ సమయంలో కొందరి వేలిముద్రలు నమోదు కాకపోవడంతో పరీక్ష ప్రారంభమైన తర్వాత సిబ్బంది వచ్చి పలుమార్లు ప్రయత్నించారు. ‘వేలిముద్రలు పడకుంటే పరీక్ష ముగిసిన తర్వాత తీసుకోవాలి. తీవ్రపోటీ ఉండే జాతీయస్థాయి పరీక్షలో ఒక్క నిమిషమూ విలువైందే. మా అబ్బాయి విజయవాడ కానూరులో ఏప్రిల్‌  9న పరీక్ష రాశాడు. తొలి విడతలో 99.74 పర్సంటైల్‌ వచ్చింది. ఈసారి ఇంకా మంచి పర్సంటైల్‌ సాధించాలని లక్ష్యంగా చదివాడు. సిబ్బంది అవగాహన రాహిత్యం కారణంగా దాదాపు 40 నిమిషాల సమయం వృథా అయ్యింది’ అని విజయవాడకు చెందిన ఓ విద్యార్థి తల్లి ‘ఈనాడు’తో వాపోయారు. విజయనగరంలోనూ ఇదే సమస్య కారణంగా విద్యార్థులు నష్టపోయినట్లు సమాచారం.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.