* విద్యాశాఖ మంత్రి లోకేశ్
అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతోన్న విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత విధానం అమలు చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన ఉన్నత విద్యపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫీజు రియంబర్స్మెంట్కు విధివిధానాలు తయారు చేయాలని సూచించారు. గత ప్రభుత్వ విధానాలతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని విమర్శించారు.
కళాశాలల్లో డ్రగ్స్ అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, డ్రగ్స్పై చైతన్యానికి స్వచ్ఛంద సంస్థల సాయం కోరాలని అధికారులకు మంత్రి లోకేశ్ సూచించారు. ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్ల నియామకాన్ని పరిశీలించాలన్నారు. 3,220 లెక్చరర్ పోస్టుల అంశం ప్రస్తావనకు రాగా.. న్యాయపరమైన చిక్కులు తొలగించి భర్తీకి కసరత్తు చేపట్టాలని చెప్పారు. పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా పోస్టుల భర్తీ ప్రక్రియ ఉండాలన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు తగ్గడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రూ.3,480 కోట్లు బకాయిలు ఇవ్వలేదని, దీంతో విద్యార్థుల ధ్రువపత్రాలు ఆయా సంస్థల్లోనే ఉండిపోయాయని చెప్పారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.