• facebook
  • whatsapp
  • telegram

CBSE: సీబీఎస్‌ఈ పరీక్షలు ఏడాదికి రెండుసార్లు!

* మార్చి, జూన్‌ల్లో పది, పన్నెండు తరగతులకు అవకాశం

CBSE Exams: సీబీఎస్‌ఈ పది, 12వ తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించేలా కేంద్ర విద్యాశాఖ కొంతకాలంగా ముమ్మర కసరత్తు చేస్తోంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచే ఈ సరికొత్త విధానాన్ని అమలుచేసేలా వ్యూహరచన చేయాలని ఇప్పటికే సీబీఎస్‌ఈ (CBSE)ని కోరింది. ఈ క్రమంలోనే 12వ తరగతి పరీక్షలపై త్వరలోనే ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మార్చిలో ఒకసారి, జూన్‌లో రెండోసారి నిర్వహించే అంశాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలను (CBSE Board Exams) నిర్వహించే అంశంపై పాఠశాలల ప్రిన్సిపాళ్లతో ఇటీవల సీబీఎస్‌ఈ విస్తృత సంప్రదింపులు జరిపింది. ఇందులో సెమిస్టర్‌ విధానంపై చర్చించగా.. దానిపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఎప్పటిలాగే ఫిబ్రవరి-మార్చిలో 12వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్ష నిర్వహించి.. ఆ తర్వాత జూన్‌లో మరోసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సిఫార్సులను కేంద్ర విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం 12వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి-మార్చిలో బోర్డు పరీక్షలు నిర్వహించగా.. మే నెలలో ఫలితాలను విడుదల చేస్తున్నారు. ఆ తర్వాత విద్యార్థులు ఏదైనా ఒక సబ్జెక్టులో మాత్రమే మార్కులను పెంచుకునేందుకు ‘సప్లిమెంటరీ పరీక్షలు’ రాయొచ్చు. పాస్‌ కాని ‘కంపార్ట్‌మెంట్‌’ విద్యార్థులకు ఇక సప్లిమెంటరీ రాసే అవకాశముంది.

ఒకవేళ కొత్త విధానం అమల్లోకి వస్తే.. మార్చిలో పరీక్షలు రాసిన విద్యార్థులు జూన్‌లో మరోసారి అన్ని పరీక్షలు రాసేందుకు వీలుంటుంది. అయితే, అది పూర్తిగా విద్యార్థుల ఐచ్ఛికమే కానీ తప్పనిసరేం కాదట. ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష జేఈఈ మాదిరిగానే విద్యార్థులు తమ ఉత్తమ స్కోరును ఎంచుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. అంతేగాక, రెండోసారి అన్ని పరీక్షలు కాకుండా తమకు మార్కులు తక్కువ వచ్చిన ఒకటో రెండో పరీక్షలు కూడా రాసుకునే అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలను సంస్కరించడం ఇది తొలిసారేమీ కాదు. 2009లో పదో తరగతికి సీసీఈ (కంటిన్యూస్‌, కాంప్రెహెన్సివ్‌ ఎవల్యూషన్‌) విధానాన్ని ప్రవేశపెట్టారు. 2017లో దీన్ని ఎత్తేసి, మళ్లీ పాత విధానాన్నే అమలుచేశారు. కొవిడ్‌ సమయంలోనూ 10, 12 తరగతుల వార్షిక పరీక్షలను ఏడాదికి రెండు విడతలుగా నిర్వహించి.. తిరిగి పాత పద్ధతినే కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.