* కష్టాలకు ఎదురీది 4 ఉద్యోగాలు కైవసం
* అన్నింటా పదిలోపే ర్యాంకులు
జన్నారం, న్యూస్టుడే: ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నా.. పట్టుదలతో చదువే శ్వాసగా కృషి చేసిన యువకుడు.. నేడు నాలుగు ప్రభుత్వ కొలువులు సాధించి ఔరా! అని ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ ఘనత సాధించిన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్కు చెందిన గాజుల రాజేందర్.. నాలుగు కొలువుల్లోనూ రాష్ట్రస్థాయిలో పదిలోపు ర్యాంకుల్లో నిలవడం విశేషం. ఇటీవల విడుదలైన గురుకుల డిగ్రీ లెక్చరర్ ఫలితాల్లో రెండో ర్యాంకు, జూనియర్ లెక్చరర్ పోస్టుల్లో 4, పీజీటీలో 8, టీజీటీలో రెండో ర్యాంకుతో ఉద్యోగాలు సాధించారు. డిగ్రీ కళాశాల లెక్చరర్గా త్వరలో నియామకపత్రం అందుకోనున్నట్లు తెలిపారు.
ఇంటర్ చదివే రోజుల్లో.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఏడాదిపాటు ముంబయి వెళ్లి కూలీ పనులు చేసిన రాజేందర్.. మళ్లీ చదువును కొనసాగించి ఇంటర్, డిగ్రీ పాసయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ, బీఈడీ చదివారు. ఆ సమయంలో దుకాణంలో పనిచేస్తూ ఖర్చులకు సంపాదించుకుంటూ చదువు పూర్తిచేశారు. అప్పటినుంచి మందమర్రిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. వివాహం అయి ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత సైతం పోటీ పరీక్షలకు సన్నద్ధమై ప్రస్తుత విజయాలు సాధించారు. చదువు మీద మక్కువతో ఇటీవల వైల్్్డ లైఫ్ మేనేజ్మెంట్ అంశంపై పీహెచ్డీలో చేరారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.