‣ నాస్కామ్ ఛైర్మన్ రాజేశ్ నంబియార్
ముంబయి: జనరేటివ్ కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ (బీపీఓ) రంగంలో పనిచేసే ఉద్యోగులు అధికంగా ముప్పు ఎదుర్కోనున్నారని ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ ఛైర్మన్ రాజేశ్ నంబియార్ పేర్కొన్నారు. భారత టెక్ పరిశ్రమలో కీలకమైన సాఫ్ట్వేర్ సేవల విభాగం మాత్రం ఈ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కాగ్నిజెంట్ ఇండియాకు ఛైర్మన్, ఎండీగా నంబియార్ వ్యవహరిస్తున్నారు. పుణెలో ఒక సెమినార్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐ ముప్పును గ్రహించి, 48.9 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.06 లక్షల కోట్ల) విలువైన దేశీయ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (బీపీఎం) పరిశ్రమ త్వరగా తన విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. 250 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 20.75 లక్షల కోట్ల) విలువైన దేశీయ ఐటీ పరిశ్రమపైనా కొంతమేర ఏఐ ప్రభావం చూపొచ్చని పేర్కొన్నారు. ‘తమ పనిలో ఏఐను వినియోగించలేని ఐటీ నిపుణులను.. ఏఐ వినియోగించే వారు భర్తీ చేసే ప్రమాదం ఉంద’ని నంబియార్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఖాతాదారుల అవసరాల కోసం ఏఐ ఆధారిత నైపుణ్యాలను తమ ఉద్యోగులకు కల్పించడానికి ఐటీ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. చివరకు మానవ సామర్థ్యాల్లో మాత్రమే తేడా ఉంటుందని, ప్రస్తుత వ్యవస్థతో ఏఐ సమీకృతమైనప్పుడు అసలైన మార్పులు వెలుగుచూస్తాయని నంబియార్ తెలిపారు. వైట్కాలర్ ఉద్యోగాలపైనే జనరేటివ్ ఏఐ ప్రభావం అధికంగా ఉంటుందని, కొత్త సాంకేతికతలకు మారాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. స్వల్పకాలంలో చూసుకుంటే మాత్రం జనరేటివ్ ఏఐ విషయంలో అధికంగా ఊహించుకుంటున్నామని పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.