* ఇస్రో, తెలంగాణ ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యం
* ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు
ఈనాడు, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్టీయూ) రాష్ట్రంలో తొలి ఖగోళశాస్త్ర పరిశోధనల కేంద్రం అందుబాటులోకి రానుంది. ఇస్రో, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేయనున్నాయి. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఇతర అధికారులతో జేఎన్టీయూ ఉన్నతాధికారులు రెండు నెలల క్రితం ప్రాథమిక చర్చలు చేయగా.. తాజాగా ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు, నివేదికలను సిద్ధం చేస్తున్నారు. జేఎన్టీయూ క్యాంపస్లో ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై ఇప్పటికే ప్రభుత్వానికి వివరాలు అందజేశారు. ఈ కేంద్రం ఏర్పాటుకు రూ.50-60 కోట్ల వ్యయం కానుందని అంచనా వేస్తున్నారు. కొద్దిరోజుల్లో ఇస్రో శాస్త్రవేత్తలతో మరోమారు చర్చించిన అనంతరం ప్రయోగశాలల సంఖ్యపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక్కడ ప్రధానంగా గ్రహాలు, ఉపగ్రహాలపై శాస్త్రవేత్తలు, విద్యార్థులు నిరంతరం పరిశోధనలు నిర్వహించనున్నారు. అలాగే ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా జేఎన్టీయూలో స్పేస్ టెక్నాలజీలో బీటెక్, ఎంటెక్ కోర్సులు ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం అఖిల భారత సాంకేతిక విద్యామండలి అధికారుల అనుమతి తీసుకోనున్నారు. హైదరాబాద్లోని ఇస్రో అనుబంధ సంస్థ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సహకారంతో ఎంటెక్లో అంతరిక్ష ప్రాదేశిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం కోర్సును కూడా ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కోర్సుల ద్వారా అంతరిక్ష పరిశోధనపై ఆసక్తి కలిగిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయని జేఎన్టీయూ అధికారులు వివరించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.