* ఈ నెలాఖరులో టీఏఎఫ్ఆర్సీ నోటిఫికేషన్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి ఇంజినీరింగ్తోపాటు ఫార్మసీ, మేనేజ్మెంట్ తదితర ఉన్నత విద్యా కోర్సులకు కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. మూడేళ్లకు ఒకసారి తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) రుసుములను సమీక్షించి కొత్తవాటిని ఖరారు చేస్తుంది. ఈ మేరకు 2022-23, 2023-24, 2024-25 విద్యా సంవత్సరాలకు కమిటీ సిఫార్సుల మేరకు 2022 జులైలో కొత్త ఫీజులను ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ రుసుములు ఈ విద్యా సంవత్సరం (2024-25) వరకే వర్తిస్తాయి. 2025-26 నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రావాల్సి ఉంది. అందుకే టీఏఎఫ్ఆర్సీ ఛైర్మన్ జస్టిస్ ఎ.గోపాల్రెడ్డి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఆచార్య శ్రీరాం వెంకటేష్, ఉన్నత విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి హరిత, జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ఆచార్య కె.వెంకటేశ్వరరావు, ఓయూ రిజిస్ట్రార్ ఆచార్య లక్ష్మీనారాయణ తదితరులు జులై 15న సమావేశమై కొత్త మార్గదర్శకాలపై చర్చించారు.
* ఆగస్టులో దరఖాస్తుల స్వీకరణ..
ఈ నెలాఖరుకు టీఏఎఫ్ఆర్సీ నుంచి నోటిఫికేషన్ జారీ కానుంది. ఆగస్టు తొలి లేదా రెండో వారం నుంచి కళాశాలల నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుంది. ఆయా కళాశాలలు గత 2-3 విద్యా సంవత్సరాల ఆదాయ, వ్యయాలను కమిటీకి సమర్పించాల్సి ఉంది. అనంతరం ఆయా కళాశాలల ప్రతినిధులను పిలిచి ప్రాథమికంగా నిర్ణయించిన ఫీజును తెలియజేస్తారు. ఏమైనా అభ్యంతరాలు చెబితే వాటిని పరిగణనలోకి తీసుకొని రుసుమును ఖరారు చేస్తారు. ఆ ఫీజుల వివరాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆమోదానికి పంపిస్తారు. అనంతరం ప్రభుత్వం జీవో జారీచేస్తేనే కొత్త రుసుములు అమల్లోకి వస్తాయి. సాధారణంగా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల ప్రారంభానికి ఒకట్రెండు రోజుల ముందుగా ఈ జీవో జారీ చేస్తుంటారు. ప్రస్తుతం ఇంజినీరింగ్కు గరిష్ఠంగా రూ.1.60 లక్షలు, కనిష్ఠంగా రూ.35 వేలు ఫీజుగా ఉంది.
* పాలిటెక్నిక్ కోర్సులకూ..!
పాలిటెక్నిక్ కోర్సులకు గత దశాబ్దకాలంగా ఫీజులు పెంచలేదని, వాటిని పెంచాలని కోరుతూ గత విద్యా సంవత్సరంలో పలు కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. దాంతో వాటికి కూడా టీఏఎఫ్ఆర్సీనే ఫీజులు నిర్ణయించాలని న్యాయస్థానం ఆదేశించింది. అప్పటివరకు రూ.40 వేల ఫీజు వసూలుకు కూడా అంగీకరించింది. అయితే రుసుములు ఖరారు చేయాలన్న ఆదేశాలు ప్రభుత్వం నుంచి రాకపోవడంతో కమిటీ సైతం మిన్నకుండిపోయింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి కూడా కదలిక లేదు. దాంతో హైకోర్టుకు వెళ్లిన పలు కళాశాలలు ఈసారి కూడా రూ.40 వేలు తీసుకుంటున్నాయి. అయితే కౌన్సెలింగ్ వెబ్సైట్లో మాత్రం అన్ని ప్రైవేట్ కళాశాలలకు రూ.15,780 మాత్రమే ఫీజు ఉన్నట్లు చూపుతున్నారు. మిగిలిన మొత్తాన్ని ఆయా కళాశాలలు విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయి. కొత్తగా టీఏఎఫ్ఆర్సీ నోటిఫికేషన్ జారీచేస్తున్న నేపథ్యంలో ఈసారి పాలిటెక్నిక్ కళాశాలలను కూడా చేర్చే అవకాశం కనిపిస్తోంది. ప్రతి విద్యా సంవత్సరం మొదట పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. ఈ మేరకు ఆ కళాశాలలకు ఫీజులు నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.