* విచారణ ఈ నెల 28కి వాయిదా
హైదరాబాద్: ప్రభుత్వం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షను నిలిపివేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, విద్యా శాఖకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయడానికి విద్యాశాఖ ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేయాలని కోరుతూ పలువురు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ పుల్లా కార్తిక్ విచారణ చేపట్టారు.
నిబంధనలకు విరుద్ధమని వాదనలు
డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.. పరీక్షలకు సన్నద్ధం కావడానికి తగిన సమయం ఇవ్వలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సిలబస్ ఎంతో క్లిష్టంగా ఉందని, అభ్యర్థులు చదువుకోవడానికి సరైన సమయం కూడా ఇవ్వలేదని, ఇది విద్యా హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధమని వాదించారు. గురువారం నుంచి ప్రారంభమైన డీఎస్సీ పరీక్షలు ఆగస్టు 5 వరకు కొనసాగుతాయని, ఈ పరీక్షలు నిర్వహించకుండా మధ్యంత ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం.. పరీక్షలను నిలిపివేయడానికి నిరాకరిస్తూ.. తదుపరి విచారణను 28వ తేదీకి వాయిదా వేసింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.