ఈనాడు, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో సోమవారం నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి పరీక్షలకు యంత్రాగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, కె.శశాంక, గౌతమ్ రెవెన్యూ, విద్యాశాఖ అధికారులతోపాటు పోలీసులతో సమావేశాలు నిర్వహించి పరీక్షలు ప్రశాంతంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. మూడు జిల్లాల పరిధిలో 1.70 లక్షల మంది విద్యార్థులు రాయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. గంట ముందు కేంద్రాలకు చేరుకుంటే విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి ఉండదని వివరించారు. పాఠశాలలకు హాల్టికెట్లు వారం క్రితమే పంపించామని, అందనివారు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిణి ఆర్.రోహిణి సూచించారు.
కట్టుదిట్టమైన భద్రత: అన్ని కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యం ఉండేలా రెండురోజుల ముందే అధికారులు పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘా ఉండనుంది. పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయడంతోపాటు 144 సెక్షన్ విధించనున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ల సిబ్బంది ఎప్పటికప్పుడు పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించనున్నారు.
సెల్ఫోన్లు నిషిద్ధం..
విద్యార్థులు చరవాణులు తీసుకురాకూడదని విద్యాశాఖ అధికారులు సూచించారు. అధికారులతోపాటు,సూపరింటెండెంట్లు, ఉపాధ్యాయులు, పరీక్షల నిర్వహణ అధికారులూ ఎవరూ సెల్ఫోన్లు వినియోగించకూడదని స్పష్టం చేశారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.